పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

20, ఫిబ్రవరి 2013, బుధవారం

మీరైతే ఏం చేస్తారు???




నిన్న "వనజవనమాలి" గారు "మాంగల్యం తంతునానేనా" మంత్రం ఒక అలకారప్రాయంగా మారిపోయిందని, చిన్న విషయాలకే విడాకుల దాకా పోతున్న మన వివాహ వ్యవస్థను గురించి  చక్కని పోస్ట్  రాశారు.. అది చదివిన తర్వాత  నాకు కూడా ఈ మధ్యే ఎదురయిన ఒక సమస్యను
ఇక్కడ చెప్పాలనిపించింది

వివాహ బంధం పవిత్రమైన ఒక ప్రమాణం .. " నిన్ను నేను ఎప్పటికీ నీడలా కాపాడతానని భర్త,నీ వెంట నడిచి నీ అడుగులో అడుగవుతాను " అని 
భార్య ఒకరికొకరు చేసుకునే బాసలే పెళ్ళికి ఆరంభం.. 
కానీ ఆ పెళ్ళే ఒక అబద్ధం తో మొదలైతే అప్పుడు పరిస్థితి ఏమిటి??


ఇది ఈ మధ్యే జరుగుతున్న ఓక కేస్ కి సంబంధించిన వివరాలు :

ఈ కేస్ లో జంటకి  2008 లో ఎంగేజ్ మెంట్ అయ్యింది.ఎంగేజ్ మెంట్ రోజు అతని తల్లిదండ్రులు, బంధువులు అందరూ వచ్చి దగ్గరుండి జరిపించారు.. తర్వాత లగ్న పత్రిక రోజున ఒప్పుకున్న కట్నం లో కొంత ఇచ్చి లగ్నపత్రిక రాసుకున్నారు.ఆ లగ్నపత్రిక రాసుకునే రోజు పెళ్ళికొడుకు తండ్రి మీరిచ్చిన కట్నం మాకు సరిపోదు పెళ్లి ఖర్చుల కోసం మరో లక్ష రూపాయలు ఇవ్వమని అడిగారు.దానికి అమ్మాయి తరపు వాళ్ళు మేము ఇవ్వలేము ఇప్పటికి ఒప్పుకున్న వరకు మాత్రమే ఇస్తామని అన్నారు.అప్పుడు పెళ్ళికొడుకు తండ్రి అంత గతిలేని వాళ్ళు ఎందుకు మీకు ఈ సంబంధం అంటూ తిట్టి అవమానకరంగా మాట్లాడారు... పెద్దలు సర్దిచెప్పి లగ్నపత్రిక రాయించుకున్నారు.

పెళ్లిరోజు నాటికి అమ్మాయి వాళ్ళు ఎంత ఎదురుచూసినా,ఫోన్ లు చేసినా ఇదిగో వస్తున్నాము అదిగో వస్తున్నాము అంటూ మాట్లాడుతూనే తీరా పెళ్ళి సమయం మించి పోయిన తర్వాత పెళ్ళికొడుకు ఒక్కడే వచ్చి,మీరు మా నాన అడిగిన డబ్బులు ఇస్తామని ఒప్పుకోకుండా గొడవపడ్డారు అందుకనే మా వాళ్లకి ఈ పెళ్లి ఇష్టం లేక రాలేదు. మీకు అభ్యంతరం లేకపోతె నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నా జాబ్ నాకుంది మీ అమ్మాయిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని పెద్దమనుషులను అడిగాడు. బంధువులందరూ వచ్చి ఉన్నారు.  ఎలాగూ పెళ్ళికొడుకు మంచి వ్యక్తిలాగానే ఉన్నాడు.. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. సమస్య ఏముందిలే అని పెద్దమనుషులు నచ్చచెప్పటం తో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ పెళ్లి జరిగిపోయింది.

