పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

27, అక్టోబర్ 2015, మంగళవారం

అమరావతి నగర శంకుస్థాపన - వింతలూ .. విశేషాలు



మా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర శంకుస్థాపన 22 - 10 - 2015 దసరా పండగ రోజున అంగరంగ వైభవంగా  అతిర‌థ మ‌హార‌థుల మ‌ద్య సందడిగా జ‌రిగింది.. శంకుస్థాపన విశేషాలు,విషయాలు అన్నిటి గురించి ఎప్పటికప్పుడు మీడియా అందరికీ తెలియచేస్తూనే ఉంది కాబట్టి నేను కొత్తగా చెప్పేది ఏమీలేదు.ఈ కార్యక్రమం గురించి ఎప్పటి లాగానే కొందరు వ్యతిరేకంగా మాట్లాడితే కొందరు సానుకూలంగా స్పందించటం,అందరికీ మంచి జరగాలని కోరుకోవటం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు శంకుస్థాపన కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఈవెంట్ మేనేజర్ గా ok అనిపించుకున్నారు కానీ పాలకుడిగా ఇంత ఘనకార్యాన్ని (రాజధాని నిర్మాణం) ఎలా సాధిస్తారో చూద్దామని కొందరంటే .. తెలివి ఉండాలే కానీ ఇటుకలు అమ్మి కూడా (My Brick My Amaravati) కోట్లు సంపాదించగలం అని ముఖ్యమంత్రి నిరూపిస్తున్నారు అని కొందరు,మోడీగారు ఏదో ఉద్ధరిస్తారు అనుకుంటే మట్టి,యమునా నది నీళ్ళతో సరిపెట్టారని మరికొందరంటున్నారు.ఏదేమైనా మంచి పనికి భగవంతుడి సహకారం ఉంటుంది అంటారు కదా. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని త్వరగా నిర్మాణం కావాలని,అంతా మంచి జరగాలని కోరుకుందాము.

 

 

ప్రముఖ శిల్పి రాజీవ్ సేథీ నేతృత్వంలో రాజధాని ప్రాంతంలో నిర్మించే చారిత్రక స్థూపం వద్ద నిక్షిప్తంచేసి ప్రజల ఆశలను,ఆకాంక్షలను,భావోద్వేగాలనుసజీవం చేయాలన్న ఆలోచనతో ప్రతిగ్రామంలోని పవిత్ర ప్రదేశాలనుండి సేకరించిన మట్టి,నీరుతో నిర్మించిన స్థూపం.

 

అమరావతి సంకల్పజ్యోతి 

 

శంకుస్థాపన సభలో ప్రధాన ఆకర్షణ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.స్వ‌యంగా అమరావ‌తికి ర‌మ్మంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేసీఆర్ ను ఆహ్వానించారు.ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలతో ద్వేషాన్ని మాటల్లోనే  వెళ్ళగక్కే ఈ నాయకులు ఇలా కలిసిపోవటం ?? రాజకీయాల్లో మామూలే కానీ శంకుస్థాపన సభకు వచ్చిన సామాన్య ప్రజలు కూడా కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు సంతోషంగా చేతులు ఊపుతూ అభివాదం చేయటం మాత్రం అందరికీ కొంచెం ప్రత్యేకంగానే అనిపించింది.చిన్నప్పుడు మా స్కూల్ లో ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు మా టీచర్స్  ముందుగానే "వచ్చిన అతిధి మాట్లాడటం అయిపోగానే వాళ్ళేమి మాట్లాడారో మీకు అర్ధం అయినా కాకపోయినా గట్టిగా చప్పట్లు కొట్టండి అప్పుడే వచ్చిన అతిధుల్ని మనం గౌరవించినట్లు అని " చెప్పేవాళ్ళు. ఇక్కడ కూడా అలాగే ఏమైనా జరిగిందా లేక ఆంధ్రాప్రజలే స్వచ్చందంగా, సంతోషిస్తూ కేసీఆర్ కోసం హర్షధ్వానాలు చేశారా?? అని ఒక చిన్న డౌటు కూడా వచ్చింది.

అమరావతి నిర్మాణానికి, అభివృద్ధికి కోసం అవసరమై అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కేసీఆర్ అనటం సంతోషించదగిన పరిణామం.కానీ తెలంగాణా ముఖ్యమంత్రి గారూ..  మీరు సహాయం చేసినా, చెయ్యకపోయినా పర్లేదు కానీ "బతుకమ్మ,, బోనాలు పండగలు ఘనంగా చేసుకుంటూ ఆ అమ్మవారి ముందు బాగా నిష్టగా పూజలు చేసి,మమ్మల్ని ఇప్పటిదాకా ఆంద్రోళ్ళు నీపూజల్ని చెయ్యనియ్యలేదమ్మా ,మమ్మల్ని మా భక్తిని ఎగతాళి చేశారమ్మా, ఇప్పుడు మేమొచ్చాకే నీ పూజలు జరిపిస్తున్నాం..వాళ్ళని నువ్వే చూసుకో తల్లీ అని ఆంధ్రా వాళ్ళమీద అమ్మవారికి కంప్లైంట్లు చేయొద్దని కొంచెం మీ రాష్ట్ర మహిళలకు చెప్పండి ప్లీజ్ ..తెలంగాణా మగవారి కంటే ఆడవారికే ఆంధ్రామీద,ఆంధ్ర రాష్ట్ర ప్రజలమీద ఆగ్రహావేశాలు,ఆంధ్రోళ్ళు  తెలంగాణా ప్రజల్ని దోచుకున్నారనే వేదన చాలా ఎక్కువని అనుభవంలో మేము తెలుసుకున్న సత్యం. అయినా లోకాలనేలే ఆ జగన్మాత మనం ఎవరి మీద ఏది చెప్తే అది నమ్మేసి,ఎవర్ని శిక్షించమంటే వాళ్ళని శిక్షిస్తుందా?? అలా చేయటానికి అమ్మవారేమన్నా రిటర్న్ గిఫ్ట్ కోసం మనింటికి పేరంటం వచ్చే పక్కింటావిడ కాదు కదా.. దుష్టశిక్షణ,శిష్ట రక్షణ కోసం అవతరించిన ఆ తల్లికి సర్వం తెలుసు. 

