పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..
నాకు నచ్చిన ప్రదేశాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నాకు నచ్చిన ప్రదేశాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, డిసెంబర్ 2018, మంగళవారం

శ్రీ ఛాయా సోమేశ్వరాలయం, నల్గొండ - పానగల్లు


శ్రీ ఛాయా సోమేశ్వరాలయం నల్గొండ - పానగల్లు 
Ancient & Mysterious Sri Chaya Someswara Temple



శ్రీ ఛాయా సోమేశ్వరాలయం తెలంగాణా రాష్ట్రం నల్గొండ  జిల్లాలోని పానగల్లు గ్రామంలో ఉంది.నల్గొండ నుండి 5 K.M దూరంలో పానగల్లు గ్రామం చివరిలో,పచ్చని పంటపొలాల మధ్య ఆలయం ఉంటుంది.

తెలంగాణా ప్రాచీన నగరంలో ఒకటైన పానగల్లు పట్టణం క్రీ. శ 11 - 12 శతాబ్దంలో కుందూరు చోళరాజుల రాజధానిగా ఉండేది..కాకతీయులకు సామంతులైన ఈ కుందూరు చోళులు తమ ఆరాధ్యదైవమైన పరమేశ్వరునికి ఈ ఛాయా సోమేశ్వరాలయాన్ని,పచ్చల సోమేశ్వరాలయాన్ని నిర్మించారు.ఈ ఆలయంలో లభించిన పురాతన శాసనాల ప్రకారం కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు కూడా ఆలయ అభివృద్ధికి కృషి చేశారని తెలుస్తుంది. 

ఈ ఆలయాన్ని త్రికూటాలయం అని కూడా పిలుస్తారు.తూర్పుముఖంగా వున్న గర్భగుడిలోని శివలింగంపైన రోజంతా ఒక స్తంభాకారలోని నీడ పడుతూ ఉంటుంది .ఇదే ఛాయా సోమేశ్వరాలయం లోని  ప్రత్యేకత.ఎప్పుడూ నీడతో (ఛాయ)కప్పబడి ఉంటాడు కాబట్టి ఇక్కడ స్వామికి ఛాయా సోమేశ్వరుడనే పేరు వచ్చింది.సుమారు పది దశాబ్దాలు ఈ నీడ ఎలా వస్తుందో ఎవరికీ తెలియని మిస్టరీ ఈ ఆలయంలో వుంది అంటారు.కానీ ఈ మధ్య తెలంగాణకే చెందిన ఎవరో టీచర్  ప్రయోగాలు చేసి నీడ ఎలా వస్తుందో కనిపెట్టారని చెప్తున్నారు. 

ఆలయంలో ప్రధాన మండపంలో స్తంభాలు,వాటిపైన శిల్పకళ చాలా బాగుంటుంది.ఆలయ ప్రాంగణంలో శిధిలమైన నంది విగ్రహాలు ,మండపాలు కనిపిస్తాయి.మేము 2016 పుష్కరాల తర్వాత వెళ్ళాము.పుష్కరాలకు గుడిని కొంచెం సరిచేశారని చెప్పారు అక్కడి పూజారి.సోమేశ్వరాలయం  హైదరాబాద్ నుండి 100 K.M దూరంలో ఉంటుంది.

పానగల్లు గ్రామంలో ఉన్న మరో శివాలయం పచ్చల సోమేశ్వరాలయం.దీన్ని కూడా కుందూరు చోళులు నిర్మించారు. ఆలయంలో 70 స్తంభాల మండపం,స్తంభాల మీద రామాయణ,మహాభారత ఘట్టాలు,పురాణ పాత్రలు చూస్తున్నట్లుగానే అనిపించే పెద్ద నంది ఈ ఆలయ ప్రత్యేకతలు.

ఆలయ విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు.

శ్రీ ఛాయా సోమేశ్వరాలయం





29, నవంబర్ 2018, గురువారం

మా గుంటూరు ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ @ గుంట గ్రౌండ్


గుంటూరు గుంట గ్రౌండ్ గుంటూరు వాళ్లందరికీ బాగా తెలిసిన,పరిచయమున్న ప్రదేశం.ఇక్కడ మా చిన్నప్పుడు, అలాగే ఇప్పుడు కూడా సమ్మర్ లో ఎగ్జిబిషన్ పెడతారు.అందుకే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని, దీన్నే నాజ్ సెంటర్ అని కూడా పిలుస్తారు.ఈ  మధ్య సంవత్సరంలో రెండు మూడు సార్లు ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నారు. మేము కూడా వెళ్తుంటాము. ఎగ్జిబిషన్  విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు. 

 మా గుంటూరు ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ @ గుంట గ్రౌండ్ 





17, నవంబర్ 2018, శనివారం

శ్రీ చింతల రామలింగేశ్వర స్వామి ఆలయం (రామప్ప గుడి) - మాచర్ల - గుంటూరు జిల్లా



ఆలయంలో 2016 లో ఏర్పాటుచేసిన శివపార్వతుల విగ్రహాలు


మా మాచర్లలోని రామప్పగుడి - శ్రీ గంగా పర్వతవర్ధినీ సమేత, శ్రీ చింతల రామలింగేశ్వర స్వామి ఆలయం చిన్నప్పటి  జ్ఞాపకం.చిన్నప్పుడు కార్తీకమాసం,శివరాత్రి ఇలా పండగరోజుల్లో మాత్రమే ఈ ఆలయం ప్రస్తావన వచ్చేది. ఎందుకంటే ఆ గుడి ఊరికి చాలా దూరంగా ఉండేది.రవాణా సౌకర్యాలు అంతగా ఉండేవి కాదు.అయినా కార్తీకమాసం వనభోజనాలకు,పూజలకు తప్పకుండా ఈ గుడికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు గుడి దగ్గర కూడా ఇళ్ళు,మంచి రోడ్లు,ఆటోలు అన్ని సౌకర్యాలు వచ్చేసాయి.

