పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

మా ఢిల్లీ ప్రయాణం..2015



పోయిన సంవత్సరం (2015)  ఢిల్లీలో ఉన్న "SFIO -Serious Fraud Investigation Office" లో  Legal Consultants postsకి apply చేశాను.aplications short listing process అయ్యాక  Interview సరిగ్గా 4 రోజులుందనగా ఇంటర్వ్యూకి ఢిల్లీ రమ్మని  Call Letter  పోస్ట్ లో వచ్చింది.

Interview Call Letter చూడగానే నాకు కంగారు మొదలయ్యిది. Interview కి సెలెక్ట్ అయ్యాము సరే, ఢిల్లీ వెళ్ళటం ఎలా? ఇప్పుడు వెళ్లకపోతే మంచి అవకాశం పోతుందేమో ? వెంటనే మా తమ్ముడికి ఫోన్ చేసాను.నాకంటే ఎక్కువ కంగారుపడ్డ మా తమ్ముడు సరే ఆలోచిస్తా ఉండు అంటూ కాసేపాగి ఫోన్ చేసి మా ఫ్రెండ్ సాంబ ఫ్యామిలీ తో అక్కడే ఉంటున్నాడు కదా  ఫోన్ చేసి అడగనా అన్నాడు. సాంబ అంటే మా తమ్ముడి చిన్నప్పటి ఫ్రెండ్ Ch.సాంబశివారెడ్డి.  LKG నుండి మా ఊర్లో సిస్టర్స్ కాన్వెంట్ లో చదివారు మా తమ్ముడు,వాడి ఫ్రెండ్స్ .ఆదివారం, ఎప్పుడన్నా సెలవలు వచ్చినా అందరూ ఒకచోటచేరి అందరి ఇళ్లకు వెళ్తూ ఉండేవాళ్ళు.అలాగే మా ఇంటికి కూడా వస్తూఉండేవాళ్లు.నన్ను అక్కా అంటూ పిలుస్తూ అభిమానంగా మాట్లాడేవాళ్ళు, ఇప్పటికీ అందరూ కలుస్తూ ఉంటారు.సరే సాంబ అయితే మనకేం సమస్య కానీ తనేమంటాడో అడుగు మరి అనగానే తమ్ముడు సాంబాకి ఫోన్ చేయటం,సాంబ వెంటనే అక్క జాబ్ కోసం అయితే ఖచ్చితంగా రావాలి కదరా తప్పకుండా రండి  నాకేమి ఇబ్బంది లేదు అనటంతో హమ్మయ్య అక్కడికి వెళ్ళి ఉండటం ఎలా, అక్కడ మనకేమీ తెలియదు కదా అన్న పెద్ద సమస్య తీరిపోయింది.

ఇక వెళ్ళటం ఎలా? ట్రైన్ అంటే ఒకటిన్నర రోజు పడుతుంది.అంతసేపు జర్నీ చేయలేము కాబట్టి  Flight కి వెళదామా  అన్నాడు తమ్ముడు. ఎలాగూ అక్కడ సాంబ ఉన్నాడు కాబట్టి అమ్మని,చెల్లిని కూడా ఢిల్లీ తీసుకెళదాం చూస్తారు కదా అని,అంతే మాప్రయాణానికి అంతా సిద్ధం అయిపోయింది. సెప్టెంబర్ 23 రాత్రి 7 గంటలకి Flight.అమ్మ,తమ్ముడు,చెల్లి,మాబాబు,నేను ప్రయాణానికి సిద్ధమయ్యాము. 

  

