పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

19, డిసెంబర్ 2011, సోమవారం

ఖాళీగా వున్నారా?



మనుషులు ఎప్పుడూ తమదే పైచేయి కావాలని కోరుకుంటారు.భార్య మీద భర్త,భర్త మీద భార్య, పిల్లల మీద తండ్రి,విద్యార్ధుల మీద ఉపాధ్యాయుడు,ఉద్యోగుల మీద ఆఫీసర్ ...ప్రతి ఒక్కరిలో ఈ స్వభావం వుంటుంది.
ఈ ఆధిపత్య ధోరణి అధికారానికి గుర్తు. సాధారణంగా అణకువగా ఉండటాన్ని,ఎదుటివారికి లొంగి పోవడంగా,పిరికితనంగా జమకడతారు.

"అహింస బలవంతుడి ఆయుధం"అన్నారు గాంధీజీ.ఎదుటివాడిని కొట్టగలిగీ కొట్టకుండా వదిలిపెట్టటం బలవంతుడికే సాధ్యం కదా! కాశీకి వెళ్ళిన ఒకతను తనకు బాగా ఇష్టమైన స్వీట్ వదిలిపెట్టి వస్తాడు..తిరుపతి వెళ్ళిన ఒక మహిళ తను ప్రాణంగా చూసుకునే తలనీలాలను అర్పించుకుని వస్తుంది. కానీ నాకు అత్యంత ఇష్టం ఏమిటి? నేనే, ఆ నేనును ఆ గర్వాన్ని,ఆ అధికారాన్ని అర్పించుకోవాలి..

నీలోని నిన్నే నువ్వు అర్పించుకుంటే నువ్వు ఖాళీ అవుతావు.మనం దేవుడి ముందు మోకరిల్లుతాం.మన అహాన్ని తీసి పక్కన పెట్టేస్తాం.అప్పుడు మనలోకి మనకు తెలియకుండానే ఏదో శక్తి ప్రవహించినట్లు అనిపిస్తుంది.ఎందుకని?? మనం ఖాళీగా వున్నాం కనుక,దాన్ని భగవంతుడు తన శక్తితో పూరించాడు కనుక..

శూన్యంలోకి గాలి త్వరగా ప్రవేశిస్తుంది.శూన్యం దేన్నయినా త్వరగా ఆకర్షిస్తుంది.మనం కొత్తగా ఉండాలంటే,మనని కొత్తగా నింపుకోవాలంటే మనలోని అహంకారాన్ని,అన్నీ మనకు తెలుసనే అజ్ఞానాన్ని వదులుకోవాలి.
మనలో శూన్యం ఏర్పరచుకోవాలి ,కాకపోతే ఆ శూన్యాన్ని అభిమానం,ప్రేమతో నింపుకోవాలి.

ఎవరు చెప్పిందైనా వినగలగాలి అందులో నిజా నిజాలు గ్రహించగలగాలి.ఎవరి గురించైనా ఎవరైనా చెప్పే మాటలు నిజమా కాదా అని ఆలోచించగలగాలి. ఎదుటివారి గురించి మనకి చెడుగా చెప్పే వ్యక్తి  ఆ అలవాటుని మన విషయంలో కూడా ప్రయోగించడని నమ్మకం లేదు కదా అందుకే అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి
ఎవరి గురించైనా ఒక నిర్ణయానికి, అభిప్రాయానికి తొందరగా రాకూడదు.

ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించగలగాలి.నేను ఒక విషయం చెప్పాను కాబట్టి ఇదే నిజం,ఇదే జరిగి తీరాలి అనుకుంటే వాదనలు,వివాదాలు తప్ప ఇంకేమీ ఫలితం వుండదు.తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే పంతం, మొండిపట్టుదల  అన్ని విషయాల్లో  అనర్దాలకే దారితీస్తుంది.

నిత్య జీవితంలో మనకు ఎందరో తారసపడుతుంటారు.ఎవరో ఏదో అన్నంత మాత్రాన బాధపడుతూ కూర్చోవాలా?
తలచుకుని తలచుకుని కుంగి పోవాలా? అది నిజంగానే అర్ధంలేని వాగుడైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు..
సద్విమర్శ అయితే సవినయంగా స్వీకరించగలగాలి, మనలోని లోపాల్ని గుర్తించి సరిదిద్దుకోవాలి..

వేలెత్తి చూపే ప్రతి వ్యక్తీ గురువే అనుకుంటే,
వేధించిన ప్రతి అనుభవము పాఠమే అనుకుంటే...
కోపాల్లేవు, తాపాల్లేవు,కన్నీళ్లు లేవు,అసూయా ద్వేషాలు లేవు.
ఇంక నెగటివ్ భావాలకు చోటెక్కడిది?
అరుదుగా కొన్ని ఏర్పడినా క్షణాల్లో బుర్ర ఖాళీ చేసి వెళ్ళిపోతాయి..

“Our minds should not be empty
because if they are not preoccupied by good,
evil will break in upon them.”


Related Posts Plugin for WordPress, Blogger...