ఎన్నిసార్లు వీళ్ళిద్దరూ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడాలని ప్రయత్నించినా వాళ్ళు మాట్లాడలేదు... రెండు నెలలు భార్యా,భర్త ఇద్దరూ అబ్బాయి పని చేస్తున్న దగ్గర కలిసి ఉన్నారు.రెండు నెలల తర్వాత అబ్బాయి వాళ్ళ అన్నయ్య వీళ్ళ ఇంటికి వచ్చాడు. పెళ్లి జరిగిన కొన్నాళ్ళ వరకు తన తల్లిదండ్రులు మాట్లాడటం లేదు, తన దగ్గరికి రావటం లేదు అన్న బాధలో వున్న భర్త తన అన్నయ్య రాకతో సంతోషించాడు అలాగే ఈ అమ్మాయి కూడా.. ఇక అప్పటి నుండి ఆ అబ్బాయి తల్లిదండ్రులు, అక్కలు,అమ్మమ్మతాతయ్య,పిన్ని ఇలా అందరూ ఆ అబ్బాయికి ఫోన్ లు చేసి మాట్లాడటం మొదలు పెట్టారు. కానీ ఈ అమ్మాయికి మాత్రం అత్తింటి వారు ఎవరూ ఫోన్ చేయరు,మాట్లాడరు.. కోడలిగా వాళ్ళు అంగీకరించలేదు. దీనికి తోడూ భర్త లో కూడా ఈ అమ్మాయి వలన నావాళ్ళు నాకు దూరమయ్యారు  అన్న ఆలోచన మొదలయ్యింది. 

అతని బంధువులు ఎవరు ఫోన్ చేసినా,ముఖ్యంగా వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి చెప్పే మాట "నువ్వు జాగ్రత్త ఆ అమ్మాయి నీ డబ్బు కోసం ఆస్తి కోసం మేము రాకపోయినా నిన్ను పెళ్లి చేసుకుంది. వాళ్ళు గతిలేని వాళ్ళు " ఆ అమ్మాయి, తన తరపు వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారు వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకు, వాళ్ళను నీ ఇంటికి రానివ్వకు అని చెప్పేవాళ్ళు. ఇవే ,మాటలను అతను భార్యను అంటూ నీ వాళ్ళు రావద్దు అంటూ,నువ్వు నా డబ్బు కోసమే మా వాళ్ళు రాకపోయినా నన్ను పెళ్లి చేసుకున్నావు అనటం, మా వాళ్ళు నీ వల్లనే నాకు దూరమయ్యారు లేకపోతె వాళ్లకి నేనంటే చాలా ప్రేమ అంటూ ఈ అమ్మాయిని,తన తరపు వాళ్ళని అనుక్షణం మాటలతో హింసించేవాడు. కొన్నాళ్ళకి నేను మా అన్నయ్య దగ్గర ఉండి జాబ్ చేస్తాను అక్కడే ఉందాము అనటం మొదలు పెట్టాడు. ఇలా గొడవలు పడుతూ ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్న ల దగ్గర కూర్చుని ఈ అమ్మాయిని అక్కడికి రమ్మన్నాడు సరేనని ఆ అమ్మాయి అత్తగారింటికి  వెళ్ళింది. 

అక్కడికి వెళ్ళిన అమ్మాయిని తన వాళ్ళ ముందే ఇష్టమొచ్చినట్లు తిట్టి,కొట్టి నాకు మరో 10 లక్షలు కట్నం తీసుకుని వస్తేనే రా అంటూ అందరూ కలిసి బయటికి గెంటేసారు.. ఇదేమని వాళ్ళ పెద్దల్ని అమ్మాయి పెద్దలు అడిగితె "మీతో మాకు సంబందం లేదు మేము పెళ్ళికి రాలేదు" ఇదే వాళ్ళ సమాధానం.ఇలా రెండు సంవత్సరాల పాటూ ఈ అమ్మాయిని పుట్టింట్లోనే వదిలేసి అతను ఎక్కడ ఉన్నాడో చెప్పకుండా అతను, అతని తరపు బంధువులు ఆ అమ్మాయిని పట్టించుకోకుండా వదిలేసారు. పోలీస్ కేస్ పెట్టినా ప్రయోజనం లేదు, పెళ్ళికి వాళ్ళు ఎవరూ రాలేదు కాబట్టి వాళ్ళను మేము అరెస్ట్ చేయము అతనెక్కడో వాళ్లకి తెలియదట అని పోలీసుల సమాధానం. 

