పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, డిసెంబర్ 2016, శనివారం

మా తమిళనాడు యాత్రా విశేషాలు - కన్యాకుమారి



"కలికి పదములు కడలి కడిగిన కళ ఇది"

Cape Comorin, కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలోని ఒక పట్టణము.భారతదేశానికి దక్షిణాన భరతమాత పాదాలను బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం నిత్యం కడిగే పవిత్ర త్రివేణి సంగమక్షేత్రం కన్యాకుమారి.భారతదేశానికి దక్షిణం వైపున చిట్టచివరి ప్రదేశం.కన్యాకుమారిలో సూర్యోదయానికి చాలా ప్రత్యేకత ఉందికదా,సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు.సూర్యోదయంచాలా బాగుంటుందని,ఖచ్చితంగా చూడమని మేము దిగిన హోటల్ వాళ్ళు కూడా చెప్పారు. ఉదయాన్నే మేమున్న హోటల్ మీద,చుట్టుపక్కల అన్నీ చోట్ల యాత్రికులు డాబాలెక్కి,సముద్రతీరానికి దగ్గరలో అంతా తెల్లవారుఝామునుండే సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నారు.మేము కూడా సూర్యుడి కోసం కాసేపు ఎదురుచూసి,సూర్యుడ్ని చూసేసి వచ్చాము.

మేమున్న హోటల్ కి ఎదురుగానే ఉన్న కన్యాకుమారి ఆలయంలో అమ్మ దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ పార్వతీదేవి కన్యాకుమారి అమ్మవారిగా కొలువయ్యింది.పురాణ కథనాల ప్రకారం అమ్మవారు కన్యాదేవిగా , పరమశివుడిని వివాహం చేసుకునేందుకు అంతా సిద్ధం చేశాక ముహూర్తం సమయానికి కూడా శివుడు రాకపోవటంతో వివాహం ఆగిపోయింది అందుకే అమ్మవారిని కన్యాకుమారిగా పూజిస్తారు.పెళ్ళివిందుకు సిద్ధంచేసిన బోజనాలను సముద్రం ఒడ్డున పారబోశారట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని చెబుతుంటారు. గుడిలో జనం తక్కువగానే ఉండటంతో అమ్మ దర్శనం ప్రశాంతంగా చేసుకుని,బయటికి వచ్చేశాము.గుడికి ఎదురుగానే దూరంగా సముద్రంలో కనిపిస్తున్న వివేకానంద రాక్‌ ని చూస్తూ కాసేపు అక్కడే ఉండి,ఇక  వివేకానంద రాక్‌కి బయలుదేరాము.

కన్యాకుమారి అమ్మవారి దేవాలయం 

వివేకానంద రాక్ కి సాయంత్రం 4 గంటల దాకా యాత్రికులకోసం బోట్స్ నడుస్తుంటాయి.ఇక్కడ ferry tickets కోసం ఉన్నంత క్యూ దేవాలయాల్లో కూడా ఉండదేమో అనిపించింది.కానీ ఆ ప్రదేశానికున్న ప్రత్యేకత అలాంటిదేమో.దక్షిణ భారతదేశపు చివరి భూభాగంలో ఉండటమే ఒక అద్భుతమైతే, భారత భూభాగాన్ని దాటి మూడు సముద్రాల సంగమం మధ్యలో ఉన్న చిన్న కొండమీదకి  వెళ్తున్నామనే సంతోషం ముందు ఈ క్యూ పెద్ద సమస్యగా అనిపించదు కూడా.వేగంగా, అలలతో ఉన్న సముద్రంలో  ప్రయాణం నిజంగా అద్భుతం.

Ferry Ticket 

 వివేకానంద రాక్ వెళ్లే బోట్స్   

వివేకానంద రాక్ / Vivekananda Rock Memorialఇక్కడ 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు.ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో స్మారక కేంద్రం నిర్మించారు.ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో నిలుచుని ఉన్న వివేకానందుడి నిలువెత్తు కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణ.1970వ సంవత్సరంలో అప్పటి రాష్టప్రతి వి.వి.గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఇక్కడ బుక్ షాప్స్,మెడిటేషన్ హాల్ కూడా ఉన్నాయి.వివేకానందుడి రచనలే కాకుండా ఇక్కడ ఇంకా చాలా మంచి పుస్తకాలున్నాయి.

ఇక్కడ వివేకానందుడే కాదు పార్వతీదేవి కూడా తపస్సు చేసిందట.వివేకానంద స్మారక కేంద్రం ఎదురుగా ఉన్న దేవాలయం పార్వతీదేవి  పరమశివుడిని పెళ్ళి చేసుకోవాలని తపస్సుచేసిన ప్రాంతం,అక్కడ అమ్మవారి పాదముద్రలు ఉంటాయి.నల్లటి పాలరాయి మీద తెల్లటి డిజైన్స్ తో నిర్మించిన వివేకానంద స్మారకమందిరం,అమ్మవారి ఆలయం చాలా అందంగా ఉన్నాయి.

వివేకానంద రాక్‌కు సమీపంలోనే 133 అడుగుల ఎత్తుతో తిరువళ్లువర్‌ విగ్రహం ఉంటుంది.తమిళనాడుకి చెందిన,రెండువేల సంవత్సరాల క్రితం జీవించిన  ప్రముఖ కవి.ఇతని రచన తిరుక్కురళ్ తమిళ సాహిత్యంలో ప్రసిధ్ధి చెందింది.నీతి బోధలతో ఉన్న ఇతని కవిత్వం తమిళప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తుందని చెప్తారు.
తిరువళ్ళువర్ విగ్రహాన్ని 2000 సంవత్సరంలో ఆవిష్కరించారు.ఇక్కడికి ఇంతకుముందు యాత్రికులను తీసుకెళ్ళేవాళ్ళట, కానీ ఇప్పుడు వివేకానంద రాక్ దాకానే తీసుకెళ్తున్నారు.బోట్లో నుండి దూరంగా కనిపించే వివేకానంద రాక్,తిరువళ్ళువర్ విగ్రహం దగ్గరయ్యేకొద్దీ ఒక గొప్ప ప్రదేశాన్ని చూస్తున్నామని చాలా సంతోషంగా అనిపిస్తుంది.


సముద్రం మధ్యలో చాలా ప్రశాంతంగా, చుట్టూ ఎంత మంది ఉన్నా నిశ్శబ్దంగా చాలా బాగుంది,కానీ ఎండ ఎక్కువగా ఉంది.ఇక్కడ సాయంత్రం 4 గంటల వరకు మనకిష్టమైనంత సేపు ఉండొచ్చు. మేము కూడా చాలాసేపు అంతా తిరిగి చూశాము,కొన్ని బుక్స్ తీసుకున్నాము,ఎంతసేపున్నా విసుగనిపించలేదు,చుట్టూ నీలిరంగు సముద్రం,మధ్యలో చిన్న రాక్ మీద రకరకాల ప్రదేశాల మనుషులు నిజంగా అద్భుతం. 

వివేకానంద స్మారక మందిరం 


మందిరం లోపలికి 

బుక్స్ 

మెడిటేషన్ హాల్ 

తిరువళ్ళువర్ విగ్రహం 


ఇవీ మా కన్యాకుమారి యాత్ర విశేషాలు.కొన్నిటి గురించి మాటల్లో  చెప్పలేము.
అలాంటిదే కన్యాకుమారి కూడా..మా అందరికీ చాలా నచ్చిన ప్రదేశం.

