పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

19, నవంబర్ 2011, శనివారం

బాపుబొమ్మల హరివిల్లు - గజేంద్రమోక్షం

మనుషులు ఎన్ని కష్టాలు వచ్చినా తమకు తాము పరిష్కరించుకోవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు
ఆ ప్రయత్నంలో గెలిచినప్పుడు కొన్నిసార్లు సమస్యను మనమే తీర్చుకున్నాము అనుకుంటాం..
మరికొన్నిసార్లు దేవుడా నాకు ఈ కష్టాన్ని తీర్చు అని భగవంతుడిని ప్రార్దిస్తాం.
మనం అడిగినా అడగక పోయినా మన ప్రతి కష్టంలోనూ ఆ సర్వాంతర్యామి తోడుంటాడు..
క్షణమైనా మన సమస్య తీర్చి,మనల్ని కాపాడటానికి తోడుండే ఒకే ఒక్క ఆప్తుడు భగవంతుడు.
ఆపదలో వున్న తన భక్తులను కాపాడటానికి తను ఎలాంటి పరిస్థితిలో వున్నా లెక్క చేయక,
తన భక్తుడుని కాపాడటమే కర్తవ్యంగా పరుగు పరుగున శ్రీ మహాలక్ష్మితో సహా వచ్చే శ్రీ మహా విష్ణువు
వర్ణన తో కూడిన గజేంద్రమోక్షం అద్భుతంగా వుంటుంది.

ఎంతో అద్భతంగా పోతన రచించిన ఈ గజేంద్రమోక్షం మరెంతో అద్భుతంగా తన చిత్రాలతో వర్ణించారు బాపు.
బాపు బొమ్మల హరివిల్లు పుస్తకంలో గజేంద్ర మోక్షం చిత్రాలు చాలా బాగున్నాయి
వాటితో కలిపి పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షంలో నాకు నచ్చిన,మా అమ్మమ్మ చిన్నప్పుడు
మాకు నేర్పిన కొన్నిపద్యాలు తాత్పర్యాలతో



బాపు బొమ్మల హరివిల్లు - గజేంద్రమోక్షం
పోతన భాగవతం - గజేంద్ర మోక్షం


సరసిలోనుండి పొడగని సంభ్రమించి
యుదరి కుప్పించి లంఘించి హుంకరించి
భానుఁ గబళించి పట్టు స్వర్భానుపగిది
నొక్క మకరేంద్రుఁ డిభరాజు నొడిసిపట్టె.

గజేంద్రుడు తన ప్రియసఖులతో కలిసి ఒక కొలనులో జలకమాడుతుండగా
కొలనులోని ఒకమొసలి కొలనునుండి బయటికి వచ్చి
ఊపిరి బిగియపట్టి రొప్పుతూ గజేంద్రుని చెంతచేరి
రాహువు సూర్యుని మ్రింగుటకై పట్టినట్లుగా
గజేంద్రుని కాలు గట్టిగా పట్టుకునెను.

ఏనుగును బంధించుటకు మొసలి, మొసలి పట్టు నుండి తప్పుకొవటానికి ఏనుగు
ఒకదానినొకటి
బలంగా లాగుకొనుచుండగా
నీటిలోపలి మొసళ్ళు ఏనుగు కంటే మొసలి బలమైనదని,
బయటి ఏనుగులు మొసలి కంటే ఏనుగు బలమైనదని అనుకున్నాయి..
మొసలి ఎంతో పట్టుదలతో ఏనుగును వదలకుండా పట్టుకుంది.
గజేంద్రుడు మొసలి పట్టుకున్న తన కాలును విడిపించుకోలేక ఎంతో దిగులు పడుతూ

ఏ విధముగా నేను దీనిని జయించగలను? ఏ దేవుని ధ్యానించాలి?
ఎవరిని నాకు తోడుగా పిలవాలి?ఈ మొసలిని అడ్డగించే వారేవ్వరున్నారు?
దిక్కు లేని నా దీన ధ్వనిని విని నన్ను కాపాడు పరోపకారులగు పుణ్యాత్ములకు
నే మ్రొక్కెదను వారు నన్ను రక్షించెదరు..
అని పరి పరి విధములుగా భగవంతుని ప్రార్దిస్తున్నాడు గజేంద్రుడు

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వనిలోపల నుండు లీనమై;
యెవ్వని యందుడిందుఁ; బర మేశ్వరుఁ డెవ్వడు; మూల కారణం
బెవ్వఁడ నాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైనవాఁ
డెవ్వఁడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేఁడెదన్.

ఎవని వల్ల జగములు పుట్టి ,పెరిగి ,నశించుచున్నవో,
ఎవ్వ
డన్ని వస్తువులకు ప్రభువో,ఎవ్వడన్నిటికీ మూల కారణుడో,
ఎవ్వనికి
మొదలు నడుమ ఆఖరు అనునవి లేవో
ఎవడు సర్వాత్మ స్వభావుడో అట్టి భగవంతుని నన్ను కాపాడమని వేడుచున్నాను..


కలఁ డందురు దీనుల యెడఁ
గలఁ డందురు పరమయోగి గణములపాలం
గలఁ డందు రన్ని దిశలను
గలఁడు కలం డనెడువాఁడు గలఁడో లేఁడో.

