పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

15, మార్చి 2012, గురువారం

గురూజీలు అందరూ పూజ్యులేనా ???


ఉదయాన్నే
టీ వీ పెట్టటం ఆలస్యం స్వామీజీలు,బాబాలు దర్శనం ఇస్తూ ఉంటారు.
సదా చిదానంద స్వరూపులై... చిరునవ్వు నవ్వుతూ గురువు అనుగ్రహం కావాలంటే
సేవా పధాన నడవండి, పరోపకారమే పరమ ధర్మమని గ్రహించండి అని ఒక గురూజీ చెప్తాడు.
తోటి వారిని ప్రేమించండి..అందరి పట్లా దయ కలిగి ఉండండి, "To Live Is To Love"
అని మరొక "ఆర్ట్ ఆఫ్ లవింగ్" గురూజీ చెప్తాడు.

నాకు వీళ్ళందరూ చెప్పేవి వింటుంటే వీళ్ళు చెప్పే ఈ నైతిక విలువలన్నీ ముందు వీళ్ళు పాటిస్తారా
అని సందేహం కలుగుతుంది.వట్టి మాటల కన్నా ఆచరణ ముఖ్యం.
ప్రపంచ వ్యాప్తంగా తమ సేవా సంస్థలను స్థాపించి, విమానాల్లో విదేశీ యానాలు చేసి,
శాంతిని,ప్రేమను చాటించి వచ్చే గురూజీలు,వాళ్ళ సహాయకులుగా రాష్ట్ర వ్యాప్తంగా,జిల్లాలలో చిన్న
గురువులుగా చెలామణీ అయ్యే గురువు గారి అసిస్టెంట్లు వీళ్ళందరూ నిజంగా సామాన్య మానవులకి
ఉండే అసూయా,ద్వేషం,ఆవేశం,స్వార్ధం లాంటి లక్షణాలకు,లౌకిక విషయాలకు అతీతులేనా??

ఏది ఏమైనా ప్రస్తుతం ఈ బాబాలు,గురూజీలు విశ్వవ్యాప్తంగా, గొప్పగొప్ప వాళ్ళ అండదండలతో
ప్రజలకి నైతిక విలువల పట్ల అవగాహనను కల్పించి ప్రజల మనస్సుల్లో శాంతి,ప్రేమను
మొలకెత్తించే పనిలో బిజీ గా ఉంటున్నారు.వీళ్ళని అనుసరించి ఆరాధించే వాళ్ళు కూడా
చాలా మందే వుంటున్నారు. ఎవరి ఇష్టాలు వారివి..

మా అమ్మమ్మ చెప్పిన ఒక కధ :

ఇద్దరు
సన్యాసులు కలిసి ఒక చోటికి వెళ్తున్నారు.వాళ్ళిద్దరూ గురు శిష్యులు ధర్మ ప్రచారం
చేసుకుంటూ పోతున్నారు.ఇంతలో సాయంకాలమైంది.చీకటి పడబోతుండగా వాళ్లకు
ఒక నది అడ్డం వచ్చింది.అక్కడే ఒక పల్లెటూరి పిల్ల కూడా ఉంది.ఈ ఒడ్దు నుండి ఆ ఒడ్డుకు చేర్చే
బల్లకట్టు అక్కడ లేదు దాంతో ఆ పల్లెటూరి పిల్ల "ఈ రాత్రి వేళ నేను ఇక్కడ ఎలా ఉండాలి దేవుడా"
అని ఏడుపు మొదలుపెట్టింది.గురు శిష్యులిద్దరూ ఎంత ఓదార్చినా వినలేదు..ఏడుస్తూనే ఉంది.
చేసేది లేక శిష్యుడు ఆ అమ్మాయిని ఎత్తుకుని భుజం మీద వేసుకుని,ఒక చేత్తో ఆ అమ్మాయిని
పట్టుకుని,మరో చెయ్యి గురువు గారికి అందించి లోతు తక్కువగా ఉన్న వైపు అడుగులు వేస్తూ
మెల్లగా నది దాటాడు.

దాంతో గురువు గారు తీవ్రంగా చింతించారు,అతలాకుతలమయ్యారు,సన్యాసులు స్త్రీలను
తాకటమే నిషేధమైతే తన శిష్యుడు ఏకంగా ఒక పిల్లను భుజం మీద ఎక్కించుకుని మోశాడు
అయ్యో ఎంత ఘోరం,పాపం అంటూ పాదయాత్ర పూర్తయ్యి,ఆశ్రమం చేరే వరకు గురువు గారు
చీటికి మాటికీ ఆ పిల్ల ప్రస్తావన తెస్తూ శిష్యుడ్ని సాధిస్తూ,వేధిస్తూ వచ్చారు.