కన్యాకుమారి నుండి మధురై వెళ్ళేదారిలో wind farms 
దారిపొడవునా రోడ్డుకి రెండువైపులా చాలాదూరం వరకు ఇలాగే కనిపిస్తూ ఉంటాయి.  

రామేశ్వరం నుండి కన్యాకుమారి వెళ్ళేదారిలో తిరునల్వేలి వస్తుంది.ఇక్కడ హల్వా చాలా famous అట.దీన్ని తిరునల్వేలి హల్వా లేదా IruttuKadai halwa అంటారు.online లోకూడా తెప్పించుకుంటారట.తిరునల్వేలి వెళ్ళగానే,మనం కూడా కొనుక్కుందామని  మాతమ్ముడు అక్కడ వాళ్ళని ఈ హల్వా గురించి అడగ్గానే Santhi Sweets లో బాగుంటుందని అడ్రెస్ కూడా చెప్పారు.మేము అక్కడికే వెళ్లి హల్వా కొన్నాము. నిజంగా చాలా బాగుంది Iruttu Kadai halwa♡. 

Tirunelveli Halwa 



24, డిసెంబర్ 2016, శనివారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 23




ఇప్పటిదాకా జరిగిన మొత్తంకథ ఈ లింక్ లో  చదవచ్చు..  

http://raji-rajiworld.blogspot.in/search/label/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B0%BE%20%3F%3F%20--%E0%B0%92%E0%B0%95%28%E0%B0%B0%E0%B0%BF%29%20%E0%B0%95%E0%B0%A7


క్లుప్తంగా ఇప్పటిదాకా జరిగిన  కధ .. 

బాగా చదివి,గవర్నమెంట్ సీట్లు తెచ్చుకోలేక కష్టపడి నాన్నసంపాదించిన డబ్బునంతా బెంగుళూరు యూనివర్సిటీకి ఫీజుల రూపంలో ఖర్చుపెట్టించిన అన్న,ఇద్దరు అక్కల్లా కాకుండా నాన్న ఆశయానికి, నాన్నకి  ఏకైక వారసుడిగా డాక్టర్ అవ్వాలని, దేవుళ్ళ కి మారు రూపాలైన మా పెద్దల దీవెనలతో,వివేకానంద స్ఫూర్తితో ఎంసెట్ లో చాలా మంచి ర్యాంకు తెచ్చుకుని మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయిన దగ్గరి నుండి  సీనియర్లు, తోటి క్లాస్ మేట్స్ టీజింగ్ లు ఎదుర్కుంటూ కాలేజ్ కి వెళ్తున నాకు కావ్య పరిచయం ఒక గొప్ప మార్పు,ఒక మంచి మలుపు.కావ్య మాధవ్ నువ్వు చాలా పద్ధతిగా చెడ్డ అలవాట్లు లేకుండా ఉంటావు,నీలాగా మా అన్న హేమంత్ ని కూడా మార్చు,అని చెప్పటంతో హేమంత్ ని ఎలాగైనా మంచి మార్గంలో పెట్టాలి అనుకుని,హేమంత్ రూమ్ లోనే చేరిపోయాను.కాలేజ్లో పరిస్థితి అలాగుంటే ఇటు మా ఇంట్లో మా అన్నకి,కజిన్ భార్యకి అక్రమ సంబంధం ఉందని, మా పెద్దలే మాట్లాడటం,మా చిన్నక్క కొన్నాళ్ళు కనపడకుండా ఎటో పోయిందని మా పెద్దల పెంపకం గురించి మా బంధువుల ఇళ్ళల్లో చెవులు కొరుక్కోవటం, ఇలాంటివన్నీ కొంచెం బాధ అనిపించినా, ఇంకో సంతోషం మా అన్నకి ఎంగేజ్ మెంట్ కావటం.ఎంగేజ్ మెంట్ అయ్యి మళ్ళీ కాలేజ్ కి వెళ్ళగానే నాకోసం అక్కడ మరో సంతోషం కావ్య తనంతట తానుగా నన్ను  వాళ్ళ ఇంటికి పిలవటం,నాకోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పటం,నామనసులో ఏవేవో  ఆలోచనలు కలిగించాయి.

ఇక ప్రస్తుత కథ చదవండి... 

కావ్య వాళ్ళింటికి వెళ్లిన నాకు కావ్య  ప్రవర్తన చాలా సంతోషాన్ని కలిగించింది.నాతో స్నేహాన్ని మించిన ఫీలింగ్ ఎదో తన మనసులో ఉన్నట్లు నాకనిపించింది.అప్పటినుండి నా రూమ్మేట్స్ ఏమన్నా లెక్కచేయకుండా నేనొక్కడినే కావ్య ఇంటికి వెళ్ళటం,ఇద్దరం కాలేజ్ లో కలిసినప్పుడు మాట్లాడుకోవటం నాకంతా కొత్తగా సంతోషంగా, కాలమిలా సాగిపోనీ అన్నట్లు సమయం సంతోషంగా గడిచిపోతుంది.ఈలోగా కాలేజ్ బెంగుళూరు,ఊటీ టూర్ అనౌన్స్ చేశారు కాలేజ్ లో అంతా వెళ్తున్నారు నేను కూడా వెళ్లాలని నాన్నతో చెప్పి, డబ్బులు తెప్పించుకున్నాను. డబ్బు తీసుకుని వచ్చిన నాన్న ఎవరెవరు వెళ్తున్నారు?ఎప్పుడు వెళ్తున్నారు లాంటి వివరాలన్నీ కనుక్కొని నాకు జాగ్రత్తలు చెప్పి,వెళ్లిపోయారు. టూర్ కి వెళ్లేరోజు రానే వచ్చింది.కావ్య తన ఫ్రెండ్స్ తో ,నేను మా రూమ్మేట్స్ తో బస్సుదగ్గరికి చేరుకున్నాము.ఆరోజుల్లో విహారయాత్రలంటే  ఎదో తెలియని  ఉద్విగ్నత,  పైగా కావ్యతో కలిసి చేస్తున్న ప్రయాణం ఇంకొంచెం ఎక్కువ సంతోషంగా అనిపించింది.కానీ నాకా క్షణం తెలియదు నా జీవితమంతా నాకు ఇష్టం లేకపోయినా  ఇలాగే యాత్రల్లోనే  గడిచిపోతుందని.

బస్సులోకెక్కాక ఇక అంతా పాటలు, అల్లరి అప్పట్లో వచ్చిన సినిమా పాటలు,సొంత కవిత్వాలు  పాడుతూ హాయిగా ప్రయాణం సాగిపోతుంది.అప్పుడప్పుడు నాకు రెండు సీట్ల ముందు తన ఫ్రెండ్ అనితతో కూర్చున్న కావ్యని  గమనిస్తూ ఉన్నాను.తను బస్సులో ఎవరి గొడవ పట్టించుకోకుండా ఇయర్ ఫోన్స్ తో వాక్ మాన్ లో పాటలు వింటూ కూర్చుంది.కావ్యకి ఇళయరాజా పాటలంటే చాలా ఇష్టం.నాకు అప్పటిదాకా ఏ పాటలు అంత ప్రత్యేక ఇష్టం లేదు కానీ అప్పుడప్పుడు కావ్య చెప్తుంటే ఈమధ్యే కొన్ని తెలుసుకుంటున్నాను.ప్రయాణం మధ్యలో ఉండగా కావ్య ఫ్రెండ్ అనితకి వాంతులు మొదలయ్యాయి.సీట్లో కూర్చోలేక అవస్థ పడుతున్న తనని సీట్లో పడుకోబెట్టిన కావ్య, నాపక్క సీట్ ఖాళీగా ఉండటంతో అక్కడికొచ్చి కూర్చుంది. కావ్యతో అంత దగ్గరగా నా ఊటీ ప్రయాణం నేనిప్పటికీ మర్చిపోలేనిది. పక్కనే కూర్చున్న కావ్యతో ఎదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఏం పాటలు వింటున్నావు కావ్యా? అని అడగ్గానే  నువ్వు కూడా విను మాధవ్ మంచి పాట! అంటూ ఇయర్ ఫోన్ ఒకటి తన చెవిలో ఉంచుకునే రెండోదినాకు ఇచ్చింది. "కన్నులకు చూపందం కవితలకు ఊహందం చిరునవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం" అనే పాట చాలా సున్నితంగా వినిపిస్తుంది.ఆపాట అందం ఎలా ఉన్నా కావ్యతో కలిసి ఒకే వాక్ మాన్ లో ఆ పాటలు వినటం మాత్రం నాకు ఎప్పటికీ అందమైన జ్ఞాపకం. 

