పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

30, మార్చి 2017, గురువారం

మా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు



నిన్న మా అమ్మ పుట్టినరోజు. మా అమ్మ ఉగాది పండగరోజే పుట్టింది కాబట్టి ప్రతి ఉగాదికి మాకు రెండు పండగలు.నిన్న face Book లో విషెస్ పెట్టాను.నా ఫ్రెండ్స్,మా తమ్ముడి ఫ్రెండ్స్ అందరూ అమ్మకి విషెస్ చెప్పారు. ఎప్పుడూ బ్లాగ్ లో కూడా విషెస్ పెట్టేదాన్ని ఈసారి పెట్టలేదు.కొంచెం లేట్ గా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను.ఎంతైనా బ్లాగ్లో రాసుకున్నవన్నీ మంచి జ్ఞాపకాలుగా  ఎప్పటికీ నిలిచిపోతాయి కదా.. 

ఉగాది రోజునే పుట్టిన మా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు
Happy BirthDay అమ్మ :)

మాలోనే తన చిన్నిప్రపంచాన్ని చూసుకుంటూ
నేను, తమ్ముడు,చెల్లి ఎలాంటి అసూయద్వేషాలు
లేకుండా ఎప్పటికీ ఒకరికొకరు తోడుగా నిలవాలనే ప్రేమ,ఆప్యాయతలు

ఎవరికీ మేలు చేయలేకపోయినా,కీడుమాత్రం చేయొద్దని, 
మాకు మేముగా ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో పాటు
కావాలని మాకు హాని చేయాలనుకునే వాళ్ళనుండి కాపాడుకోగలిగే ధైర్యం

ఎవరినుండి ఏమీ అతిగా ఆశించకూడదు,ఎవరి తోడు లేకపోయినా 
దేవుడు ఎప్పుడూ మనల్ని కాపాడతాడనే నమ్మకంతో పాటు,
సమాజంలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ,మాట్లాడాలనే హద్దులు తెలుసుకునే ఇంగితఙ్ఞానం

రాత్రి ఉంటే పగలు కూడా ఉంటుంది, ప్రయాణం ఉంటే గమ్యం కూడా ఉంటుంది, 
అలాగే ప్రతి సమస్యకీ పరిష్కారం ఉంటుంది కాబట్టి 
ఎన్ని సమస్యలున్నా ఎదుర్కోవాలనే ఆత్మవిశ్వాసం

అన్ని విషయాలు గురువు,నేస్తంగా నేర్పిన, నేర్పుతున్న 
మా అమ్మని ఆయురారోగ్యాలతో కాపాడమని భగవంతుడ్ని వేడుకుంటూ,
ఎప్పటికీ మాకు తోడుగా,మా అందరితో సంతోషంగా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటూ... 

Happy Birthday 🎂💐 అమ్మా 
Many Many Happy returns of the day...

నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా
నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
Love u మా 💕💞💝
Raaji,Vamsi,Ramya



6, మార్చి 2017, సోమవారం

మా తమిళనాడు యాత్రా విశేషాలు - భూలోక వైకుంఠం శ్రీరంగం


ఘన మునీంద్రులకు  అగమ్యమైయున్న నిను  
యీ ధరమీద పలుమారు దర్శింపగలిగే 
సంతతమును  వర్ణింపగలిగే  
చాలదా మా జన్మము


జంబుకేశ్వరం నుండి శ్రీరంగనాధుని దర్శనానికి వచ్చాము.తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలోఉభయకావేరీ నదుల మధ్య(కావేరీనది,దాని ఉపనది కొల్లిదం)ద్వీపంలో శ్రీరంగక్షేత్రం ఉంటుంది.108 ప్రధాన విష్ణుదేవాలయాల్లో(దివ్యదేశాలు) మొట్టమొదటి,అత్యంత ప్రధానమైన,భూలోక వైకుంఠంగా, భోగమండపంగా ప్రసిద్ధిచెందిన శ్రీరంగంలో రంగనాయకి అమ్మవారితో శ్రీరంగనాథస్వామి కొలువై ఉన్నారు.అతి పురాతనమైన, పూజలందుకుంటున్నవైష్ణవ దేవాలయాల్లో ఇది ఒకటి. దాదాపు 156 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు కిలోమీటర్లు పొడవైన ప్రాకారంతో ప్రపంచంలోనే పెద్ద దేవాలయం.ఆలయంలోకి ప్రవేశించే ప్రధాన రాజగోపురం (రాయల్‌ టెంపుల్‌ టవర్‌)236 అడుగుల ఎత్తు ఉంటుంది.తమిళనాడులో ఏ ఆలయాలు చూసినా ఇంతింత ఎత్తైనగోపురాలు ఎలా నిర్మించారో,ఎంతమందితో ఈ అద్భుతాలు సాధ్యమయ్యాయో కదా  అనిపిస్తుంది.శ్రీరంగం రాజగోపురం మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద రాజ గోపురం అని చెప్తారు.