గురువు గారి సూటీ పోటీ మాటలు విసుగు చెందిన శిష్యుడు గురువుగారికి చేతులెత్తి నమస్కరించి,
" అయ్యా ! నేనా పిల్లను నా భుజం మీద నుంచి దించి,బరువు వదిలించుకుని నాలుగు రోజులైనా,
మీరు మాత్రం ఆ పిల్లను ఇంకా మీ ఆలోచనల్లో మోస్తూనే వున్నారు" అన్నాడు తీవ్ర స్వరంతో..
గురువు గారు బిత్తరపోయి మళ్ళీ ఆ పిల్ల మాట ఎత్తలేదు పాపం...

ఇతరులు ఎలా వుండాలి అనుకుంటున్నామో ,మనం అలాగ వుండాలి.ఏది చెబుతున్నామో
అదే చేయాలి.వట్టి మాటల కన్నా ఆచరణ ముఖ్యం...
గురువులంటే తాము ఒకరికి చెప్పే నీతులు,నైతిక విలువలను వారు ముందుగా ఆచరించాలి.
ఆదర్శాలను వారు ముందుగా పాటించాలి..అన్నిటిలో,అందరిలోను భగవంతుని చూస్తూ..
మనసును నిర్మలంగా ఉంచుకోవాలి.ఇలా తానూ పాటించి ఎదుటి వారికి నీతులు చెప్పేవాడు
"సన్యాసి" అవుతాడు లేకపోతె "సన్నాసి" అవుతాడు.

In reality there is neither guru nor disciple,
neither theory nor practice,
neither ignorance nor realization,

It all depends on what you take yourself to be.
Know your self correctly, There is no substitute to self-knowledge.



7 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

chaalaa manchi vishayam chakkagaa manasuki hattukunelaa cheppaaru raajee.. chaalaa baagundi. nathe! ika ye comment cheyanu.

జ్యోతిర్మయి చెప్పారు...

రాజి గారూ గురుశిష్యుల కథ బావుంది. ఏదైనా ముందు మనం ఆచరించాలి మనల్ని చూసిన వాళ్ళు అది నచ్చి ఆచరించాలి. బాగా చెప్పారు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

@ వనజవనమాలి గారూ
@ జ్యోతిర్మయి గారూ
నేను చెప్పిన విషయం, కథ నచ్చినందుకు థాంక్సండీ..

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

అన్నియు ’ విడిచిన ‘ వాడిని
పన్నుగ సన్యాసి యనగ భావింతురు , సం
పన్నులిపుడు గురువులు , మన
కున్న విచక్షణయు వారి కుండునొ లేదో ?

బ్లాగు: సుజన-సృజన

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"మన కున్న విచక్షణయు వారి కుండునొ లేదో ?"

"వెంకట రాజారావు . లక్కాకుల" గారూ..
ఇప్పటి గురూజీల గురించి చాలా చక్కగా చెప్పారండీ..
మీ స్పందనకు ధన్యవాదములు..

durgeswara చెప్పారు...

గురువులేకాదు ఏగురువులనాశ్రయిమ్చకున్నా మనిషన్నాక పాటిమ్చాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. ఆచరించకుండా చెప్పేవారే ఎక్కువవుతారు కలియుగాన అని భాగవతాదులలో ఏనాడొ హెచ్చరించారు. అది గురువులకే కాదు మనలాంటి సామాన్యులకూ వర్తిస్తుంది.
మనంకూడా ఎన్నెన్నో చెబుతాం కదా అవన్నీ మనం ఆచరిమ్చినవేనా ? కాకపోవచ్చు. అంతమాత్రాన మంచిని కోరటం మంచిగా ఉమ్దామని చెప్పటం అనుకోవటం తప్పుకాదనుకుంటాను.
శ్రీరామకృష్ణులొకసారి ఆచరించకుండా ధర్మ బోధలు చేసే ఒక వ్యక్తిని ఎందుకలా చెబుతున్నారు. మీరు ఆచరించకుండా బోధలెందుకు ? అనడిగారు.
అప్పుడతను స్వామీ !చీపురు స్వయంగా నీచమైనది అయినా శుభ్రంచేయటానికి పనికొస్తుందికదా అన్నాదట. అప్పుడు పరమహంస అవునుకదా అనుకున్నారట.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"durgeswara" గారూ..
మీ స్పందనను తెలియచేసి, ఎన్నో మంచి విషయాలను తెలియచేసినందుకు ధన్యవాదములు..

Related Posts Plugin for WordPress, Blogger...