అలా హాయిగా సాగిన ప్రయాణం బెంగుళూరు,మైసూర్,ఊటీ అన్నీ చూసుకుంటూ  నేను కావ్య,అనిత,షాజహాన్ ఇంకా కొందరం బాచ్ గా తిరుగుతూ, అక్కడక్కడా ఆగుతూ గుర్రాలెక్కి, ఫోటోలు,గ్రూప్ ఫోటోలతో,ఆ ఫోటోల వెనక నేను రాసుకున్న టూర్ విశేషాలు నాజీవితంలో ఒక అందమైన అనుభవం.టూర్ అంతా మా రూమ్మేట్స్ నన్ను కావ్య గురించి ఏదోఒకటి అంటూ టీజ్ చేస్తూనే ఉన్నారు.అందుకే ఈ టూర్లో వాళ్లకి నేను కొంత దూరంగానే ఉన్నాను.సరదాగా గడిపిన ఆ టూర్ తర్వాత మళ్ళీ  కాలేజ్,రూమ్,చదువు రొటీన్ లైఫ్ మొదలయ్యింది.ఇంతలో మా రూమ్మేట్,కావ్య (కజిన్) అన్నయ్య హేమంత్ పుట్టినరోజు వచ్చింది.ఈసారి నా బర్త్ డే మన రూమ్ లోనే సెలెబ్రేట్ చేసుకుందాము.మా పిన్ని(కావ్య వాళ్ళఅమ్మ ),కావ్య కూడా మన రూమ్ కే  వస్తానన్నారు అని హేమంత్ చెప్పగానే ఈరోజంతా కావ్య ఇక్కడే ఉంటుందన్నమాట అని నాకు చాలా సంతోషంగా అనిపించింది.మధ్యానానికి కావ్య ,ఆంటీ మా రూమ్ కి వస్తూనే చాలారకాల వెజ్,నాన్ వెజ్ డిషెస్ అన్నీ రెడీ చేసి తీసుకొచ్చారు.

నాకు కొందరి ఇళ్లలో వంట ఎప్పటికీ ఆశ్చర్యమే!!మా నాన్న పేరుకే డాక్టర్ కానీ మాఇంట్లో  రోజూ మామూలుగా  వండుకునే అన్నం, పప్పులు,పండగలకి పులిహోర,పూరీలు తప్ప వెరైటీ వంటలేమీ వండరు.చిన్నప్పుడెప్పుడో  మా నాన్న రైల్లో మద్రాస్ టూర్ తీసుకెళ్తే కూడా ఇంట్లోనే వండుకున్న పూరీలు,కొబ్బరిపచ్చడి  డబ్బాల్లో పట్టుకొచ్చింది మానాయనమ్మ. ఎప్పుడన్నా ఏమన్నా తినాలనిపిస్తే ముందుగానే వేయించిన అప్పడాలు,వడియాలు ఒక డబ్బాలో పెట్టి అవి రెండు తీసి ఇచ్చేది. పులిహోరకి కావాల్సిన చింతపండు పేస్ట్ ముందుగానే కలిపి ఉంచి ఎప్పుడంటే అప్పుడు పులిహోర కలిపి పెట్టేది.మా అమ్మని పిచ్చి హాస్పటల్లో ఉంచినప్పుడు చూట్టానికి మద్రాస్ వెళ్లొస్తూ మానాన్న క్రీమ్ బిస్కట్స్ పాకెట్స్ తెచ్చేవాడు.నాయనమ్మ వాటిని దాచి అప్పుడప్పుడు నాకు,అక్కలకి  పెట్టేది .అదే మాకు బ్రహ్మాండం గా అనిపించేది.మా అమ్మకి నాన్ వెజ్ అంటే ఇష్టమే కానీ మా నాయనమ్మ ఇంట్లో దాన్ని నిషేధించడంతో మా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లి తినొచ్చేది.కానీ ఎప్పుడన్నా మా క్లాస్మేట్స్ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మలు చాలా నీట్ గా రకరకాల వంటలు చేసి పెట్టేవాళ్ళు.అప్పుడు ఆలోచించే వాడ్ని మా ఇంట్లో ఎందుకిలాలేదు అని? 

ఆరోజు హేమంత్ పుట్టినరోజు స్పెషల్స్ ఆంటీ చాలా బాగా చేశారు.భోజనాలయ్యాక కాసేపు కబుర్లు చెప్పుకుని సాయంత్రం పార్టీ కి రెడీ అయ్యాము.డాబా మీదే కేక్ కటింగ్ ఏర్పాట్లు చేశాము.కావ్య హేమంత్ కి ఎదో గిఫ్ట్ ఇచ్చింది.తర్వాత అక్కడే  కొంచెం పక్కగా నించున్న నా దగ్గరికి వచ్చి రెండు చేతుల్లో Friends Forever అని రాసి ఉన్న heart పట్టుకున్న ఒక చిన్న టెడ్డీని ఇచ్చి మాధవ్ ఇది నీకే.. ఇందాక గిఫ్ట్ షాప్ లో కనిపించింది. బాగుందని కొన్నాను అంటూ ఇచ్చింది.నాకు ఆ టెడ్డీ heart లో friends అనే మాటకంటే forever అనే మాటే నా కళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది.కావ్య నాకోసం గిఫ్ట్ తెచ్చిందన్న ఆనందంలో కొంచెంసేపు మాటలు రాలేదు.కాలం ఆగదు కదా చీకటి పడిపోయింది,కావ్య,ఇంకా వచ్చిన ఫ్రెండ్స్ అందరూ వెళ్లిపోయారు.ఆరాత్రంతా కావ్య ఆలోచనలతో ఆ టెడ్డీని చూస్తూ నిద్ర కూడా రాలేదు.నేను కన్ఫర్మ్ అయిపోయాను కావ్యకి నేనంటే ఇష్టమని. 