రాజగోపురం 

స్థలపురాణం 
బ్రహ్మదేవుడు తాను పూజించే శ్రీ రంగనాధస్వామి విగ్రహాన్ని సూర్యవంశ ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చాడు.ఇక్ష్వాకు మహారాజు తర్వాత శ్రీరాముని దాకా తరతరాలుగా స్వామిని పూజిస్తూ ఉండేవారు.రావణసంహారం తర్వాత శ్రీరామ పట్టాభిషేకానికి లంక నుండి వచ్చిన విభీషణుణునికి రాముడు రంగనాథస్వామి విగ్రహాన్ని ఇస్తూ దారిలో ఎక్కడా కింద పెట్టొద్దని చెప్పాడట.అలాగే విభీషణుడు విగ్రహాన్ని తన చేతులలోనే ఉంచుకుని లంకకి బయల్దేరాడు.శ్రీరంగం దగ్గరికి రాగానే విగ్రహం విభీషనుడు మోయలేనంత బరువు పెరిగిపోయిందట.బరువు మోయలేక విభీషణుడు విగ్రహాన్ని నీలమీదకి దించగానే అక్కడే శ్రీరంగనాథుడు ప్రతిష్టితమయ్యాడు.విషయం తెలిసిన ఆ ప్రాంత పాలకుడు ధర్మచోళుడు విభీషణుని ఓదార్చి స్వామివారు ఇక్కడే ఉండటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఇక్కడే ఆలయాన్ని నిర్మిద్దామని ఆలయాన్ని నిర్మించాడని స్థలపురాణం.

రంగ రంగ రంగపతి రంగనాధా .. నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాధా.. 
 

ఇప్పటిదాకా మేము వెళ్లిన ఆలయాల్లో జనం చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ మాత్రం పెద్ద క్యూలు ఉన్నాయి. మామూలు రోజుల్లోనే జనాలు ఇంత క్యూలల్లో ఉన్నారంటే ఇక ఉత్సవాలప్పుడు పరిస్థితి ఏంటో అనిపించింది.50 రూపాయల క్యూ, 250 రూపాయల శీఘ్రదర్శనం క్యూ ఉన్నాయి.దేవాలయ గర్భాలయంలో విష్ణుమూర్తి ఆదిశేషుడిపై ఒక పక్కకి తిరిగి శయనించిన భంగిమలో,అమ్మవార్లతో కలిసి  దర్శనమిస్తుంటాడు.ఆదిశేషునిపై శయనించిన్నట్టుగా ఉండే రంగనాథస్వామిని చూడటానికి నిజంగానే రెండు కళ్లు సరిపోవు.సాక్షాత్తు పాలకడలిపై శేషతల్పమున పవళించిన విష్ణుమూర్తి కూడా ఇలాగే ఉంటాడేమో అనిపిస్తుంది.తల అటు,ఇటు తిప్పకుండా ఎదురుగా మాత్రమే చూస్తే స్వామిని మొత్తం చూడలేము.ఎంతసేపు చూసినా స్వామిని సరిగ్గా చూడలేదే అనిపించేలా ఉంది శ్రీరంగనాథుని దివ్యరూపం.

కొలువైతివా... రంగశాయి 
కొలువైన నిను చూడ కలవా కన్నులు వేయి. 

రంగనాథస్వామి కొలువై ఉన్న గర్భగుడి గోపురం విమానం ఆకృతిలో 
పూర్తిగా బంగారు తాపడం తో విభిన్నంగా ఉంటుంది. 