2015సెప్టెంబర్23 - నాకు ఒక పక్క Interview టెన్షన్,మరో వైపు మా అందరికీ ప్రయాణం సంతోషం, weight ప్రకారం లగేజ్ ఎంత ఉండాలో అంత అన్నీ రెడీ చేసుకుని, 23 సాయంత్రం క్యాబ్ లో Airport కి బయలుదేరాము.మాచెల్లి వాళ్ళాయనకి ఢిల్లీ రావటం కుదరకపోవడంతో Airport దాకా వచ్చి మాకు Happy journey చెప్పి వెళ్ళిపోయారు. Check in process పూర్తయ్యాక  Flight  గంట లేట్ అవ్వటంతో Waiting Lounge లో ఫుడ్,షాపింగ్స్ అన్నీ చూస్తూ టైమ్ తొందరగానే గడిచిపోయింది.ఇంతలో విమానం రానే వచ్చింది.boarding gate దగ్గరికి వెళ్లి క్యూలో aerobridge లోనుండి విమానంలోకి ఎంటర్ అయ్యాము.ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్న తర్వాత   Flight takeoff సీట్ బెల్ట్స్ పెట్టుకొమ్మని, మొబైల్స్ ఆఫ్ చెయ్యమని,లేదా Flight మోడ్ లో పెట్టమని safety instructions, emergency procedures చెప్తారు. details of the flight  destination, expected duration of flight, weather అన్నీ captain announce చేస్తారు.అన్నీ అయ్యాక ఇక విమానం కదిలింది.2గంటల్లో ఢిల్లీ చేరిపోయామని captain announcement వినిపించింది.మొత్తానికి safe గా నేలమీదకి దిగాము. విమానంలో నుండి దిగి  అక్కడినుండి బస్ లో ఢిల్లీ  airport లోకి ఎంటర్ అయ్యాము. అక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకుని టాక్సీ కోసం బయటికి వచ్చాము.మొత్తానికి 30 గంటల ప్రయాణం 2 గంటల్లో పూర్తి చేసుకుని ఇలా మా ప్రయాణం పూర్తయ్యింది. 

 

ఇక ఢిల్లీ అప్పటికే  పూర్తి నిర్మానుష్యమైపోయింది. హైదరాబాద్ లో  ఎప్పుడూ చూడని వాతావరణం అక్కడ కనిపించింది. ట్యాక్సీలో  ఇంటికి వెళ్లేసరికి రాత్రి పన్నెండు అయ్యింది. మా తమ్ముడి ఫ్రెండ్ సాంబ వాళ్ళ కాలనీ మెయిన్ గేట్లోనే  మాకోసం ఎదురుచూస్తున్నాడు.చిన్నప్పట్లాగే  అక్కడే అందర్నీ సరదాగా మాట్లాడుతూ పలకరించి ఇంటికి తీసుకెళ్ళాడు.అడ్రెస్ చెప్పి ఊర్కోకుండా ఆ చీకట్లో  అక్కడ మాకోసం ఎదురుచూడటమే ఒక ఆశ్చర్యం అనుకుంటే ఇంటికెళ్ళాక సాంబ వాళ్ళావిడ శిరీష మరొక ఆశ్చర్యం. మేమంతా తనకి చాలా తెలిసిన వాళ్ళలాగా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్ళి ఫ్రెష్ అవగానే భోజనం చేయాల్సిందే నేను మీకోసం చేసాను అని పట్టుపట్టింది.మేము హైదరాబాద్ లో Flight ఎక్కేముందే ఫోన్ చేసిన సాంబ వంట చేపిస్తాను ఆ airport లో ఏమి తింటారు అన్నాడు మేము వద్దులే తినేసి వస్తాము అన్నా కానీ, మాకోసం వంట చేయించి రెడీగా ఉంచారు.మేము భోజనం చేసి కబుర్లు చెప్పుకుని మాకు కొత్త ప్రదేశం అన్న ఫీలింగ్ కూడా లేకుండా హాయిగా నిద్రపట్టింది. సంవత్సరం అయినా ఇప్పటికీ ఢీల్లీ ప్రయాణం సంతోషమైన జ్ఞాపకంగా మిగిలిపోవటానికి ముఖ్య కారణమైన సాంబ, శిరీషకి ఎంత thanks చెప్పినా తక్కువే అనిపిస్తుంది.