నా మనసుకేమయింది  అని పాడుకునేలోపే ఎక్జామ్స్ వచ్చేశాయి.మా రూమ్మేట్స్ ట్యూషన్స్ పెట్టించుకుని,నేను ట్యూషన్స్ లేకుండానే పరీక్షలు రాసేశాము.సెలవుల్లో కావ్య తన బంధువుల ఇంటికి వాళ్ళ తమ్ముడు,చెల్లితో కలిసి వెళ్తున్నానని చెప్పింది. ఇక ఒక్కడినే ఇక్కడ ఉండి ఏమి చేస్తాంలే అని కావ్యకి చెప్పి,మా వూరు బయల్దేరాను. ఎప్పట్లాగే  ఇంట్లో నాన్న,నానమ్మ ఉంటే, మిగతా వాళ్లంతా హైదరాబాద్ లోనే ఉన్నారు.రెండురోజులు కాగానే పెద్దక్క, అమ్మ, అమ్మమ్మ హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చారు.వాళ్ళ వాలకం చూస్తే ఎదో పెద్ద విషయమే చర్చించటానికే వచ్చినట్లుగా అనిపించింది.అది నిజమే అని తెల్లారిన తర్వాత తెలిసింది.మా ఇంట్లో ఏ విషయమైనా ముందు మా అమ్మమ్మ ఇంట్లో చర్చించి,ఆ తర్వాత మా నాన్న ముందు ఆ విషయాన్ని పెడుతుంటారు.ఈరోజు కూడా అలాగే మా అమ్మమ్మ ఇంట్లో సమావేశం.ఇంతకీ విషయం ఏంటంటే మా పెద్దక్కకి పెళ్లి సంబంధం.MBBS లో సీటు రాక డొనేషన్ కట్టి,ఎదో ఒక డాక్టర్ చదివిన మా పెద్దక్క ధ్యేయం ఎంత కట్నమైనా ఇచ్చి,ఖచ్చితంగా అమెరికా  మొగుడే కావాలని.అందులో భాగంగానే హైదరాబాద్ లో  BTech చదివి,ఎదో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లోపనిచేస్తూ,అతనికి కూడా  అమెరికా వెళ్లాలనే కోరిక ఉన్నా ఆర్ధిక స్థోమత లేని ఒక  సంబంధం వచ్చిందట.ఇప్పుడు పెద్దక్క ఎంత డబ్బైనా ఇచ్చి,అతన్నే పెళ్ళిచేసుకుని అమెరికా వెళ్లాలని డిసైడ్ అయిపొయింది కానీ ఎక్కువ కట్నం అంటే  మా నాన్న, నాన్నమ్మ ఒప్పుకుంటారా అన్నదే సందేహం.నాన్నకి ఈ విషయం చెప్పే బాధ్యత ఎప్పటిలాగే మా అన్నయ్య మీద పడింది.అన్నయ్య నాన్నతో మాట్లాడటం,నాన్న కూడా ఇప్పటికే అమెరికాలో ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ కట్నమివ్వాలి,అదే వీళ్లయితే తక్కువకే ఒప్పుకుంటారు,మనమే అమెరికా పంపినట్లు ఊర్లో కూడా గొప్పగా ఉంటుందని  నాన్నమ్మని ఒప్పించి, పెళ్లికి ఒప్పుకున్నారు. 

ఇక మాప్రయాణం హైదరాబాద్ కి.ఈసారి నాన్న,నాన్నమ్మ తో సహా అందరం వెళ్లి పెళ్లి మాటలు మాట్లాడి కట్నం నిశ్చయం చేసుకున్నారు.ఇంతకీ ఆ సంబంధం కుదిర్చింది మా వాళ్ళందరూ మా అన్నతో అక్రమసంబంధం అంటకట్టిన మా కజిన్ భార్యే అని నాకు తర్వాత తెలిసింది.పాపం మా వదిన (కజిన్ భార్య) అంత అభిమానంగా మా అక్కకి తన ఇష్టానికి తగిన సంబంధం కుదిరిస్తే మా వాళ్లంతా తనని గురించి ఎంత హీనంగా మాట్లాడారు అని బాధ అనిపించింది.మా పెద్దక్క పెళ్ళి కుదిరింది సరే,మరి మా అన్నకి ఎంగేజ్ మెంట్ అయ్యింది కదా మరి అన్న పెళ్ళెప్పుడని సందేహం కూడా వచ్చింది.హైదరాబాద్ లో ఉండగానే  Medical Dictionary కొత్తదేదో వచ్చిందట,నువ్వు తీసుకుని నాకు కూడా తీసుకురా మాధవ్ అది ఇక్కడ దొరకడంలేదు అంటూ హేమంత్ ఫోన్ చేసాడు.సరేనని షాపుకి వెళ్తే నా వరకు ఐతే నాదగ్గర డబ్బులు ఉన్నాయి కానీ, ఇంకో రెండోదానికి లేవు.సరే అని కాయిన్ బాక్స్ నుండి అన్నకి ఫోన్ చేశాను.విషయం వినగానే అన్న అక్కడినుండి మా వదిన (కజిన్ భార్య) వాళ్ళ ఇల్లు దగ్గరే కదా నువ్వు అక్కడికెళ్లి తెచ్చుకో నేను తర్వాత తనకి ఇస్తాను అన్నాడు. సరే మా కజిన్ ఉంటాడు కదా అని వాళ్ళింటికి వెళ్ళాను.మా కజిన్ లేదు మా వదిన (కజిన్ భార్య) మాత్రమే ఇంట్లో ఉంది.ఆవిడని అడగటం నాకు ఇష్టంలేకపోయినా మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ రావాలి కదా అని అన్న పంపిన విషయం చెప్పగానే దాందేముంది మాధవ్ ఉండు ఇస్తాను కూర్చో అంటూ లోపలికెళ్ళి డబ్బు తెచ్చి తను కూడా కూర్చుంది.

మామూలుగా అన్ని విషయాలు అడుగుతూ మాటల్లో కావ్య విషయం కూడా వచ్చేసింది.మాధవ్ నువ్వు  కూడా ఆడపిల్లలతో మాట్లాడతావా?చాలా సైలెంట్ గా ఉంటావు కదా? అంటూ నీతో కొన్ని విషయాలు చెప్తాను.ఈ విషయాలన్నీ నేనింతవరకు మీవాళ్ళకి ఎవరికీ చెప్పలేదు.నీద్వారా తెలిస్తే బాగుంటుంది వెళ్ళి అన్నీ చెప్పు. అంటూ ఇక మొదలుపెట్టింది.మీ అమ్మమ్మ, నాన్నమ్మ,అమ్మ,పల్లెటూరి నుండి వచ్చారు కదా ప్రస్తుతం  సొసైటీ ఎలా ఉందో తెలియదు,ఆడవాళ్లు,మగవాళ్ళు కొంచెం సరదాగా ఉంటే చాలు అక్రమ సంబంధాలు అంటారు.మీ ఇద్దరు అక్కలు చదువుకున్నా, చిన్నప్పటి నుండి చాదస్తంగా పెంచిన మీ నాన్నమ్మ దగ్గర వాళ్ళ సరదాలేమీ తీరకపోయుండొచ్చు, అందుకే  పక్కన వాళ్ళమీద నిందలు వేయటం వాళ్ళకొక సరదా.సంతోషంగా ఉన్నవాళ్ళని చూసి ఎదో ఒకటి  అని వాళ్ళ బాధచూసి ఆనందించటం వాళ్ళ సైకాలజీ.నిన్నకాకమొన్న నాలుగువేల జీతంతో ఉద్యోగం వచ్చిన మీ అన్నకంటే ఎక్కువ పొజిషన్లో ఉండి ,ఆస్తులు ఉన్న మేము డబ్బుకోసం మీ అన్నని మోసం చేస్తున్నామని,నాకు,మీ అన్నకి అక్రమసంబంధం అని,మీ పెద్దవాళ్లంతా మాట్లాడారని, మీ అన్నకి కాబోయే భార్య తరుపు బంధువులు చెప్తే  నాకు తెలిసింది.మీ అన్న ఎంగేజ్మెంట్ లో మీ వాళ్ళే వాళ్లతో చెప్పారట. 