ఈ గుడి చాలా పురాతనమైనది.జమదగ్ని మహర్షి,రేణుకా మాతల కుమారుడు పరశురాముడు ప్రతిష్టించిన ఆలయంగా చెప్తారు.పరశురాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఆరవ అవతారం.హైహేయ వంశస్థుడైన కార్తవీర్యార్జున చక్రవర్తి శాపవశాత్తూ చేతులు లేకుండా జన్మించి,దత్తాత్రేయుని పూజించి వేయి చేతులు వరంగా పొందుతాడు.ఒకరోజు వేటకోసం అడవికి వచ్చిన కార్తవీర్యార్జునుడు  జమదగ్ని మహర్షి ఆశ్రమానికి సేదతీరటానికి రాగా జమదగ్ని మహర్షి రాజుకి,ఆయన పరివారానికి పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెడతాడు. అది చూసిన కార్తవీర్యార్జునుడు ఓక సాధారణ మహర్షికి ఇదంతా ఎలా సాధ్యపడిందని అడగగా, తన దగ్గరున్న కామధేనువు జాతి గోమాత వలనే అని చెప్తాడు.

అప్పుడు కార్తవీర్యార్జునుడు ఆ గోవును తనకిమ్మని అడగగా మహర్షి నిరాకరిస్తాడు.అందుకో కోపించిన చక్రవరి బలవంతంగా ఆవును తీసుకెళ్ళిపోతాడు.విషయం తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యార్జునుని వేయిచేతులు ఖండించి,సంహరించి గోమాతను తీసుకువస్తాడు.జమదగ్ని మహర్షి పరశురాముడిని మందలించి తపస్సు చేసుకోమ్మని పంపిస్తాడు.పరశురాముడు తండ్రిని చంపినందుకు కక్ష పెంచుకున్న కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని మహర్షిని చంపివెళ్ళిపోతారు.తల్లి దుఃఖం చూసిన పరశురాముడు 21 సార్లు భూ ప్రదక్షిణ చేసి, కార్తవీర్యార్జునుని కుమారులతో పాటు అధర్మపరులై ప్రజలను హింసిస్తున్న క్షత్రియ రాజుల్ని  సంహరిస్తాడు. యుద్ధాల్లో  గెలిచిన భూమిని కశ్యప మహర్షికి దానంగా ఇచ్చేసి, పాప ప్రక్షాళన కోసం తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాడు

ఆ తపస్సులో భాగంగా శివుడ్ని పూజించి 108 స్వయంభూ శివలింగాలను ప్రతిష్టించినట్లు, అందులో ఒకటి మాచర్ల లోని ఈ రామప్ప గుడి అనేది స్థలపురాణం.రామప్పగుడిని దక్షిణ కాశీగా పిలుస్తారు.ఇక్కడ స్వామిని దర్శిస్తే కాశీలో విశ్వనాధుడ్ని దర్శించినట్లుగా భక్తులు భావిస్తారు.ఇక్కడ స్వామికి స్వయంగా మనమే అభిషేకాలు చేయొచ్చు,స్పర్శదర్శనం చేసుకోవచ్చు.మేము ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారం ఈ గుడికి వెళ్ళాము.ఆలయంలో స్వామివారికి అభిషేకాలు,అమ్మవారికి కుంకుమపూజ,రుద్రహోమం, ప్రతిరోజూ భక్తులకు అన్నదానం,సహస్ర దీపాల సేవ అన్ని చాలా బాగా జరుగుతున్నాయి.


మా రామప్పగుడిని ఈ వీడియోలో చూడొచ్చు 
 



15, నవంబర్ 2018, గురువారం

హంసలదీవి.. కృష్ణవేణి పవిత్ర సాగర సంగమం



హంసలదీవి, కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని ఒక గ్రామము.మహాబలేశ్వరంలోని  జన్మస్థానము నుండి మొదలైన కృష్ణానది సాగరుణ్ణి కలిసే పవిత్ర సాగర సంగమ ప్రదేశం హంసలదీవి. పాలకాయతిప్ప అనే ప్రదేశం దగ్గర కృష్ణానది సముద్రంలో కలుస్తుంది. ఒకవైపు గట్టుతో కృష్ణమ్మ,మరొకవైపు అనంతమైన బంగాళాఖాతం రెండిటినీ చూడొచ్చు.అందరి పాపాలను కడుగుతూ మలినమైన గంగానది కాకి రూపంలో వచ్చి ఇక్కడి పవిత్ర కృష్ణవేణి సాగర సంగమంలో స్నానం చేయగానే హంసగా మారిపోయింది కాబట్టి ఈ ప్రదేశానికి హంసలదీవి అనే పేరు వచ్చిందనేది స్థలపురాణం.

మేము ముందుగా రేపల్లె,తెనాలి వైపునుండి మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి గుడికి వెళ్లి అక్కడినుండి హంసలదీవి వెళ్ళాము.అగస్త్య మహాముని సుబ్రహ్మణ్యస్వామిని నాగరూపంలో గుర్తించి,ప్రతిష్టించిన సన్నిధానమే మోపిదేవి.సుబ్రహ్మణ్యస్వామి,ఈశ్వరుడు ఒకే రూపంగా కొలువై సుబ్రహ్మణ్యేశ్వరస్వామిగా దర్శనమిచ్చే ఈ క్షేత్రం చాలా మహిమ కలిగినది.