శిరీష నేను ఎప్పటికీ మర్చిపోలేని మంచి అమ్మాయి,మంచి స్నేహితురాలు,మంచి భార్య అని చెప్పొచ్చు.ఇంటికి ఎవరైనా బంధువులొస్తే రెండురోజులున్నా గానీ వీళ్ళకి సేవలు చేయాల్సొచ్చిందే అనుకుంటూ తప్పనిసరిగా చేస్తుంటాము కానీ శిరీష, భర్త  చిన్నప్పటి స్నేహితులకోసం కోసం మేమెవరో తనకి తెలియకపోయినా సొంత మనుషుల్లాగ మాతో కలిసిపోయింది. మేము ఉదయం లేచేసరికే మేము అంతమందిమి  ఉన్నా, ఇల్లు శుభ్రంగా ఊడ్చి,తుడిచి ఇంటిముందు మార్బుల్ మీదే చాక్ పీస్ తో ముగ్గువేసింది.పనిమనుషుల్ని అందర్నీ నమ్మలేము కదక్కా అందుకే నేనే అన్ని పనులు చేసుకుంటాను అంది. ఇంట్లో కూడా అన్నీ తను సొంతగా తయారు చేసిన డెకరేటెడ్ వస్తువులు,ఫోటో ఫ్రేమ్స్ , వాకిలికి పువ్వుల కర్టెన్స్ ఇలా ఇల్లంతా చాలా నీట్ గా అందంగా ఉంచింది.సాంబ ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్తాడని వంటచేసి లంచ్ బాక్స్ , మాకోసం పూరీ,కూర, మా బాబు కోసం పూరీలు బయట తినటానికి బాక్స్ లో కూడా చేసి పెట్టింది.గుంటూరు సిటీలో పుట్టి పెరిగి, MCA చదివిన శిరీషకి face book , Whats app అన్నీ తెలుసు కానీ అవేమీ ఓపెన్ కూడా చేయదట. ఏముందక్కా అందులో అమ్మా వాళ్ళు,ఫ్రెండ్స్ అందరూ ఫోన్ లో మాట్లాడతారు ఇంక వాటిలో రెగ్యులర్ గా నేను చేసేదేముంది అంటున్న శిరీషని చూస్తే నాకు ఆశ్చర్యంగా, face book లో అకౌంట్ లేకపోతే తప్పు, పాపం అన్నట్లు ఒకటికి రెండు అకౌంట్లు కూడా తీస్తూ , మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడేవాళ్ళున్న ఈ రోజుల్లో శిరీషలాంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అనుకున్నాను.సాంబ అదృష్టవంతుడు అనిపించింది."మీరు  చికెన్ బాగా చేస్తారట కదా ఆంటీ సాంబ చెప్పాడు, చిన్నప్పుడు మీ ఇంటికొస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చికెన్ చేసి పెట్టేవాళ్ళట " అని శిరీష అనగానే ఎప్పుడో  తిన్న వంట రుచిని భార్యతో చెప్పి మెచ్చుకున్నందుకు మా అమ్మ ఆనందానికి అవధులు లేవు.అన్నీ ఉన్న ఆకు అణిగి ఉంటుంది,ఏమీ లేనిదే ఎగిరెగిరి పడుతుంది అని పెద్దల మాట నిజమే అనిపిస్తుంది కొందరిని చూసినప్పుడు.

 లోటస్ టెంపుల్ 

2015సెప్టెంబర్24 - Interview మధ్యాహ్నం కావటంతో ఉదయాన్నే లోటస్ టెంపుల్ కి వెళ్ళాము.చిన్నప్పుడు historical monuments లో చార్టులు తెచ్చి కట్ చేసి white Paper మీద అతికించే రోజుల్లో లోటస్ టెంపుల్ చూసాము. మళ్ళీ ఇలా ఇన్నాళ్లకి నిజంగా చూస్తున్నాము అనిపించింది. ఉదయమే వెళ్లటంతో వాతావరణం చల్లగా చుట్టూ ఆకుపచ్చని గార్డెన్ మధ్యలో లోటస్ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది.బయటే చెప్పులు వదిలేసి లోపలికి  వెళ్ళాలి.లోపల ప్రార్ధనా మందిరం ఉంది.అక్కడినుండి పర్యావరణ్ భవన్ కి ఇంటర్వూకి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు అదే సరిపోయింది.అక్కడ మరో వింత, ఇంటర్వ్యూకి అందరికంటే ఎక్కువ హైదరాబాద్ నుండి లాయర్స్  వచ్చారు .బయటికి రాగానే ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళాము. చుట్టూ పచ్చటి పార్కులు ,వాటర్ ఫౌంటెన్, ఎదురుగా కనపడుతున్న రాష్ట్రపతి భవన్ అంతా అద్భుతమే. 9 దశాబ్దాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధంలో మరియు అఫ్ఘన్ యుద్ధంలో అమరులైన 90 వేల యుద్ధజవానుల స్మృత్యర్థం నిర్మించిన అపురూప కట్టడం ముందు నిలబడటం చాలా సంతోషంగా అనిపించింది.అక్కడినుండి రాష్ట్రపతిభవన్ దగ్గరికి వెళ్ళేసరికే చీకటి పడింది.కాసేపు అక్కడ ఉండి సరోజినీ నగర్ మార్కెట్ కి వెళ్ళాము.ఇక్కడ షాపింగ్ చాలా బాగుంది దొరకని వస్తువులు ఉండవేమో అనిపిస్తుంది. కానీ రేట్లు అడిగి బేరం చేసే టాలెంట్ కూడా ఉండాలి.షాపింగ్ చేసి, నేపాలీ మోమోస్ తిని అప్పటికే బాగా చీకటి పడటంతో ఇంటికి చేరుకున్నాము.
ఇండియా గేట్
రాష్ట్రపతి భవన్