అప్పుడు ఆ అమ్మాయి తన భర్త ఆచూకీ కోసం హ్యూమన్ రైట్స్ కమిషన్ ను  ఆశ్రయించింది. అప్పుడు 498 కేస్ నమోదు చేసారు పోలీసులు. తమ్ముడ్ని ప్రోత్సహించి గొడవలు పెట్టి ,అతన్ని దాచిపెట్టిన అభియోగం కింద ఎంక్వైరీ కి వచ్చిన అతని అన్న చెప్పిన సమాధానం మా తమ్ముడు గత పది సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ ట్రీట్మెంట్ కోసం నేనే నా తమ్ముడిని హాస్పిటల్ లో ఉంచాను ఆ అమ్మాయి కి మేము కావాలనే చెప్పలేదు  అని చెప్పాడు.

ఇప్పటికి అతని అన్నని, నాన్నని అరెస్ట్ చేసిన పోలీసులు అసలు నిందితుడు భర్తని మాత్రం మొన్నటిదాకా మానసిక వ్యాధి కోసం ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలియదు అని కేస్ పెండింగ్ లో పెట్టారు... 

 చట్టం ,న్యాయం ఆ అమ్మాయికి పరిష్కారం కల్పించే సంగతి ఎలా ఉన్నా నైతికంగా ఆలోచిస్తే ఈ విషయంలో తప్పు ఎవరిది ??

కొడుకు గత పది సంవత్సరాలుగా పిచ్చివాడు అని తెలిసి కూడా ఎంగేజ్ మెంట్ చేసి, కట్నం తీసుకుని, పెళ్ళికి రాకుండా తప్పుకోవటం మోసం కాదా ??
 
 పెళ్లి జరిగిన క్షణం నుండీ అతనికి నెగటివ్ ఫెలింగ్స్ కలుగచేసి భార్యా,భర్త విడిపోవటానికి కారణమైన అతని కుటుంబ సభ్యులు పెళ్ళికి రాలేదు కాబట్టి వాళ్ళు ఈ నేరంలో భాగస్వాములు కారా ???

పిచ్చివాడైన కొడుక్కి ఎంగేజ్ మెంట్ ఎందుకు చేసారంటే అతని తండ్రి సమాధానం "ఎంగేజ్ మెంట్ కి రాకపోతే నా కొడుకు మమ్మల్ని చంపుతాను అన్నాడు అందుకే వచ్చాము" అని.. పిచ్చి కొడుకు చంపుతాను అంటే తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ ఇప్పించాలి కానీ ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారా??
 

 మేము పెళ్ళికి రాలేదు కదా అప్పుడైనా మానుకోకుండా  మీరు పెళ్లికి  ఎందుకు ఒప్పుకున్నారు అని అబ్బాయి తల్లిదండ్రుల వాదన.. పెళ్లిరోజు దాక వస్తామని మోసం చేసి,చివరి క్షణం లో రాకుండా మానేస్తే ఆ పెళ్లి ఆగిపోతే 
ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి ?? 

కొడుకును దగ్గర పెట్టుకుని అతని అవసరాలను అన్నిటినీ చూసుకునే తండ్రి కోడలిని మాత్రం నీతో మాకు సంబంధం లేదు, మా ఇంటికి రావద్దు అనటం న్యాయమేనా??

పెళ్లి సమయంలో మా వాళ్ళు రాకపోయినా పర్వాలేదు మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చి, తర్వాత నీ వల్ల  నా కుటుంబం నాకు దూరమయ్యింది వాళ్ళే నాకు ముఖ్యం అంటూ వాళ్ళతో కలిసి పిచ్చి నాటకం ఆడుతున్న ఆ భర్త నుండి, ఈ సమస్య నుండి అమ్మాయికి దొరికే పరిష్కారం ఏమిటి??

అసలు ఈ విషయంలో ఎవరు బాధితులు ?? ఎవరు నిందితులు ??

బ్లాగర్లు ఈ విషయం లో మీ అభిప్రాయాలను తెలియచేస్తారని ఆశిస్తాను..



Related Posts Plugin for WordPress, Blogger...