హంసలదీవి కృష్ణా జిల్లాలో విజయవాడకు 110 కి. మీ., అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో వుంది. విజయవాడ నుంచి పామర్రు, కూచివూడి, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు దివిసీమ గ్రామాల నుండి వెళ్లొచ్చు అలాగే గుంటూరు నుండి తెనాలి,రేపల్లె వైపు పెనుమూడి వారధి మీదగా వెళ్లొచ్చు.లంక గ్రామాల్లో పచ్చని వాతావరణంలో ప్రయాణం చాలా హాయిగా అనిపిస్తుంది.దారులు బాగానే ఉంటాయి కానీ ఇక్కడికి మన  వెహికల్తో వెళ్తే ఇబ్బంది లేకుండా అన్ని ప్రదేశాలు చూడొచ్చు.

ముందుగా బీచ్ దగ్గరికి వెళ్తాము.బీచ్ దగ్గరనుండి కృష్ణమ్మ సముద్రంలో కలిసే చోటికి మన వెహికల్స్ వెళ్ళటం కష్టం ఎందుకంటే వేగంగా వస్తున్న సముద్రం అలల పక్కనే కారు వెళ్ళాలి.కారు టైర్స్ కూడా లాగేసేంత ఉధృతంగా అలలు వస్తుంటాయి.అందుకే అక్కడ ఆటోలో ఉంటాయి వాళ్ళు  మనిషికి కొంత అమౌంట్ తీసుకుని,సాగరసంగమ ప్రదేశం దగ్గరికి తీసుకెళ్తారు.అక్కడ కృష్ణమ్మ విగ్రహం, పాదాలు ఉంటాయి.ఈ సాగరసంగమ పెద్దలకి పుణ్యస్నానాలకే కాదు పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా సరదాపడతారు.వెంటనే అక్కడినుండి రావాలనిపించదు.ఇక్కడి దగ్గరలో ఒక భవనం ఉంటుంది.దీనిపై నుండి చూస్తే సాగరసంగమ దృశ్యం  చాలా బాగా కనిపిస్తుంది.ఇక్కడికి చీకటి పడకముందే వెళ్తే బాగుంటుంది.ఎందుకంటే అక్కడినుండి వెంటనే రావాలనిపించదు మరి.అక్కడ షోడాలు,ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి కానీ మనమే మంచి నీళ్ళు,తినటానికి కావాల్సినవి ఏమైనా తీసుకెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఇక్కడినుండి వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళాము. వూర్వం దేవతలు  ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారట. కోడి కూసే సమయానికి రాజగోపురం సగమే పూర్తయింది. తెల్లవారి మనుషుల అలికిడి వినపడటంతో వారు గోపురాన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు.తర్వాత చోళ రాజుల కాలంలో ఆలయ పునరుధ్ధరణ జరిగింది.ప్రస్తుతం ఈ ఆలయం విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయానికి దత్తత దేవాలయంగా గుర్తించబడింది.

ఇక్కడికి మేము రెండుసార్లు వెళ్ళాము.వెళ్ళినప్రతిసారి ప్రయాణం విసుగనిపించదు ,అక్కడ గడిపే సమయం కూడా విసుగనిపించదు.మా అందరికీ చాలా నచ్చిన ప్రదేశం హంసలదీవని ఈ వీడియోలో చూడొచ్చు

హంసలదీవి.. కృష్ణవేణీ సాగర సంగమం





10, నవంబర్ 2018, శనివారం

హంసలదీవి.. కృష్ణవేణి పవిత్ర సాగర సంగమం



హంసలదీవి, కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని ఒక గ్రామము.మహాబలేశ్వరంలోని  జన్మస్థానము నుండి మొదలైన కృష్ణానది సాగరుణ్ణి కలిసే పవిత్ర సాగర సంగమ ప్రదేశం హంసలదీవి. పాలకాయతిప్ప అనే ప్రదేశం దగ్గర కృష్ణానది సముద్రంలో కలుస్తుంది. ఒకవైపు గట్టుతో కృష్ణమ్మ,మరొకవైపు అనంతమైన బంగాళాఖాతం రెండిటినీ చూడొచ్చు.అందరి పాపాలను కడుగుతూ మలినమైన గంగానది కాకి రూపంలో వచ్చి ఇక్కడి పవిత్ర కృష్ణవేణి సాగర సంగమంలో స్నానం చేయగానే హంసగా మారిపోయింది కాబట్టి ఈ ప్రదేశానికి హంసలదీవి అనే పేరు వచ్చిందనేది స్థలపురాణం.

మేము ముందుగా రేపల్లె,తెనాలి వైపునుండి మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి గుడికి వెళ్లి అక్కడినుండి హంసలదీవి వెళ్ళాము.అగస్త్య మహాముని సుబ్రహ్మణ్యస్వామిని నాగరూపంలో గుర్తించి,ప్రతిష్టించిన సన్నిధానమే మోపిదేవి.సుబ్రహ్మణ్యస్వామి,ఈశ్వరుడు ఒకే రూపంగా కొలువై సుబ్రహ్మణ్యేశ్వరస్వామిగా దర్శనమిచ్చే ఈ క్షేత్రం చాలా మహిమ కలిగినది.

హంసలదీవి కృష్ణా జిల్లాలో విజయవాడకు 110 కి. మీ., అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో వుంది. విజయవాడ నుంచి పామర్రు, కూచివూడి, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు దివిసీమ గ్రామాల నుండి వెళ్లొచ్చు అలాగే గుంటూరు నుండి తెనాలి,రేపల్లె వైపు పెనుమూడి వారధి మీదగా వెళ్లొచ్చు.లంక గ్రామాల్లో పచ్చని వాతావరణంలో ప్రయాణం చాలా హాయిగా అనిపిస్తుంది.దారులు బాగానే ఉంటాయి కానీ ఇక్కడికి మన  వెహికల్తో వెళ్తే ఇబ్బంది లేకుండా అన్ని ప్రదేశాలు చూడొచ్చు.