సరోజినీనగర్ మార్కెట్

2015సెప్టెంబర్25 - ఉదయాన్నే తాజ్ మహల్ వెళ్లాలని మా ఆలోచన కానీ శుక్రవారం తాజ్ మహల్ కి సెలవట.తాజ్ మహల్ చూడలేకపోవటం మాకు కొంచెం బాధ అనిపించింది, ఏముందక్కా అది చూసేది సమాధి అంది శిరీష, ఏంట్రా అలా అంటావు అంటే ఏమోనక్కా నాకలాగే అనిపిస్తుంది అంది.ఆమాట నిజమేనని నాకు ఆ తర్వాత మహారాష్ట్ర ఔరంగాబాద్ లో మినీ తాజ్  మహల్ చూసిన తర్వాత అనిపించింది.సాంబ అక్షరధామ్ వెళ్ళండి బాగుంటుంది అనటంతో ..ఉదయాన్నే cab  మాట్లాడుకుని, ఛత్తర్ పూర్ లో కాత్యాయనీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళాము. ఆద్యకాత్యాయనీ శక్తిపీఠం చాలా బాగుంది.అక్కడినుండి కుతుబ్ మీనార్ వెళ్ళాము. 1193 లో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన ఈ చారిత్రిక కట్టడానికి  ఎత్తయిన ఇటుకుల మినార్ అని పేరు.5 అంతస్తులతో, చుట్టూ బాల్కనీలతో నిర్మించారు.మొదటి మూడు అంతస్తులను ఎర్రటి ఇసుకరాయితో,నాలుగు,ఐదు అంతస్తులను మార్బుల్, ఇసుకరాయితో నిర్మించారు.దీనికి దగ్గర్లోనే ఒక మసీదు, అసంపూర్తిగా మిగిలిపోయిన మరొక మినార్,తుప్పు పట్టని ఇనప స్థంభం, మండపాలు రకరకాల శిల్పకళతో చాలా కట్టడాలున్నాయి.ఎత్తైన ఈ కట్టడం చాలా దూరంనుండే అందంగా కనపడుతూ ఉంటుంది.ఇక్కడ కూడా వెంటనే బయటికి రావాలనిపించదు ఎత్తైన ఆ కట్టడాన్ని తల పూర్తిగా పైకెత్తి చూడాల్సిందే.మొత్తం ఫొటోలో కవర్ చేయటం కూడా కష్టమే. 

ఆద్యకాత్యాయని శక్తి పీఠం

కుతుబ్ మినార్
ఎర్రకోట

ఎర్రకోట జండావందనం రోజే కాదు ఎప్పుడూ జనంతో నిండిపోయే ఉంటుందేమో అనేంత జనం ఉన్నారు.ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది.ఆ ఎండలోనే కాసేపు అక్కడ తిరిగి, అక్షరధామ్ "స్వామి నారాయణ్ అక్షరధామ్" కి వెళ్ళాము.ఢిల్లీ నుండి యమునా నది మీదుగా అక్షరధామ్ చేరుకుంటాము. అదొక మానవ నిర్మిత మహాద్భుతం అని చెప్పొచ్చు.దాదాపు వంద ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయం చూడటానికి ఎంత సమయమైనా సరిపోదనిపిస్తుంది.ఎటు చూసినా అద్భుతమైన శిల్పకళ, పచ్చటి గార్డెన్లు,అందులో జాతీయనాయకులు, పురాణ పాత్రల రకరకాల కంచు విగ్రహాలు ఉంటాయి. అసలు ఇనుము వాడకుండా ఎర్రటి ఇసుకరాళ్ళు,పాలరాతితో అందమైన గోపురాలతో నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూదేవాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ఆలయం గర్భగుడిలో 11 అడుగుల స్వామి నారాయణ్ విగ్రహం,ఇంకా ఇతర దేవతా మూర్తులు చాలా అందంగా ఉంటాయి.
అక్షర్ ధామ్
అక్షర్ ధామ్ లోపలి వింతైన,అందమైన శిల్పకళ