స్వామిని దర్శించుకున్నాక రంగనాయకి అమ్మ (లక్ష్మీదేవి) దర్శనానికి వెళ్ళాము.అమ్మని కనులారా చూడాల్సిందే కానీ,వర్ణించనలవికాదేమో అనిపిస్తుంది.అపూర్వమైన అలంకరణలో అమ్మవారు మెరిసిపోతూ దర్శనమిస్తుంది. "చక్కని తల్లికి చాంగుభళా తన చక్కరమోవికి చాంగుభళా", "క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మీకిని" అంటూ అమ్మని దర్శించిన ఆనందంలోనే అన్నమయ్య అంత మంచి కీర్తనలు రచించాడేమో అనిపిస్తుంది.ఇక్కడ అమ్మవారికి అలంకరించినన్ని రకాలపూలు ఇంతకుముందు ఎక్కడా చూడలేదేమో అనిపించేంత అందంగా, ఆహ్లాదకరంగా ఉన్నాయి.

క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని 
నీరజాలయమునకు నీరాజనం

అమ్మవారి ఆలయ మండపంలో అందమైన పూలు 

ఈ ఆలయం మొత్తం ఏడు ప్రాకారాలు, 21 గోపురాలు,24 మండపాలు ఉన్నాయి.అన్ని మండపాల్లో స్వామివారి విశేష సేవలు  జరుగుతాయి.4 ప్రాకారాలు దాటాక చెప్పులు వేసుకోకూడదు ప్రతి ప్రాకారంలో దేవతల విగ్రహాలు ఉంటాయి.శ్రీరంగనాథుని ఆలయ పరిధిలోనే మరికొన్ని సన్నిధానాలు, ఉపసన్నిధానాలున్నాయి (ఉపాలయాలు). అందులో తాయార్‌ సన్నిధి, చక్రథజవార్‌ సన్నిధి,రామానుజార్‌ సన్నిధి, గరుడాల్వార్‌ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, హయగ్రీవర్‌ సన్నిధి ఉన్నాయి.మూడవ ప్రాకారమునకు "ఆలినాడన్ తిరువీథి" అనిపేరు.ఈ వీధిలో గరుత్మంతుని సన్నిధిలో 25 అడుగుల ఎత్తైన గరుడాళ్వార్ విగ్రహం ఉంది.ఇంతకు ఎక్కడా చూడనటువంటి ఎత్తయిన గరుడాళ్వార్ ఇక్కడి ప్రత్యేకత.
ప్రాకారాల మీద శిల్పకళ 

ఆలయంలోపల 

ధనుర్మాసము,ధనుశ్శుద్ధ ఏకాదశి నాటి వైకుంఠద్వార దర్శనం కోసం 
వైకుంఠద్వారం కూడా చాలా ప్రత్యేకంగా అందమైన దేవతలశిల్పాల మధ్య ఉంటుంది.
వైకుంఠ ద్వారం 

స్వామివారికి బ్రహ్మోత్సవాలు,మాసోత్సవాలతో పాటు ధనుర్మాసం,వైకుంఠఏకాదశి,ఉగాది,విజయదశమి పర్వదినాల్లోనే కాకుండా ప్రతినిత్యం ఉత్సవమే అన్నట్లు ఎప్పుడూ విశేష పూజలు,సేవలు జరుగుతాయట.ఇక్కడ పోస్ట్ చేసిన ఫోటో స్వామివారికి జరిగే వాహనసేవలు.

నారాయణ నారాయణ  జయ గోపాల హరే గోపాల హరే  
కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణా 
నవ నీరద సంకాశ కృత కలి కల్మష నాశ నారాయణా
స్వామివారికి జరిగే ఉత్సవాలు 

"రంగ రంగ గోపురం" ఆలయం లోపలికి వెళ్ళే  ప్రధాన ద్వారం 

(Vellai) వెల్లై గోపురం - తెల్లని గోపురం - తూర్పు గోపురం 


మండపాల్లో శిల్పకళ

యుద్ధసన్నివేశం- కత్తి మనిషి శరీరంలో దిగినట్లు స్పష్టంగా తెలుస్తున్న శిల్పం. 