ముందుగా బీచ్ దగ్గరికి వెళ్తాము.బీచ్ దగ్గరనుండి కృష్ణమ్మ సముద్రంలో కలిసే చోటికి మన వెహికల్స్ వెళ్ళటం కష్టం ఎందుకంటే వేగంగా వస్తున్న సముద్రం అలల పక్కనే కారు వెళ్ళాలి.కారు టైర్స్ కూడా లాగేసేంత ఉధృతంగా అలలు వస్తుంటాయి.అందుకే అక్కడ ఆటోలో ఉంటాయి వాళ్ళు  మనిషికి కొంత అమౌంట్ తీసుకుని,సాగరసంగమ ప్రదేశం దగ్గరికి తీసుకెళ్తారు.అక్కడ కృష్ణమ్మ విగ్రహం, పాదాలు ఉంటాయి.ఈ సాగరసంగమ పెద్దలకి పుణ్యస్నానాలకే కాదు పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా సరదాపడతారు.వెంటనే అక్కడినుండి రావాలనిపించదు.ఇక్కడి దగ్గరలో ఒక భవనం ఉంటుంది.దీనిపై నుండి చూస్తే సాగరసంగమ దృశ్యం  చాలా బాగా కనిపిస్తుంది.ఇక్కడికి చీకటి పడకముందే వెళ్తే బాగుంటుంది.ఎందుకంటే అక్కడినుండి వెంటనే రావాలనిపించదు మరి.అక్కడ షోడాలు,ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి కానీ మనమే మంచి నీళ్ళు,తినటానికి కావాల్సినవి ఏమైనా తీసుకెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఇక్కడినుండి వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళాము. వూర్వం దేవతలు  ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారట. కోడి కూసే సమయానికి రాజగోపురం సగమే పూర్తయింది. తెల్లవారి మనుషుల అలికిడి వినపడటంతో వారు గోపురాన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు.తర్వాత చోళ రాజుల కాలంలో ఆలయ పునరుధ్ధరణ జరిగింది.ప్రస్తుతం ఈ ఆలయం విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయానికి దత్తత దేవాలయంగా గుర్తించబడింది.

ఇక్కడికి మేము రెండుసార్లు వెళ్ళాము.వెళ్ళినప్రతిసారి ప్రయాణం విసుగనిపించదు ,అక్కడ గడిపే సమయం కూడా విసుగనిపించదు.మా అందరికీ చాలా నచ్చిన ప్రదేశం హంసలదీవని ఈ వీడియోలో చూడొచ్చు

హంసలదీవి.. కృష్ణవేణీ సాగర సంగమం





8, నవంబర్ 2018, గురువారం

A Day In Ramoji Film City - రామోజీ ఫిల్మ్ సిటీ - హైదరాబాద్ -



A Day In Ramoji Film City
రామోజీ ఫిల్మ్ సిటీ - హైదరాబాద్
A must visit Tourist Destination




30, అక్టోబర్ 2018, మంగళవారం

Indian clay art Terracotta Beautiful collection of handicrafts / టెర్రకోట కళాకృతులు


Indian clay art Terracotta Beautiful collection of handicrafts 
టెర్రకోట కళాకృతులు

బ్రైట్ కలర్స్ తో విభిన్నమైన డిజైన్స్ తో అందంగా ఆకట్టుకునే టెర్రకోట బొమ్మలు ఇష్టపడనివాళ్ళు  నచ్చనివాళ్ళు ఉండరేమో.. హైదరాబాద్  శిల్పారామం తర్వాత ఉప్పల్ రోడ్డులో టెర్రకోట బొమ్మలు ఎక్కువగా చూడొచ్చు.ఫుట్ పాత్ మీద వరసలుగా పెట్టిన ఆ బొమ్మలు ఎంతబాగున్నాయో అనిపించేలా ఉంటాయి.దేవతా మూర్తులు, పక్షులు, ఏనుగులు,గుర్రాలు,వివిధరకాల జంతువులూ, దీపాలు, ఫ్లవర్ వాజ్ లు , ఇంకా చాలా అలంకరణ వస్తువులు చెప్పలేనన్నని వెరైటీలతో పాటు మనం నిత్యం వాడుకునే వంట పాత్రలు,గిన్నెలు,కప్స్,డిన్నర్ సెట్స్ కూడా వీటిలో ఉంటాయి.








మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు దీపావళి ప్రమిదలు అక్కడైతే మంచి డిజైన్స్ వుంటాయని వెళ్ళాము..  నిజంగా చూడటానికి కూడా ఓపిక ఉండాలి అనిపించేన్ని దీపాలు,బొమ్మల వెరైటీస్ ఉన్నాయి. మేము వెళ్లేసరికి చీకటి పడింది అయినా చీకట్లోనే వీడియో తీసాను టెర్రకోట బొమ్మలని రాజస్థాన్,గుజరాత్,ఒరిస్సా నుండి తెచ్చి ఇక్కడ ఫుట్ పాత్ ల మీద అమ్ముతున్నామని,రేట్ చాలా తక్కువగా అడుగుతారని ఆ బొమ్మలు అమ్ముతున్న  సత్య,మహేందర్ మాట్లాడారు. ఇంకా దీపావళి సీజన్ మొదలవలేదని,దీపావళికి వాళ్ళ బిజినెస్ బాగుంటుందని చెప్పారు.

మేము కృష్ణుడి విగ్రహం,కొన్ని దీపాలు కొన్నాము. మాకు చాలా నచ్చాయి..
మరికొన్ని టెర్రకోట బొమ్మల విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు


టెర్రకోట కళాకృతులు




21, మే 2015, గురువారం

కొండపల్లి బొమ్మలు -- కొండపల్లిలో

  
 

"కొండపల్లీ  కొయ్యా బొమ్మ  నీకో బొమ్మా నాకో బొమ్మ" అని చిన్నపిల్లలు పాడుకునే పద్యాల దగ్గరి నుండి,అందమైన అమ్మాయిని కొండపల్లి బొమ్మతో పోల్చే దాకా కొండపల్లి బొమ్మల గురించి తెలియని వాళ్ళు ఉండరేమో..  ఆంధ్రప్రదేశ్ లోని  కృష్ణా జిల్లా,ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన కొండపల్లి గ్రామం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు.400 సంవత్సరాల నాటిదిగా చెప్తున్న ఈ కళ నిజంగా చాలా ప్రత్యేకంగా, అద్భుతంగా ఉంటుంది. 