మధ్యాహ్నం లంచ్ ఆంధ్రాభవన్ లో మా cab driver కి అక్కడే తినాలనిపించిందేమో భోజనం అక్కడే బాగుంటుంది.అయినా మీరు  ఆంధ్రా నుండి వచ్చి ఆంధ్రాభవన్ లో భోజనం చేయకుండా వెళ్తే ఎలా అంటూ అక్కడికే భోజనానికి తీసుకెళ్లాడు.తినటానికి కూడా అంత సేపు క్యూలో వెయిట్ చేయించిన డ్రైవర్ మీద కాసేపు కోపం వచ్చినా లంచ్ మాత్రం చాలా బాగుంది.ఈమధ్య ఎక్కడ చూసినా క్యూలో నిలబెట్టి పెట్టే భోజనాల్లా కాకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చోబెట్టి మరీ మళ్ళీ మళ్ళీ అడిగి భోజన పెట్టటం కూడా  బాగుంది
  
ఆంధ్రాభవన్ లంచ్

తాజ్ మహల్ చూడకపోయినా ఇంటికైనా తీసుకెళ్ళాలని ఢిల్లీహాట్ లో తాజ్ మహల్ కొన్నాము, అక్కడున్న పాలరాతి బొమ్మలు,వస్తువుల నైపుణ్యం,అందాలు చూడాలే కానీ చెప్పలేము.రేట్లు కూడా అలాగే ఉన్నాయి.ఇక్కడ కూడా బేరాలు చేయాల్సిందే.online లో ఆర్డర్ చేసినా పంపిస్తామని చెప్పారు. షాపింగ్ కూడా అయ్యాక ఇంటికి బయలుదేరాము.

 

డిన్నర్ అయ్యాక అందరం కాసేపు కబుర్లు చెప్పుకుని మళ్ళీ ఉదయం ఆరుగంటలకే Flight కావటంతో రెస్ట్ తీసుకుని ఉదయాన్నే airport కి వచ్చేసి 2 గంటల్లో హైదరాబాద్ నేలమీద దిగిపోయాము.మేము 2 గంటల్లో ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చేసరికి మా మరిది గారు ఆ రెండుగంటలు హైదరాబాద్ ట్రాఫిక్ లో Airportకి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఇవీ మా ఢిల్లీ కబుర్లు.ఈ ప్రయాణంలో మా అందరికంటే ఎక్కువ సంతోషించింది మా అమ్మ.మా అమ్మ అక్కాచెల్లెళ్లు,అన్న పిల్లల్లో టెక్కీలు చాలా మంది విదేశాల్లో ఉన్నా చాగంటిగారి ప్రవచనంలో చెప్పినట్లు విమానంలోనో, విమానం దగ్గరో ఫోటో దిగి అమ్మా,నాన్నలకి చూపించిన వాళ్ళే కానీ అమ్మని విమానం ఎక్కించిన వాళ్ళు ఇప్పటిదాకా లేరు,వాళ్లందరిలో మొదటిగా మా తమ్ముడు తనని విమానం ఎక్కించాడని ఆ సంతోషం :) ఈరోజుకి మేము ఢిల్లీ వెళ్ళి సంవత్సరం పూర్తయినా ఈమధ్యే వెళ్లినట్లుంది.కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తొచ్చినా సంతోషంగా ఉంటాయి.అలాంటిదే మా ఢిల్లీ ప్రయాణం కూడా :)


2015 సెప్టెంబర్ 26 - ఢిల్లీ To హైదరాబాద్

Today's beautiful moments are tomorrows beautiful memories.

Related Posts Plugin for WordPress, Blogger...