ఈ శంకుస్థాపన లో మాకు మరో విశేషం ,మా మరిదిగారు(మా చెల్లి వాళ్ళాయన) తెలంగాణ నుండి ఆంధ్రాకి రాజధాని డ్యూటీ ఆఫీసర్ గా  రావటం.తెలంగాణా పోలీస్ అంటే ఎప్పుడూ అటువైపే డ్యూటీలు ఉంటాయి,ఆంధ్రాకి రారు కదా అనుకునే వాళ్లము. కానీ ఈసారి తెలంగాణా పోలీస్ లు కూడా ఇక్కడికి  రావటం వలన మా సొంత జిల్లా గుంటూరులో డ్యూటీకి రావటం మాకు ఆశ్చర్యంగా,ఆనందంగా అనిపించింది.ఆవిధంగా మాకుటుంబసభ్యులు కూడా మా ఆంధ్రారాజధాని శంకుస్థాపనలో పాల్గొన్నట్లయింది.


శంకుస్థాపన కార్యక్రమంలో నటుడు సాయికుమార్,గాయని సునీత ఉపద్రష్ట వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన, శంకరంబాడి.సుందరాచారి గారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటతో కార్యక్రమం మొదలయ్యింది.సునీత పాడిన మా తెలుగు తల్లికి పాటని వింటుంటే ఈమధ్య టీవీల్లో చిన్నపిల్లలు కూడా ఇలా పాడట్లేదే..! కనీసం ఒకసారి ఆ పాట రిహార్సల్స్ అయినా చేసుకుందా అనిపించింది.సునీత పాట పాడేటప్పుడు ఊపిరితీస్తూ,ఆయాస పడుతున్నట్లు పాడుతుందని నా అభిప్రాయం.నేనేదో సునీతని తప్పు పట్టటం లేదు.ఎవర్నైనా వంక పెట్టటం చాలా సులభం,అది తప్పు కూడా.. కానీ ఆంధ్రరాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటని రాజధాని ఆరంభ శుభసమయంలో పాడమని బాధ్యత అప్పగిస్తే గాయని సునీత ఆయాసపడుతూ,దాదాపు ఏడుస్తున్నట్లు,నీరసంగా ఆ పాట పాడటం చాలా ఘోరంగా అనిపించింది.పాపం గుంటూరు ఎండ ప్రభావం కూడా కావచ్చేమో .. 

ఈ పాట మిగతా వాళ్ళు ఎలా పాడారా అని యూట్యూబ్ లో వెతికితే  టంగుటూరి సూర్యకుమారి గంభీరమైన గానం ,చక్కని సంగీతంతో దేశభక్తి పాటంటే ఇలాగే ఉండాలి అనిపించేలా ఉంది.ఇక బుల్లెట్ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారి పాట కూడా ఆయన అన్ని పాటల్లాగే చాలా బాగుంది.బాలు గారి పాట విన్నాక అందుకే అప్పట్లో పాడుతాతీయగాలో పాడటానికి వచ్చిన వాళ్ళని చిన్నతప్పు పాడినా మందలిస్తూ సరిగా పాడమని,వాళ్ళు బాధపడినా సరే తప్పులు,లోపాల్ని ఎత్తిచూపేవారు .కానీ ఇప్పుడు రకరకాల ఛానళ్ళల్లో వస్తున్న సింగింగ్ కాంపిటీషన్స్ లో జడ్జ్ లు పాడేవాళ్ళు ఎలా పాడినా పట్టించుకోకుండా వాళ్ళని మెచ్చుకోవటం,ఆహా వోహో అనటం చూస్తుంటే కింగ్ సినిమాలో బ్రహ్మానందం సీన్స్ గుర్తొస్తున్నాయి.అలాగే కొంతమంది చిన్నపిల్లలు కూడా గొప్ప సింగర్స్ అనిపించుకునే వాళ్ళకంటే కూడా బాగా పాడుతున్నారు.

ముగ్గురు గాయకులు పాడిన ఈ మాతెలుగుతల్లి  పాటలు వింటే  ఎవరెలా పాడారో తెలుస్తుంది.

మా తెలుగు తల్లికి మల్లెపూదండ - టంగుటూరి సూర్యకుమారి 


మా తెలుగుతల్లికి మల్లెపూదండ - S.P. బాలసుబ్రహ్మణ్యం 


మా తెలుగుతల్లికి మల్లెపూదండ - సునీత 
 

అమరావతి శంకుస్థాపన చిత్రాలు





ఏదేమైనా అన్ని ప్రతికూల ఆలోచనలను ప్రస్తుతానికి వదిలేసి,సానుకూల ధోరణితో కొనసాగుతూ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని,అందమైన భవిష్యత్తును వేగంగా నిర్మించుకోవాలని కోరుకుంటూ


All The Best - "Amaravati
The dream capital of  Andhra Pradesh"
Related Posts Plugin for WordPress, Blogger...