వినగానే మీ వాళ్లనే ఇంటికి వచ్చి నిలదీద్దామనుకున్నాను. కానీ మీ పెద్దక్క పెళ్ళి మాటలు జరుగుతున్నఇంట్లో నేను గొడవచేయటం బాగోదని ఆగిపోయాను.మీ పెద్దక్క పెళ్ళి కుదిర్చింది నేనే.నాఇంటికొచ్చి,మీ పెద్దక్క గంటలు గంటలు ఆ అబ్బాయితో ఫోన్లలో మాట్లాడేది.ఆ సినిమా యాక్టర్ కట్టించిన హాస్పటల్ లో డాక్టర్ గా ప్రయివేట్ ప్రాక్టీస్ చేస్తున్న మీ పెద్దక్క అక్కడున్న మగ డాక్టర్లతో సినిమాలు, షికార్లు,షాపింగులకి వెళ్తే ఎదో సరదాగా కొలీగ్స్ తో  వెళ్ళినట్లా?ఇక మీ చిన్నక్క ఇంట్లో అన్న ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ జరుగుతుంటే బంధువులందరి ముందే ఎటు వెళ్లిందో తెలియకుండా వెళ్ళిపోతే మీ అమ్మమ్మ స్నేహితుల ఇళ్ళకి వెళ్ళింది అంటూ సర్దిచెప్తుంది.మీ ఇంట్లో వాళ్ళు చేస్తే తెలియని తనం,అదేపక్కన వాళ్ళు చేస్తే తప్పా??మాధవ్ నువ్వు వాళ్లందరిలో కొంచెం వేరుగా,ఆలోచన ఉన్నవాడిగా  అనిపిస్తావు అందుకే నీతో చెప్తున్నా.నువ్వింకా చిన్నవాడివేమీ కాదు కదా నీకు అన్ని విషయాలు తెలుసు.ఈమాటలన్నీ మీవాళ్ళకి చెప్పు.. అంటూ నేనడిగిన డబ్బు నాచేతిలో పెట్టింది. ఆవిడని చూస్తే కొంచెం బాధగానూ, మా అక్కల్ని అవమానపరిచిందని కొంచెం ఆవేశంగాను అనిపించింది. అసలే మా పెద్దలు నాకు దైవ సమానులు వాళ్ళని ఎవరేమన్నా విని తట్టుకునే శక్తి నాకు లేదు.ఇప్పుడీ మాటలన్నీ ఇంట్లో ఎలా చెప్పాలో ఆలోచించుకుంటూ బుక్ మాత్రం మర్చిపోకుండా తీసుకుని,ఇంటిబాట పట్టాను. 

ఇంటికి రాగానే మా పెద్దలందరి ముందే అన్న కజిన్ దగ్గరికి వెళ్లి డబ్బులు తెచ్చుకున్నావా? అనడిగాడు.నేను డబ్బులు తెచ్చుకున్న విషయంతోపాటూ కజిన్ భార్య అన్న మాటలన్నీ పూస గుచ్చినట్లు చెప్పగానే ముందు అందరూ పూనకాలు వచ్చినట్టు ఆవేశంతో ఊగిపోయారు,తర్వాత మా అన్న రియాక్షన్ ఏంటా అని భయంతో గమనిస్తున్న సమయంలో ఇక మా అన్న శివమెత్తిన సత్యంలా లేచాడు.నా వెనక మీరింత పని చేస్తారా?నా గురించి ఇలా నీచంగా ఆలోచిస్తారా?అంటూ ఆవేశంతో ఊగిపోయి ఇప్పుడే నేను వెళ్లి కజిన్తో,వదినతో మాట్లాడి సారీచెప్పి వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు.అప్పటిదాకా అన్న ఏమంటాడో అని భయంతో బిక్కచచ్చిన అమ్మ, అమ్మమ్మ,ఇద్దరు అక్కలు అందరూ అన్న అలా బయటికి వెళ్ళిపోగానే,ఇక వాళ్ళ నోటికి పని చెప్పి,అసలు నిన్నెవడు వెళ్ళమన్నాడ్రా దానింటికి?వీడి డబ్బులే అక్కడ పెట్టి దానితో నీకిప్పించాడా అంటూ అన్నముందు నోరు కూడా ఎత్తని వాళ్ళు అన్న వెనక ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టారు.వాళ్ళు అన్నని అలా అవమానిస్తుంటే నాకు కూడా చాలా కోపం వచ్చింది.వీళ్లదే తప్పు అనిపించింది.అందరి ఆవేశాలు తీరేదాకా తిట్టుకున్నాక ఇప్పుడు చివరిగా వచ్చిన ఆలోచన అన్నకి కాబోయే భార్య వాళ్లకి ఈ విషయం తెలిసింది ఇప్పుడు పెళ్లి సంగతి ఏంటి?మా అందరికీ తెలుసు ఇది చిన్నక్క పనేనని! మాకజిన్ భార్య మీద కోపంతో ఎంగేజ్మెంట్ రోజు ఎవరితోనో చెప్పిందన్నమాట.కానీ ఈ విషయం అన్నకి తెలిస్తే అక్కని క్షమిస్తాడా? అనే బాధ మా పెద్దలకంటే నాకే ఎక్కువైపోయింది. 

"ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలి అయినారు" పాట ఎక్కడినుండో వినిపిస్తుంది నిజమా నా భ్రమా ??


14, నవంబర్ 2016, సోమవారం

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


కార్తీక పౌర్ణమి ప్రత్యేకం .. 

నిండు చందమామ, వెలుగుల దీపాలు





30, అక్టోబర్ 2016, ఆదివారం

దీపావళి శుభాకాంక్షలు


దీపావళి శుభాకాంక్షలు





1, అక్టోబర్ 2016, శనివారం

శ్రీ కనకదుర్గమ్మ దసరా మహోత్సవములు - 2016


అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం
శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం

ఈరోజు నుండి అమ్మవారి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి.విజయవాడ ఇంద్రకీలాద్రిమీద కొలువై,  భక్తులకు కొంగుబంగారైన అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ సన్నిధిలో భక్తులు అమ్మవారిని రోజుకో అలంకారంలో దర్శించుకుని తరిస్తారు.మేము చిన్నప్పటినుండి విజయవాడలో మా పెద్దమ్మ ఉండటంతో సెలవల్లో తప్పకుండా వెళ్ళేవాళ్ళము.వెళ్ళినప్పుడల్లా కుదిరినప్పుడు మా పెద్దమ్మ మమ్మల్ని  గుడికి తీసుకెళ్లేది.అలా ఆ అమ్మ దుర్గమ్మతో మా అనుబంధం చిన్నప్పటినుండీ ఉంది.ఇక నేను డిగ్రీ, Law విజయవాడలోనే చదవటంతో వీలైనప్పుడు, ఖచ్చితంగా final exams అప్పుడు అమ్మని దర్శించుకొని వచ్చేదాన్ని. ఇప్పటికీ సంవత్సరానికి ఒకసారైనా అమ్మని చూడాలనిపిస్తూ ఉంటుంది.ఈ సంవత్సరం విజయదశమి పర్వదినం సందర్భంగా అమ్మ ఆలయ విశేషాలు నా చిన్నిప్రపంచంలో.. 