కృష్ణలీలలు 

శ్రీరంగం నుండి మా ఇంటికి వచ్చిన శ్రీరంగనాథుడు 

నిజంగా శ్రీరంగం భూలోక  వైకుంఠమే.శ్రీరంగం ఆలయం మొత్తం తిరిగి చూడాలంటే చాలా సమయమే కాదు,ఓపిక కూడా ఉండాలి.మేము మే నెలలో వెళ్లటంతో ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది.ఫ్రూట్స్,ఫ్రూట్ జ్యూస్ స్టాల్స్,కూల్ డ్రింక్స్,హోటల్స్ అన్నీ ఆలయప్రాకారాల్లో కలిసిపోయిన షాప్స్ లోనే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇబ్బంది అనిపించదు. ఎక్కడా లేని విధంగా శ్రీరంగం ఆలయప్రాకారాల మధ్యలోనే 4 ప్రాకారం దాకా  అన్నిరకాల షాప్స్ ఉంటాయి.స్వామి దర్శనం అయ్యాక బయటికి వచ్చి,అక్కడే హోటల్లో టిఫిన్ తినేసి,శ్రీరంగనాథుని దర్శనం మళ్ళీ కలగాలని కోరుకుంటూ తంజావూర్ బయల్దేరాము.

జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు  
ఎన్ని మారులు సేవించినా  కన్నులూ తనియవు  
విన్న నీ కథామృతమున  వీనులూ తనియవు


3, మార్చి 2017, శుక్రవారం

మా తమిళనాడు యాత్రా విశేషాలు - జంబుకేశ్వరం / తిరువనైకోవిల్



మధురై నుండి 2 గంటల్లో శ్రీరంగం వచ్చేశాము.అక్కడ వెంటనే దర్శనానికి వెళ్లాలనుకున్నాము కానీ మధ్యాహ్నం దర్శనం విరామం సమయం కావటంతో గుడి మూసేసి ఉంది.ఈలోపు శ్రీరంగం ప్రాకారాల మధ్యలో ఉన్న షాపింగ్,ఆలయం అంతా తిరిగి చూసి,ముందు జంబుకేశ్వర్ ఆలయానికి వెళ్లి రావచ్చని అక్కడికి వెళ్ళాము.

శ్రీ జంబుకేశ్వరుడు,శ్రీ అఖిలాండేశ్వరీ దేవి 

పంచభూత క్షేత్రాలలో రెండవది జంబుకేశ్వరం.తమిళనాడులోని తిరుచ్చికి 11 కి.మి దూరములో ఉంది. శ్రీరంగం ఆలయం నుండి 10 నిమిషాల్లో జంబుకేశ్వరుని సన్నిధికి చేరుకోవచ్చు.జంబుకేశ్వరానికి తిరువనైకోవిల్ అనే పేరు కూడా ఉంది.పూర్వం ఇక్కడ జంబు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది.తిరువనైకోవిల్ /జంబుకేశ్వరం పంచభూత క్షేత్రాలలో జలలింగం.ఇక్కడ చిన్న గర్భాలయంలో స్వామి జలలింగంగా కొలువై ఉన్నారు.శివలింగం ఎప్పుడూ నీటిలో తడిసే ఉంటుందట.అమ్మవారు సమస్తలోకాలను పాలించే అఖిలాండేశ్వరిగా కొలువైవుంది.జంబుకేశ్వరం పవిత్ర కావేరి నది ఒడ్డున ఉంది.కావేరి నదిలో స్నానం చేయటం,జంబుకేశ్వరుడిగా వెలసిన శివుడిని పూజించటం ఎంతో పుణ్యంగా భావిస్తారు.ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాక్రారాలతో ఎత్తైన గోపురాలతో,అందమైన శిల్పకళతో ఉంది.కానీ గర్భగుడి చాలా చిన్నది.వంగి లోపలికి వెళ్లి స్వామిని దర్శించుకోవాలి.