ఈ బొమ్మలు ఏదో సులభంగా మౌల్డ్స్ తో చేసేవి కాదు,ప్రతి బొమ్మా దేనికదే చెక్కి,అవసరమైన భాగాలను విడిగా అతికిస్తూ,ఎంతో  ఓపికగా సహజమైన రంగులద్ది తయారుచేస్తారు.ఆ ప్రాంతంలో దొరికే "పొనికి కలప " అనే చెక్కతో చేసే ఈ బొమ్మలు ఎంత పెద్ద బొమ్మైనా సరే చాలా తేలికగా ఉంటాయి. దశావతారాలు, ఏనుగు మావటీ,పెళ్లి పల్లకి,ధాన్యం బస్తాలతో ఉన్న ఎద్దులబండి,తాటిచెట్టు ఎక్కుతున్నమనిషి ఇవి కొండపల్లి బొమ్మల్లో ఫేమస్ అని చెప్పొచ్చు.

ఈ కొండపల్లి బొమ్మలు కళాంజలి,లేపాక్షి లాంటి హస్తకళల విక్రయశాలల్లో దొరుకుతాయి కానీ ఈసారి మాచెల్లి కోరిక మీద  కొండపల్లికి  వెళ్లి మరీ ఈబొమ్మలు తెచ్చుకోవటం ఎప్పటికీ గుర్తుండే ఒక మంచి అనుభవం. 
2 నెలల క్రితం గుంటూరు వచ్చిన మా చెల్లి చూడాలనుకున్న ప్లేసెస్ లో ఈ కొండపల్లి ప్రధానంగా పెట్టుకుని వచ్చింది.కొండపల్లి బొమ్మలు లేపాక్షిలో కూడా దొరుకుతాయి కదే అంటే ఆన్ లైన్ లో కూడా దొరుకుతాయి కానీ నేను అక్కడికి వెళ్లి చూడాలనుకుంటున్నాను అంది. సరే అక్కడ కృష్ణదేవరాయల తో సహా ఎన్నో రాజవంశాల పాలన  కొనసాగిన కొండపల్లి కోట కూడా ఉంది కదా అది కూడా చూసి రావచ్చు అని బయల్దేరాం... 

ముందుగా విజయవాడ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని,అక్కడినుండి మా కార్ డ్రైవర్ అడ్రెస్ అడుగుతూ కొండపల్లి తీసుకెళ్ళాడు.విజయవాడ నుండి త్వరగానే కొండపల్లి వెళ్ళాము.ఎప్పుడో పురాతనకాలంలో పల్లెటూరుని చూసినట్లే అనిపించింది ఆ ఊరిని చూస్తుంటే..కొండపల్లి బొమ్మలకి ఆ వూర్లో ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ లాంటిది ఏమీ లేదని చెప్పారు.ఒక వీధిలో ఇళ్ళ మధ్యలోనే వరసగా అన్నీ షాపులు ఉన్నాయి అద్దాల బీరువాల్లో వాళ్ళు తయారుచేసి పెట్టిన బొమ్మలు పెట్టి ఉన్నాయి.అన్నిబొమ్మలు,వాటిని తయారుచేసే షాపులు,కళాకారుల్ని చూడటం వింతగా,లేపాక్షి లాంటి ఎగ్జిబిషన్స్ లో ఆ బొమ్మల్ని చూడటం కంటే అప్పటికప్పుడు కళాకారుల  చేతుల్లో ప్రాణం పోసుకుంటున్న ఆ బొమ్మల్ని చూడటం చాలా సంతోషంగా అనిపించిది.. 
కొండపల్లిలోమేము బొమ్మలు కొన్న షాపు. 

మేము అక్కడున్న వాటిల్లో ఒక షాప్ లోకి వెళ్ళగానే బొమ్మల్ని వాళ్ళే తయారుచేసి అమ్ముతున్న ఆ షాపతను మేము ఆ బొమ్మల కోసమే కొండపల్లి దాకా వెళ్ళామని తెలుసుకుని, చాలా సంతోషంగా వాళ్ళు తయారు చేసిన బొమ్మలన్నీ చూపిస్తూ, ఎలా తయారుచేస్తారు అనే విషయాల్ని చెప్పాడు. మా తాతల కాలం నుండి మేము నేర్చుకున్నాము కానీ ఇప్పుడు ఈ కళకి ప్రభుత్వం నుండి సరైన సపోర్ట్ లేకపోవటం మూలంగా మా పిల్లలు నేర్చుకోవటానికి, ఈ వృత్తిలో కొనసాగటానికి ఇష్టపడటం లేదు,మేము కూడా వాళ్ళని ఒత్తిడి చేయలేకపోతున్నాము.. షోరూమ్స్ వాళ్ళు బొమ్మలు మా దగ్గర తక్కువ రేటుకి కొని బయట ఎక్కువ రేటుకి అమ్ముతారు,వాళ్ళు ఎంత చెప్పినా కొంటారు కానీ మా దగ్గర బేరాలాడుతారు అంటూ ముందే మమ్మల్ని బేరం ఆడటానికి సందేహించేలా చేసేశాడు. 