శ్రీ కనకదుర్గమ్మ క్షేత్రపురాణము

అప్పటినుండి ఇప్పటిదాకా అమ్మ ఆలయం

అమ్మవారి దసరా నవరాత్రుల అలంకారములు 
 
తెప్పోత్సవం
దసరా నవరాత్రుల పూజా విశేషాలు


చండ ముండాది శుంభ నిశుంభులను
రాక్షసులను సంహరించిన దానవు
ధూమ్రలోచనుని వధించిన దానవు
మహిషాసుర మర్ధన సమయంలో ఎర్రనైన కన్నులు కలదానవు
నిత్యమైన దానవు పాపాలను పోగెట్టేదానవు
అయిన ఓ తల్లీ ! నీకు నమస్కారం

జగన్మాత,జగద్విజేత,శక్తి స్వరూపిణి అయిన విశ్వజనని 
దివ్యాశీస్సులతో, కరుణాకటాక్ష వీక్షణాలతో 
ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ 
 శ్రీ కనకదుర్గమ్మ దసరా మహోత్సవముల శుభాకాంక్షలు 


26, సెప్టెంబర్ 2016, సోమవారం

తమిళనాడు యాత్రా విశేషాలు - రామేశ్వరం



చిదంబరం తర్వాత రామేశ్వరం చేరుకున్నాము.భారత భూభాగం నుండి నాలుగుపక్కలా నీళ్ళు ,మధ్యలో ఉన్న రామేశ్వరం ద్వీపం అద్భుతమైన ప్రదేశం.సహోదరులైన రామలక్ష్మణుల మధ్య ఎంత కష్టమొచ్చినా చెక్కుచెదరని ప్రేమాభిమానాలు, తనను కాపాడటానికి రాముడు వస్తాడని అచంచలమైన మనస్సుతో (లోపల తిట్టుకుంటూ బయట పొగుడుకుంటూ కాకుండా) ఎదురుచూసే సీతమ్మని చేరుకొని, ఆమె నమ్మకం నిలబెట్టటానికి రాముడి కఠినదీక్ష,జంతువులమైనా మాశక్తి చాటుతామన్న వానరసైన్యం స్వామిభక్తి,  ఉడతసాయం,రామనాథేశ్వరునిగా వెలసిన శివయ్య పరిపూర్ణ అనుగ్రహం,అడుగడుగునా ఉన్న పవిత్ర తీర్ధాలు,త్రేతాయుగంలోనే కాదు కలియుగమైనా తలచుకుంటే మానవుడే మహనీయుడు కావచ్చని నిరూపించిన శ్రీ APJ.అబ్దులకలాం గారు జన్మించిన గొప్పప్రదేశం రామేశ్వరంలో అడుగుపెట్టటం ఎన్నోజన్మల పుణ్యఫలం అనిపిస్తుంది. రామేశ్వరం వెళ్ళేటప్పటికి తెల్లవారుఝాము 3 అయ్యింది.రోడ్ బ్రిడ్జ్ మీదనుండి పంబన్ రైల్  బ్రిడ్జ్, రాత్రి నిశ్శబ్దంలో నిశ్చలంగా ఉండి, సన్నగా శబ్దం చేస్తున్న సముద్రాన్ని చూడటం చాలా బాగుంది. 


రామేశ్వరము తమిళనాడులో చెన్నైకి 572 కి.మి దూరంలో రామనాథపురం జిల్లాలో ఉంది .భారత ప్రధాన భూభాగం నుండి వేరు చేయబడి బంగాళాఖాత సముద్రానికి 10మీటర్ల ఎత్తులో శంఖు ఆకారంలో ఉండే చిన్న ద్వీపం రామేశ్వరం.రామేశ్వరం అంతా రామమయమే కాదు అద్భుతాలకు నిలయం కూడా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో సేతుబంధేతు రామేశం అని  వర్ణించే రామేశ్వరం జ్యోతిర్లింగాలలో ఏడవది.హిందువులలో కాశీయాత్రకు ఉన్నంత ప్రాధాన్యత రామేశ్వరానికి ఉంది.కాశీ వెళ్లిన వాళ్ళు రామేశ్వరాన్ని కూడా దర్శిస్తేనే కాశీయాత్ర పూర్తయినట్లని నమ్మకం.భారతదేశానికి తూర్పున పూరీ జగన్నాధుడు, ఉత్తరాన బదరీనాధ్,పశ్చిమాన ద్వారక,దక్షిణాన రామేశ్వరం చార్ ధామ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో దక్షిణాన వెలసిన రామేశ్వరం అద్వితీయమైన క్షేత్రం.రామేశ్వరంలో సముద్రానికి శాంతిసముద్రమని పేరు.ఇక్కడే శ్రీ రాముడు రామసేతును  నిర్మించి లంకకు చేరాడు.


బ్రహ్మ మనవడైన  రావణాసురుడిని సంహరించి ఆ బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవటానికి మహర్షుల ఉపదేశం ప్రకారం రాముడు సీతా,లక్ష్మణ సమేతంగా  రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజ చేయాలని ఆంజనేయుడిని కైలాసం నుండి శివలింగం తెమ్మని చెప్తాడు కానీ చెప్పిన సమయానికి ఆంజనేయుడు అక్కడికి చేరుకోలేకపోవటంతో సీతాదేవి స్వయంగా సైకత లింగాన్ని చేయగా దాన్నే శ్రీరాముడు ప్రతిష్టించి షోడశోపచారాలతో అభిషేకాలు,పూజ పూర్తి చేసిన తర్వాత ఆంజనేయుడు కైలాసం నుండి శివలింగాన్ని తీసుకువచ్చి జరిగిన విషయం తెలుసుకుని సైకత లింగాన్ని తొలిగించటానికి విశ్వప్రయత్నం  చేస్తాడు.చివరికి విఫలమై శ్రీరాముడిమీద అలిగిన ఆంజనేయుడిని ఓదార్చి, హనుమంతుడి తెచ్చిన విశ్వనాధ లింగానికి ముందుగా పూజలు జరుగుతాయని వరమిస్తాడు.ఇప్పటికీ అలాగే ముందుగా ఆంజనేయుడు తెచ్చిన శివలింగానికి పూజలు జరుగుతాయి. ముందుగా విశ్వనాధ లింగాన్ని చూసిన తర్వాతే గర్భగుడిలోని రామనాధ స్వామిని దర్శించాలి.  రాముడు ప్రతిష్టించిన రామనాథేశ్వర స్వామి శివలింగం పరమ పవిత్రమైనది, శైవులకు, వైష్ణవులకు పవిత్ర పుణ్యక్షేత్రం.


ద్రవిడ శిల్పకళారీతిలో నిర్మించిన విశాలమైన ఈ ఆలయం నిర్మాణంలో పన్నెండో శతాబ్ది నుంచి ఎంతో మంది రాజులు పాలు పంచుకున్నారు. ఆలయ మూడు ప్రాకారాల్లోనూ మూడ మండపాలు ఉన్నాయి. మూడో ప్రాకారంలోని మండపం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అటూ ఇటూ 1200 రాతిస్తంభాలతో సుమారు కిలోమీటరున్నర విస్తీర్ణంలో ఉన్న ఈ మండపం అతి పొడవైనదిగా పేరు తెచ్చుకుంది. ఆలయ గోపురం 126 అడుగుల ఎత్తుతో తొమ్మిది అంతస్తులతో  అరుదైన శిల్పకళతో అద్భుతంగా ఉంటుంది.ఆలయం ప్రాంగణం చాలా పెద్దది.


ఆలయంలోపలికి వెళ్లేముందే ఆలయం సమీపంలో ఉన్న సముద్ర తీర ప్రాంతమైన అగ్నితీర్థంలో స్నానం చేసి వెళ్ళాలి.సీతాదేవి కోసం లంకకి వెళ్లే సమయంలో రాముడు ఇక్కడ ఉన్న అనేక తీర్ధాల్లో స్నానం చేయటం వలన రామేశ్వరంలోని తీర్ధాలన్నీ ఎంతో  పవిత్రమైనవిగా,పాపాలను తొలగించేవిగా విశ్వాసం.