సాలీడు,ఏనుగు,అమ్మవారు,శంభుమహర్షి స్వామిని పూజించుట 

పురాణకధనం ప్రకారం శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తుండేవాడు. ఆ ఋషి మహా శివభక్తుడు.శివుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయగా శివుడు అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమయి వరం కోరుకోమనగా శంభుడు శివయ్యని ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకొన్నాడు.భోళాశంకరుడు అంగీకరించి ఇక్కడ లింగరూపములో వెలుస్తాను, నువ్వు జంబు వృక్ష రూపంలో ఉండి నన్ను పూజిస్తావని చెప్పి,శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భించగా శంభుడు జంబు వృక్షమై శివుని అర్చిస్తుంటాడు. ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబువృక్షమే శంభుడిగా ఇక్కడి నమ్మకం.పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా అవతరించి,ఈ జంబు వృక్షం కిందే కావేరి నది నీటితో శివలింగాన్ని ప్రతిష్టించి తపస్సు చేసింది.శివుడు ప్రత్యక్షమై అమ్మవారికి శివజ్ఞానాన్ని ఉపదేశించాడు.అందుకే ఈ క్షేత్రాన్ని ఉపదేశ స్థలం,జ్ఞానక్షేత్రం  అని కూడా అంటారు.ఇక్కడ అమ్మవారు శివుని ఉపదేశాలు పొందింది కాబట్టి స్వామివారిని గురువుగా,అమ్మవారిని శిష్యురాలిగా భావిస్తారు.కాళహస్తి స్థలపురాణంలాగానే ఇక్కడ కూడా స్వామివారిని ఏనుగు, సాలిపురుగు పోటీ పడి పూజిస్తుండేవట.

గర్భగుడిలో స్వామి,అమ్మవారు 

అమ్మ అఖిలాండేశ్వరి చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు,నాలుగు భుజాలలో పై రెండు చేతులతో కలువలు పట్టుకొన్నట్లు,క్రింది చేతులు అభయహస్తంతో,వరదముద్రతో నిలువెత్తు అమ్మవారి విగ్రహం అమ్మ మనముందు సాక్షాత్కరించిందా అన్నట్లు అనిపిస్తుంది.అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్ర రూపంగా ఉండేవారని శంకరాచార్యులు ఉగ్ర రూపాన్ని ఆరాధించి ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగా మార్చి,అమ్మవారి ముందు శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారని, అమ్మవారి కర్ణభూషణాలను కూడా శంకరాచార్యులవారే సమర్పించారని చెబుతారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరులే ప్రతిష్ఠించారని నమ్మకం.

ఆలయం లోపల 

చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం శ్రీరంగంలో ఉన్న రంగనాథేశ్వర స్వామి ఆలయం కన్నా పురాతన మైనదని,సుమారు 1800 సంవత్సరాలక్రితం(Kochchenganan),కొచ్చెన్ గనన్  చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు, ఆ తరువాత ఆలయ నిర్వహణ, స్వామి దీపధుపాలతో పాటు ఉత్సవాల నిర్వహణ పల్లవ రాజులు, పాండ్యులు  విజయనగర రాజులు చేసినట్లు తెలుస్తోంది.విశాలమైన 5 ప్రాకారాలు,ఎత్తైన అందమైన విగ్రహాలతో నిండినగోపురాలు,వేయిస్థంభాల మండపంలోని స్థంభాలపైన శిల్పాలు,ఆలయం లోపలి కొన్ని చిన్న ఆలయాలు  అన్నీ ఆశ్చర్యపరిచే శిల్పకళతో నిండి ఉంటాయి.

ఆలయగోపురాలు 


వేయి స్తంభాలమండపం 

ఆలయంలో శిల్పకళ 


ఆలయం లోపలి ప్రాకారం 

ఇవీ జంబుకేశ్వర ఆలయ విశేషాలు.జంబుకేశ్వరుని దర్శనంతో పంచభూత లింగాలని చూడాలన్న నా కోరికని శివయ్య తీర్చాడు అనిపించింది.ఇంతకుముందే 2012 లో అరుణాచలేశ్వరుని దర్శించుకున్నాము.ఈ ట్రిప్ లో ఒకేసారి కాళహస్తి వాయులింగేశ్వరుడు,కంచి ఏకామ్రేశ్వడు-పృథ్విలింగం,చిదంబరం నటరాజేశ్వరుడు -ఆకాశలింగం, జంబుకేశ్వరం - జలలింగం దర్శనభాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం అనిపించింది.పంచభూతలింగాల విశేషాలు ఈలింక్ లో చూడొచ్చు.  ----  http://raji-rajiworld.blogspot.in/2016/06/blog-post_23.html

ఓం నమో జంబుకేశ్వరాయ నమః 

జంబుకేశ్వరంలో మా తమ్ముడు 

Related Posts Plugin for WordPress, Blogger...