  బొమ్మలు ఎలా చెక్కుతారో చూపిస్తున్న 
షాపతను
 

మాకు కూడా అది నిజమే కదా అనిపించింది. అదే ఏ లేపాక్షికో వెళ్తే అక్కడ బొమ్మ మీద ఎంత స్టిక్కర్ వేస్తే  అంతకి సైలెంట్ గా కొంటాము కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర,మన ఇళ్లదగ్గర అమ్మటానికి వచ్చే చిన్న వ్యాపారుల దగ్గర బేరమాడతాము అనుకుని,మాకు నచ్చిన కొన్ని బొమ్మలు సెలక్ట్ చేసుకుని రీజనబుల్ రేట్స్ మాట్లాడుకుని, కొనుక్కుని వచ్చేశాము.ఏ బొమ్మ చూసినా భలే  ఉంది  అనిపించేలా ఉంది ఆ కళాకారుల అద్భుత సృష్టి.  

 మేము బొమ్మలు కొన్న షాప్

 

ఈ ప్రాంతంలో ఏ ఫంక్షన్స్ అయినా గాజు బాక్స్ లో 
సెట్ చేసిన ఈ దశావతారాలు గిఫ్ట్ గా ఇస్తారట.

 

మనం కొన్న బొమ్మల్ని ఇలా సరిపోయే అట్టపెట్టేల్లో
పెట్టి,వాళ్ళే Pack చేసి ఇస్తారు. 

బొమ్మలు తయారుచేసే చెక్కని  ఈ ఫోటోలో చూడొచ్చు.  

విష్ణుమూర్తి దశావతారాలు 
కొండపల్లి బొమ్మల్లో ప్రఖ్యాతి చెందినవి. 


ఈ బొమ్మ చాలా బాగుంటుంది.ముఖ్యంగా ఆ ధాన్యపు
బస్తాలు నిజమైన వాటిలా భలే ఉంటాయి.


ఏనుగు అంబారీ


పెళ్లి పల్లకి

 
బృందావనం లో గోపెమ్మలతో కృష్ణుడు


వస్తున్నప్పుడు సంతోషంగా,నవ్వుతూ మాకు,పిల్లలకి టాటా చెప్తున్న 
ఆ షాపతన్ని చూస్తే హమ్మయ్య మేము అతన్ని మరీ విసిగించి,బాధపెట్టి బొమ్మలు తక్కువ రేటుకి కొనలేదులే అనిపించింది .. :)


కొండపల్లి కోట చూడాలనుకున్నాము కానీ కుదరలేదు.మొత్తానికి మా చెల్లి కోరిక మేరకు ఒక మంచి ఊరిని,,కళని,కళాకారులని ప్రత్యక్షంగా చూసిన సంతోషం కలిగింది..ఇవీ మా కొండపల్లి బొమ్మల కబుర్లు. 


21, డిసెంబర్ 2014, ఆదివారం

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన 2014




హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ఈ నెల 17 న మొదలయ్యింది. పుస్తకాలంటే మా ఇంట్లో అందరికీ ఆసక్తే కాబట్టి చూసి,కొని వద్దామని బయలుదేరాము. ఈ పుస్తక ప్రదర్శనని  పుస్తక ప్రదర్శన కాదు పుస్తకాల సముద్రం అనాలేమో .. ఢిల్లీ,కోల్ కతా నగరాల తర్వాత  అతిపెద్ద పుస్తక ప్రదర్శన ఇదేనట. తిరిగే ఓపిక, కొనే ఓపిక ఉండాలే కానీ లేని పుస్తకం అటూ లేదేమో అనిపించేన్ని ఎన్నో పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి.


 ప్రవేశ టికెట్  ఒకరికి 5 రూపాయలు.ఈ టికెట్ పోయిన సంవత్సరం లేదట. ఈ సంవత్సరమే పెట్టారని ఎవరో జర్నలిస్ట్ అడిగితే  చెప్తున్నారు అక్కడి వాళ్ళు. 


తెలుగు,హిందీ,ఇంగ్లీష్,కన్నడం,తమిళం,మలయాళం ఇలా అన్ని భాషలకు సంబంధించిన సాహిత్యం, భాగవతం, భారతం లాంటి గ్రంధాలతో పాటూ సచిన్, మలాలా ఆత్మ కధలు , పిల్లలకు కావాల్సిన పుస్తకాలు,రకరకాల రైమ్స్ CD లు,GK బుక్స్ , దేశ విదేశాలకు సంబంధించిన వంటలు, ఇలా ఇంకా నాకు తెలియనివి చాలానే ఉండి  ఉంటాయి.. 


Asia Law House వాళ్ళ స్టాల్ బాగుంది.సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి కృష్ణ అయ్యర్ గారి పుస్తకాలు చాలా ఉన్నాయి ఇక్కడ. 




 పుస్తక ప్రదర్శన లో ఈసారి ఒక  విశేషం బ్లాగ్,ఫేస్ బుక్ ఫ్రెండ్స్  
తమ రచనలతో ఏర్పాటు చేసిన స్టాల్... 



బ్లాగ్స్ లో ఫేస్ బుక్ లో తెలిసిన మాలా కుమార్ గారు, ఇంకా కొంతమంది రచయిత్రులు రాసిన "తండ్రి, తనయ"  పుస్తకం కొన్నాను. రైటర్ కన్నెగంటి  అనసూయ గారు,బ్లాగర్,రైటర్ జ్యోతి,జ్ఞాన ప్రసూన గారు వారి పుస్తకాలను  గురించి చెప్పారు. 

ఓషో -- మహిళ
మహిళ గురించి ఏమి రాశారో తెలుసుకోవాలని 
ఈ పుస్తకం కొన్నాను.