అగ్ని తీర్ధం

ఇక్కడి గుడిలోపల  22 తీర్థాలు ఉన్నాయి. ముందుగా ఇక్కడి తీర్థాల్లో స్నానం చేసిన తరవాత అప్పుడు దైవదర్శనానికి వెళతారు. ఒక్కొక్క తీర్థం చిన్న చిన్న బావుల్లా,కోనేరుల్లాగా ఉంటాయి.ఇక్కడ తీర్ధాల్లో స్నానం చేస్తే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని నమ్మకం.బావిలోనుండి నీళ్ళు  బక్కెట్లతో తోడి భక్తుల మీద పోస్తారు. ఆలయంలోపల ఉన్న తీర్ధాలన్నిటిలో చివరిది కోటి తీర్ధం ఇందులో అనేక పుణ్యనదుల నీరు కలిసి ఉంటుందని నమ్మకం.ఆ నీటితోనే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారు.గుడిలోకి వెళ్లేముందే సెల్ ఫోన్స్ కానీ,ఇంకేమీ వస్తువులు దగ్గర లేకుండా చూసుకోవాలి.లేకపోతే స్నానాలు చేసేటప్పుడు  ఇబ్బంది అవుతుంది.ఎక్కడైనా ఒక నదిలో స్నానం చేసి గుడికి వెళ్తుంటాం కానీ ఇక్కడ ముందు సముద్రంలో స్నానం చేసి,తర్వాత ఆలయమంతా తిరుగుతూ 22 బావుల్లో నీళ్లతో స్నానం చేయటం ఈ క్షేతం ప్రత్యేకత.మేము కూడా ఈ తీర్ధాలలో స్నానం చేశాము.ఎవరైనా ఒక గైడ్ ని పెట్టుకుంటే ఒక్కొక్కరికి  కొంత డబ్బు చొప్పున తీసుకుని మనల్ని అన్ని బావుల దగ్గరికి తీసుకెళ్లి ,తిప్పుతూ వాళ్ళే నీళ్ళు  తోడి, తలమీద పోస్తారు.మేము కూడా అలాగే గైడ్ ని తీసుకెళ్ళాము.గైడ్ లేకపోతే  ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో అక్కడ క్యూలో జనాల్ని చూశాక అర్ధమయ్యింది.


గర్భగుడి పక్కనే ఉన్న విశ్వనాధ లింగాన్ని దర్శించుకున్న తర్వాత రామనాధస్వామిని దర్శించాలి.
ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధనీ దేవి.


ఆలయ ప్రాంగణంలోనే ఉన్న పూజా స్టాల్స్ లో ప్రసాదాలు


రామేశ్వరుని దర్శించుకుని బయటికి వచ్చాక చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. శ్రీరామచంద్రుడు సీతమ్మకోసం  లంకకి వెళ్ళటానికి ఇక్కడికి వచ్చి,వానర సైన్యంతో కలిసి రావణుడి మీద యుద్ధానికి సిద్ధమైన ఈ ప్రదేశంలో అడుగడుగునా రాముడి జ్ఞాపకాలే,రాముడి చరిత్రే.ఇన్ని సౌకర్యాలున్న ఈ రోజుల్లో సముద్రాన్ని కూడా దాటి,ఈ ద్వీపంలోకి వచ్చాము.కానీ ఆరోజుల్లో ఎంత ధైర్యంగా ముందడుగు వేసి,తన సైన్యాన్ని నడిపించి,శత్రువుపై  విజయం సాధించిన రాముడు ఎప్పటికీ "రామచంద్రుడతడు రఘువీరుడే" అనిపించింది.

రామేశ్వరంలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు 
ప్రతిచోటా ఇలా బోర్డ్ పెట్టటం వలన easy  గా తెలుసుకొని వెళ్లొచ్చు

గంధమాదన పర్వతం రామనాధ స్వామి దేవాలయానికి 3 కి.మీ దూరంలో ఎత్తైన శిఖరమే గంధమాదన పర్వతం.ఇక్కడ శిఖరం మీద రెండు అంతస్తులతో దేవాలయం ఉంటుంది.ఇక్కడ పైన ఉన్న చిన్న గదిలో రాములవారి పాదముద్రలుంటాయి.సముద్ర ఘోషకు దూరంగా ప్రశాంత వాతావరణంలో కూర్చుని రాములవారు తన సైన్యంతో యుద్ధానికి సంబంధించిన చర్చలు జరిపేవారట.హనుమంతుడు ఇక్కడినుండే లంకకి లంఘించాడని పురాణకధనం.ఇక్కడి నుండి చూస్తే రామేశ్వరం చుట్టుపక్కల అంతా చాలా అందంగా కనిపిస్తుంది. నీలాకాశం,సముద్రంతో కలిసిపోయిందా అన్నట్లు నీలంగా సముద్రం,ఆకుపచ్చని తోటలు చాలా మంచి view ఇక్కడినుండి  ఉంటుంది. 

 గంధమాదన పర్వతం
గంధమాదన పర్వతం నుండి కనిపిస్తున్న సముద్రం,పరిసరాలు

రావణుడిని వ్యతిరేకించిన విభీషణుడు రాముడిని కలిసి శరణు కోరగా విభీషణుడిని సోదరుడిగా భావించిన రాముడు ,పట్టాభిషేకం జరిపించిన ప్రదేశమే రామేశ్వరంలోని కోదండరామాలయం.రామేశ్వరం నుండి 10 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడ రాముడు, విభీషణుడి మధ్య అప్పటి ఘట్టాలను వివరించే చిత్రపటాలు ఉంటాయి. 

కోదండరామాలయం

జటామకుట తీర్ధం - ఇక్కడ ఉన్న కోనేరులో రాములవారు తన జటలను తడిపి స్నానం చేయటంవలన దీనికి జటామకుట తీర్ధం అని పేరు వచ్చింది.ధనుష్కోటికి వెళ్లేదారిలోనే ఆ తీర్ధం ఉంటుంది. నాలుగు వైపులా మెట్లున్న ఈ కోనేరుకి గ్రిల్స్ పెట్టారు
జటామకుట తీర్ధం


రామతీర్ధం, లక్ష్మణ తీర్ధం

రావణుడిని అంతం చేశాక లంక నుండి తిరిగి వచ్చే సమయంలో సీతాదేవి  దాహం తీర్చటానికి రాముడు సముద్రం మధ్యలో  బాణం వేయగా మంచి నీరు పైకి వచ్చాయట.సముద్రం మధ్యనుండి వచ్చే ఈ ఆ నీరు ఇప్పటికీ మంచినీళ్ళుగానే ఉండటం విశేషం.