దీనులు,యోగుల నందు ...అన్ని దిక్కుల్లోను
భగవంతుడు
నిండి ఉన్నాడని పెద్దలు చెప్తారు.
అట్టి భగవంతుని ఎన్ని విధాలుగా ప్రార్దించినను రాకున్నాడు..
ఉన్నాడన్న అట్టి భగవంతుడు వున్నాడా లేదా అని సందేహం కలుగుతుంది..


లావొక్కింతయులేదు; ధైర్యము విలో; లంబయ్యె బ్రాణంబులున్;
ఠావుల్దప్పెను; మూర్ఛవచ్చెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరంబెఱుగ మన్నింపందగున్ దీనునిన్
రావే ఈశ్వర; కావవే వరద; సంరక్షింపు భద్రాత్మకా!

ఈశ్వరా ఇంతవరకు మొసలితో పోరాడి నా బలమంతా తగ్గినది
ఇంతవరకు నేను మకరమును జయిస్తాను అనుకున్నాను
ధైర్యము పోయినది.. ప్రాణములు పైకెగిరి పోతున్నాయి.
మైకము వస్తుంది దేహం అలసటగా వుంది
ఈశ్వరా నీవు తప్ప వేరెవ్వరు తెలియదు.
నేనిదివరకు ఎన్ని అపరాధములు చేసి వున్నను
వానినెల్ల మన్నించి భగవంతుడా నా వద్దకు వచ్చి నన్ను కాపాడుము


అలవైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు
దా
,పల మందారవనాంతరామృతసరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంకరమావినోదియగు నా పన్న ప్రసన్నుండు
వి
హ్వల నాగేంద్రము 'పాహి పాహి' యనఁ గుయ్యాలించి సంరంభియై.

వైకుంఠపురంలోని ప్రధాన సౌధమునందు కల్పవృక్ష వనమందు,
అమృత సరోవర తీరమున చంద్రకాంత మణులు,కలువ పూవులు పరచిన పాన్పునందు
శ్రీ లక్ష్మీ దేవితో గూడ విహరించు చున్నవాడైన శ్రీ నారాయణుడు
తన భక్తుడగు గజరాజు నొచ్చిన వాడై దేవా నన్ను కావుము
అని ప్రార్ధించుచుండగా మొరలను విని తత్తరపాటున లేచి


సిరికిం జెప్పఁడు; శంఖచక్రయుగముం జేదోయి సంధింపఁడే
పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణి
కాం
తర ధమ్మిల్లముఁ జక్కనొత్తఁడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజ ప్రాణవనోత్సాహియై.

విధంగా శ్రీ మన్నారాయణుడు తానూ భక్త పరాధీనుడు కనుక
తన భక్తుడగు గజేంద్రుని ఆపద తీర్చుటకు బయలుదేరి, తొందరలో
లక్ష్మీదేవికి చెప్పక,శంఖ చక్రములను ధరించక,భటులను కూడా తీసుకొని పోక,
గరుడుని మీద ఎక్కక,జారిన జుట్టు ముడి వేసుకొనక,
లక్ష్మీదేవితో అపుడు వాడులాడుచు వేడుకతో తాను పట్టిన లక్ష్మీదేవి పైట కొంగును కూడా వీడక,
శ్రీదేవి పైటకొంగు నీడ్చుకునే బయలు దేరేను..


తన వెంటన్ సిరి, లచ్చివెంట నవరోధవ్రాతమున్, దాని
వెన్కను బక్షిమంద్రుఁడు, వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ
క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీ కాంతుండు రా వచ్చి
రొయ్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.

శ్రీమన్నారాయణుడు అట్లు తత్తరపడి పోవుటకు కారణము తెలుసుకొనుటకు
లక్ష్మీదేవి అతనిని వెంబడించింది .. లక్ష్మి వెంట అంతఃపురాంగనలందరు,
వారిని గరుత్మంతుడు వెంబడించెను. గరుత్మంతుడి వెనుక శంఖము,చక్రము
మొదలగు ఆయుధములన్నీ వచ్చెను.వాటి వెంబడి నారదుడు విష్వక్సేనుడు వచ్చిరి.
వారి వెంబడి వైకుంఠ పురము నందలి ఆబాలగోపాలము వచ్చిరి..


రాక్షసులను సంహరించు వాడు,దయా సాగరుడు,యోగీంద్రుల హృదయములనందు
నివసించు వాడు,భక్తులకు మహిమలను చూపు వాడు,ఆశ్రితులను మన్నించు వాడు,
ఎల్లప్పుడూ పెళ్లి కూతురివలె శోభించు లక్ష్మీ దేవి పతియగు శ్రీ మహా విష్ణువు
బాధలోనున్న ఆ గజేంద్రుని కష్టాన్ని చూసి ఆ మకరాన్ని ఖండించుటకు
తన చక్రాయుధాన్ని పంపెను ..ఆ చక్రాయుధము పోయి ఎలా అయినా సరే గజేంద్రుని జయించి
గెలుపొందాలన్న పట్టుదలతో వున్న మొసలి యొక్క శిరస్సు తుంచి దానిని సంహరించెను..

ఆ మొసలి పట్టు నుండి తప్పుకున్న ఆ గజరాజును శ్రీ మహావిష్ణువు తన చేతి స్పర్శతో తాకి
భయం పోగొట్టగానే రాహువుచే మింగబడి మరల విడువబడిన చంద్రుని వలె గజేంద్రుడు
బడలిక
విడచిన దేహముతో తన తోటి ఏనుగులతో చేరి విన సొంపుగా ఘీంకారము చేసినది..

Related Posts Plugin for WordPress, Blogger...