 పెద్దల కోసం వంటల పుస్తకాలు 


 పిల్లల కోసం కార్టూన్స్,cd లు 



రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రచురణ సంస్థలు,ప్రజలు  ఈ ప్రదర్శనలో పాల్గొన్నా ప్రదర్శన అంతా తెలంగాణా ఆనవాళ్ళు,సాంస్కృతిక చిహ్నాలతో తెలంగాణా వైతాళికుల పేర్లు,చిత్రాలతో ఏర్పాటు చేసిన వేదికలు,ద్వారాలతో మొత్తానికి పుస్తకాల ప్రదర్శన అంతా  తెలంగాణా సాంస్కృతిక అస్తిత్వ ప్రదర్శనగా కళ కళ లాడుతుంది... 

పుస్తక ప్రపంచంలో ఎంత సేపు విహరించినా విసుగు రాలేదు. కానీ కాళ్ళ నొప్పులతో ఆగిపోవాల్సి వచ్చింది. ఇవీ "హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2014" విశేషాలు.

2, మార్చి 2012, శుక్రవారం

స్మితా - ఇషానా



 

తెలుగు పాప్ సింగర్ స్మిత ఇప్పటిదాకా ఓల్డ్ తెలుగు సాంగ్స్ ని రీమిక్స్ చేసిన సింగర్ గా,ప్లేబ్యాక్ సింగర్ గా తెలుసు. కానీ ఇప్పుడు స్మిత తన "శైలికి భిన్నంగా" Devotional ఆల్బమ్ తయారు చేశారు.నాకు ఈ మ్యూజిక్ ఆల్బమ్ నచ్చటానికి ముఖ్యమైన కారణం ఈ ఆల్బమ్ లోని పాటలు కోయంబత్తూర్ లోని సద్గురు ఆశ్రమంలోని ధ్యానలింగం, లింగభైరవి ఆలయాలలో చిత్రీకరించారు.ఇషా ఫౌండషన్ గురించి తెలుసుకున్నప్పటి నుండి నాకు సద్గురు ఆశ్రమంలోఈ దేవాలయాలు ఎంతగానో నచ్చాయి.ఇంతకుముందు నా బ్లాగ్ లో ఈ ఇషా ఫౌండషన్ గురించి కూడా రాశాను.

ఆ ఆశ్రమం పరిసరాల్లో,ఆలయాల్లోని ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలోస్మిత తయారు చేసిన ఇషానా ఆల్బమ్ లో పాటలు,స్తోత్రాలు బాగున్నాయి.ఈ పాటల ద్వారా ఆశ్రమాన్ని, ఆలయంలోని ధ్యానలింగాన్ని, అమ్మవారిని,అక్కడి ఉత్సవాలను,పూజలను చూడటం చాలా బాగుంది..ఈ వీడియోలను చూస్తుంటే తప్పకుండా వెళ్లి ఆ ఆశ్రమాన్ని.ఆలయాలను చూడాలి అనిపిస్తుంది.

 
ఓం నమః శివాయ .. మహాదేవాయ నమః 


అంబా శాంభవి



20, ఫిబ్రవరి 2012, సోమవారం

సత్రశాల - గుంటూరు జిల్లా


మొక్కులు
తీర్చే సత్రశాల మల్లన్న




గుంటూరు జిల్లా మాచెర్ల కి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో రెంటచింతల మండలంలో
వుంది సత్రశాల పుణ్య క్షేత్రం. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి దేవస్థానం...
గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం సత్రశాల.
ఈ రోజు మహా శివరాత్రి కి ఆ స్వామిని దర్శించుకునే అవకాశం కలిగింది.
జనాలు ఎక్కువగా,రద్దీగా వుండే రోజుల్లో ఆలయాలకు వెళ్ళటం నాకు ఇష్టం లేకపోయినా
ఈ రోజు అమ్మ వెళ్దామని అడగటంతో మా వదిన,అక్క వాళ్ళతో వెళ్ళాము.

సత్రశాల ఆలయ ఆవరణ


ఆలయం ఆవరణలో భక్తులు స్వయంగా పూజించే
వినాయకుడు,శివలింగం.



క్యూ లైన్లలో దర్శనం సులభంగానే జరిగింది.వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుందేమో అని కొంచెం
భయం అనిపించినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మహా శివరాత్రి రోజున శివయ్య దర్శనం
చేసుకోవటం మనసుకు చాలా సంతోషంగా అనిపించింది .
కృష్ణా నదిని దాటి అవతలి ఒడ్డుకి వెళితే అక్కడ కూడా ఆలయాలు వుంటాయి.
ఈ ఫోటో ఇవతలి ఒడ్దు నుంచి తీసింది.

సత్రశాల
అవతలి ఒడ్దు.



చల్లగా,ప్రశాంతంగా ప్రవహిస్తున్న కృష్ణానది..


ఇక్కడ కృష్ణానది ప్రవహిస్తూ వుంటుంది.ఈ నదిలో స్నానం చేసి స్వామి వారి దర్శనం చేసుకుంటారు.
నది దగ్గరికి వెళ్ళాలంటే చాలా మెట్లు దిగి కిందికి వెళ్ళాలి అది మాత్రం చాలా కష్టం.
పండుగల రోజుల్లో కాకుండా విడి రోజుల్లో వెళ్తే గుడి ఆవరణ,పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి.
కానీ ఈరోజు మాత్రం అక్కడంతా భక్తుల సందడి. ఆర్టీసీ వాళ్ళ స్పెషల్ బస్సులు,ఆటోలు,ట్రాక్టర్ లు
ఇలా ఒక్కటి కాదు ఎక్కడ చూసినా జనప్రవహమే.

సత్రశాల లో ఈ రోజు తిరణాల జరుగుతుంది.దీన్ని తిరణాల లేదా జాతర అని కూడా అంటారు.
మొత్తానికి ఈ రోజు అనుకోకుండా "మొక్కులు తీర్చే సత్రశాల మల్లన్న" దర్శనం తో పాటూ
తిరణాల సందడిని కూడా చూసే అవకాశం కలిగింది.