విల్లుండి తీర్ధం

ధనుష్కోటి - రామేశ్వరానికి దక్షిణం వైపున్న చిన్నగ్రామం ధనుష్కోటి.రామేశ్వరం నుండి 35 కి.మీ దూరంలో ఈ క్షేత్రం ఉంది. రావణుడి లంకలో ప్రవేశించటానికి రాముడు వానరుల సహాయంతో ఇక్కడి నుండే లంకకు రామసేతు వంతెనని నిర్మించి,రావణవధ తర్వాత లంక నుండి తిరిగి వచ్చేటప్పుడు వానరులు తాము కట్టిన రామసేతుని పగలగొట్టినట్లు చెప్తారు.శ్రీరాముడు కూడా ధనుస్సు కొనతో వారధిని పగలగొట్టటం వలన ఈ ప్రాంతానికి ధనుష్కోటి అనే పేరు వచ్చింది.రామేశ్వరం  నుండి ధనుష్కోటి వరకు రైల్వే లైన్ ఉండేది.1964 లో వచ్చిన పెద్ద తుఫానులో ప్రయాణీకులతో వస్తున్న రైలు కూడా కొట్టుకుపోయింది.అప్పటినుండి ధనుష్కోటి గ్రామం లేకుండా పోయింది.ఆతర్వాత రైల్ లైన్ సరిచేసినా ట్రాక్ ని ఇసుకతిన్నెలు కప్పివేయటంతో దాన్ని పూర్తిగా ఉపయోగించటం మానేశారు. ధనుష్కోటి దగ్గర మహోధధి(బంగాళాఖాతం),రత్నాకర(హిందూమహాసముద్రం)సంగమస్థలంలో పవిత్రస్నానం చేయనిదే యాత్ర పూర్తయినట్లు కాదని భావించేవారు.కానీ ప్రస్తుతం అక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోవటంతో రామేశ్వరంలోనే పూజలు జరిపిస్తున్నారు.ఇప్పుడు ధనుష్కోటికి వెళ్లే రోడ్డుమార్గం కూడా అనుకూలంగా లేనందువలన కొంచెం దూరంలోనే మన వెహికల్స్ ఆపేస్తారు.అక్కడ బీచ్ చాలా బాగుంది సముద్రాన్ని చూస్తుంటే అనంతజలవారాశి అనే ఇదేనేమో అనిపిస్తుంది.ఆకాశం,సముద్రంలో నీళ్లకి తేడా లేనంత నీలంగా సముద్రం విస్తరించి ఉంది.అప్పట్లో ఇదంతా ఆ శ్రీరాముడు నడయాడిన నేల కదా అనిపిస్తుంది.

ధనుష్కోటి దగ్గర సముద్రం

అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు

రెండుపక్కలా నీళ్లు, మధ్యలో చిన్నరోడ్డు 
ధనుష్కోటి దగ్గర భారతదేశ చివరి భూభాగం

ఇక్కడ చిన్న పాకల్లో మంచినీళ్లు ,కూల్ డ్రింక్స్, గవ్వలతో చేసిన అలంకరణ వస్తువులు అమ్ముతారు.
ధనుష్కోటి బీచ్ షాపింగ్ :)
ధనుష్కోటి old navy watchtower

ధనుష్కోటి బీచ్ నీలంగా,స్వచ్ఛంగా ఉన్న సముద్రంతో చాలా ఆహ్లాదకరంగా ఉంది.విపరీతమైన ఎండగా ఉన్నా, సముద్రం అలలతో  ఆడుతూ ఎంత సమయమైనా అక్కడ ఉండాలనిపిస్తుంది.కాసేపు అక్కడే ఉండి రామేశ్వరం నుండి వెనక్కి బయలుదేరాము.

పంబన్ బ్రిడ్జ్ కి వచ్చే దారిలోనే కలాం గారి ఇల్లు ఉంటుంది.మేము ట్రిప్ అనుకున్నప్పుడే ముఖ్యంగా చూడాలనుకున్న వాటిల్లో కలాంగారి ఇల్లు ఒకటి.చాలా ఇరుకు గొందుల్లోనుండి వెళ్ళాలి.రామేశ్వరంలో జన్మించి,అక్కడ తిరిగిన మహనీయుడు ఒకప్పటి మన రాష్ట్రపతి శ్రీ A.P.J.అబ్దుల్ కలాం గారు.ఆయన Wings of Fire పుస్తకంలో రాసిన వారి ఇల్లు,పరిసరాలు, ఇంటికి దగ్గర్లోనే ఉన్న మసీదు అన్నీ మారిపోయినా ఆయన పుట్టి,పెరిగిన ప్రదేశాన్ని చూడటం,అక్కడ నిలబడగలగటం కూడా ఆనందమే  అనిపిస్తుంది.భవనములోని మొదటి ఫ్లోర్ లో వారి జీవిత విశేషాలను తెలిపే Mission Of Life Galleryలో చిత్ర ప్రదర్శన,పుస్తకాలను ఉంచారు.ఇక్కడ కావాలనుకుంటే పుస్తకాలు కూడా కొనుక్కోవచ్చు.

Former President A.P.J. Abdul Kalam House
  
ఈ పుస్తకం కలాం గారి లైబ్రరీ నుండి తెచ్చుకోవటం(కొనుక్కునే )
 నాకైతే చాలా గొప్పగా అనిపిస్తుంది. 
 
రామేశ్వరంలో కలాం గారి పేరుతో ఉన్న షాప్.

భారత భూభాగాన్ని,రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ సముద్రం మీద నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ -పంబన్ బ్రిడ్జ్  ఇంజినీరింగ్‌ అద్భుతాల్లో ఒకటి.పంబన్ రైల్వే స్టేషన్ నుండి మండపం రైల్వే స్టేషన్ని కలుపుతుంది. స్టీమర్లు, నౌకలు లాంటివి వచ్చినప్పుడు బ్రిడ్జి రెండుగా విడిపోయి పైకి లేస్తుంది. మధ్యలోనుంచి నౌకలు వెళ్లగానే మళ్లీ యథాస్థానంలోకి వస్తుంది. అంతపెద్ద సముద్రంలో బ్రిడ్జ్ నిర్మించటం,దానిమీద రైల్ వెళ్ళటం అంతా అద్భుతంగా ఉంటుంది.పక్కనే ఉన్న రోడ్ బ్రిడ్జ్ మీద నుండి  నీలిరంగు సముద్రం,  దాని మధ్యలో దృఢంగా నిలబడి ఉన్న ఆ బ్రిడ్జ్ చూడటం గొప్ప అనుభూతి.గూగుల్ Map లో చూసినప్పుడు చుట్టూ సముద్రం మధ్యలో ఉన్న చిన్నద్వీపం ఎంతో భయంగా అనిపించినా, అక్కడికి వెళ్లిన తర్వాత మాత్రం ఆ పరిసరాలు, సముద్రం,బ్రిడ్జి వాటి ఔన్నత్యాన్ని చూడటంలో అన్ని భయాలు మర్చిపోతాము.అక్కడ ఎంతసేపున్నా విసుగనిపించదు.రామేశ్వరం  వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు యాత్రికులు కాసేపు ఈ బ్రిడ్జ్ మీద ఆగకుండా వెళ్ళలేరు.ఒక్కోసారి ఇక్కడ ఆగిపోయే వాహనాలతో ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది.
తళ తళా, మిల మిలా మెరుస్తున్న శాంత సముద్రం 
 Pamban Bridge India’s first sea bridge
 




శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి

India నుండి pamban Bridge శ్రీలంక నుండి రామసేతు మధ్యలో రామేశ్వరం 

ఇవీ మా రామేశ్వరం యాత్రా విశేషాలు.శివయ్య కొలువై ఉన్న పుణ్యక్షేత్రంలో  అడుగుపెట్టాలన్నా,స్వామి దర్శనం కావాలన్నా పరమేశ్వరుడి అనుమతి కావాలట.శివయ్యనే కాదు ఏ దైవదర్శనం కావాలన్నా పుణ్యం చేసుకోవాలని,ప్రాప్తం ఉండాలని మా అమ్మమ్మ అనేది.ఆ ప్రాప్తం మాకు కలిగించిన శివయ్యకు మనసారా నమస్కరిస్తూ ఇక్కడినుండి మా ప్రయాణం కన్యాకుమారికి.
Related Posts Plugin for WordPress, Blogger...