తిరణాల సందడి




ఇవీ మా గుంటూరు జిల్లా సత్రశాల మహాశివరాత్రి తిరణాల విశేషాలు.
కోరిన కోరికలు తీర్చే సత్రశాల మల్లన్న అందరినీ తన
కరుణా కటాక్ష వీక్షణాలతో కాపాడాలని కోరుకుంటూ
"మహాశివరాత్రి శుభాకాంక్షలు."


25, జనవరి 2012, బుధవారం

యాదగిరిగుట్ట ట్రిప్ విశేషాలు



మా చెల్లి వాళ్ళ ఫామిలీతో ఈ వీకెండ్ కి మేము వెళ్ళిన ట్రిప్ యాదగిరిగుట్ట.ఇంతవరకు మేము చూడని ప్లేస్ ఇది.మిర్యాలగూడెం నుండి భువనగిరి వెళ్లి,అక్కడి నుండి యాదగిరి గుట్ట వెళ్ళాము.

నల్గొండ జిల్లాలోని భువనగిరి లో ఎంటర్ అవ్వగానే కనపడే గుండ్రాయి లాంటినున్నటి కొండ మీద వున్న భువనగిరి కోట చాలా బాగుంది.భువనగిరిలో ఉన్న ఈ కోట కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందినది.ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య (ఆరవ) చేఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది.ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది.

అద్భుతమైన ఆనాటి కట్టడం చూడటం ఒక గొప్ప అనుభూతి.. ఆధునిక కట్టడాలకి ఉపయోగించేభారీ పరికరాలేమీ లేకుండా ఆ రోజుల్లో నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ కాలం తో పోటీ పడుతూ..
నిలిచి వున్న పూర్వ వైభవానికి,రాజసానికి ప్రతీక అనిపిస్తుంది.





























ఇక్కడి
నుండి యాదగిరిగుట్ట లోని "కుందా సత్యనారాయణ కళాధామం,సురేంద్రపురి" వెళ్ళాము.టీవీలో ఎప్పటి నుండో చూపిస్తున్న యాడ్ చూసి యాదగిరి గుట్ట వెళ్ళినప్పుడు ఇది కూడా తప్పకుండా చూడాలనుకున్నాము.






ప్రధాన ద్వారంలోనే ఇంద్రుడు తన ఐరావతం సమేతంగా ఆసీనుడై వచ్చిన వాళ్ళనుస్వాగతిస్తున్నట్లు వుంటుంది.లోపలి వెళ్ళగానే 60 అడుగుల పంచముఖ హనుమంతుడు ఒకవైపు,
పరమేశ్వరుడు మరొకవైపు ఒకే శిల్పంలో వున్న విగ్రహం కనపడుతుంది.
ఇక్కడి నుండి పెద్దలకు 250,పిల్లలకు 200 టికెట్ తీసుకుని గాయత్రి మాత విగ్రహం ముందు నుండి లోపలికి వెళ్ళాలి.ఇంక అప్పుడు మొదలవుతుంది పౌరాణిక పాత్రల పరిచయం..  భారతం, రామాయణం,కాళీయ మర్దనం,శక్తి పీఠాలు,దక్షిణ,ఉత్తర భారతదేశాల్లోని అనేక పుణ్యక్షేత్రాలు,  కైలాసం,వైకుంఠం,విశ్వరూపం,యమలోకం,పాతాళ లోకం,మయసభ చివరిగా పద్మవ్యూహంఇలా ఏదేదో వింత లోకాల్లో తిరిగి తిరిగి బయటికి వస్తాము.లోపల ఫోటోలు తీయకూడదు
ముందు ఇవన్నీ చూస్తూ నడవటం సరదాగానే అనిపించినా ఇంతదూరం నడిచి,మెట్లెక్కి అందరికీ నీరసం వచ్చేసింది .ఇక్కడ నడవటం కొంచెం కష్టమే అనిపించింది.



టీవీ యాడ్ లో నారదుల వారు హనుమంతుడు లడ్డూ ప్రసాదం ఇస్తారు అని చెప్తారు.నిజంగానే చివరిలో హనుమంతుడి చేతిలోనుండి లడ్డు ప్రసాదం ఇస్తారు కానీ ఉచితంగా కాదు
20 రూపాయలు తీసుకుని.మేము కూడా తీసుకున్నాము.
ఒక ప్లాస్టిక్ బంతి లో వున్న రవ్వలడ్డు ను ప్రసాదంగా ఇచ్చారు.

శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం - యాదగిరి గుట్ట
తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంచేసుకున్నాము.
సాయంత్రం కొండ మీద చల్లటి గాలులతో వాతావరణం కొంచెం చలిగానే వున్నాఇబ్బంది అనిపించలేదు.
గర్భగుడి విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతూ,ఆలయం లోపల వున్న చిత్రపటాలు,
అలంకరణ చాలా బాగుంది.
లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలసిన నరసింహ స్వామిని దర్శనం చేసుకుని,తీర్ధ,ప్రసాదాలు తీసుకుని,
వెరైటీగా అట్టపెట్టెల్లో పెట్టి అమ్ముతున్న లడ్డుప్రసాదం కొనుక్కుని,
బయటికి వచ్చాము.ఇక్కడ కోతులు గుంపులు గుంపులుగా వున్నాయి...
కానీ ఎవరినీ ఏమీ అనకుండా తిరుగుతున్నాయి.
ఇవీ మేము మొదటిసారి వెళ్ళిన మా యాదగిరిగుట్ట యాత్రా విశేషాలు..
మా చెల్లి,మరిది గారు సర్ప్రైజింగ్ గా అప్పటికప్పుడు చెప్పి మమ్మల్ని తీసుకు వెళ్ళిన ఈ ట్రిప్ ఒక మంచి జ్ఞాపకం..
Related Posts Plugin for WordPress, Blogger...