పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

11, డిసెంబర్ 2018, మంగళవారం

శ్రీ ఛాయా సోమేశ్వరాలయం, నల్గొండ - పానగల్లు


శ్రీ ఛాయా సోమేశ్వరాలయం నల్గొండ - పానగల్లు 
Ancient & Mysterious Sri Chaya Someswara Temple



శ్రీ ఛాయా సోమేశ్వరాలయం తెలంగాణా రాష్ట్రం నల్గొండ  జిల్లాలోని పానగల్లు గ్రామంలో ఉంది.నల్గొండ నుండి 5 K.M దూరంలో పానగల్లు గ్రామం చివరిలో,పచ్చని పంటపొలాల మధ్య ఆలయం ఉంటుంది.

తెలంగాణా ప్రాచీన నగరంలో ఒకటైన పానగల్లు పట్టణం క్రీ. శ 11 - 12 శతాబ్దంలో కుందూరు చోళరాజుల రాజధానిగా ఉండేది..కాకతీయులకు సామంతులైన ఈ కుందూరు చోళులు తమ ఆరాధ్యదైవమైన పరమేశ్వరునికి ఈ ఛాయా సోమేశ్వరాలయాన్ని,పచ్చల సోమేశ్వరాలయాన్ని నిర్మించారు.ఈ ఆలయంలో లభించిన పురాతన శాసనాల ప్రకారం కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు కూడా ఆలయ అభివృద్ధికి కృషి చేశారని తెలుస్తుంది. 

ఈ ఆలయాన్ని త్రికూటాలయం అని కూడా పిలుస్తారు.తూర్పుముఖంగా వున్న గర్భగుడిలోని శివలింగంపైన రోజంతా ఒక స్తంభాకారలోని నీడ పడుతూ ఉంటుంది .ఇదే ఛాయా సోమేశ్వరాలయం లోని  ప్రత్యేకత.ఎప్పుడూ నీడతో (ఛాయ)కప్పబడి ఉంటాడు కాబట్టి ఇక్కడ స్వామికి ఛాయా సోమేశ్వరుడనే పేరు వచ్చింది.సుమారు పది దశాబ్దాలు ఈ నీడ ఎలా వస్తుందో ఎవరికీ తెలియని మిస్టరీ ఈ ఆలయంలో వుంది అంటారు.కానీ ఈ మధ్య తెలంగాణకే చెందిన ఎవరో టీచర్  ప్రయోగాలు చేసి నీడ ఎలా వస్తుందో కనిపెట్టారని చెప్తున్నారు. 

ఆలయంలో ప్రధాన మండపంలో స్తంభాలు,వాటిపైన శిల్పకళ చాలా బాగుంటుంది.ఆలయ ప్రాంగణంలో శిధిలమైన నంది విగ్రహాలు ,మండపాలు కనిపిస్తాయి.మేము 2016 పుష్కరాల తర్వాత వెళ్ళాము.పుష్కరాలకు గుడిని కొంచెం సరిచేశారని చెప్పారు అక్కడి పూజారి.సోమేశ్వరాలయం  హైదరాబాద్ నుండి 100 K.M దూరంలో ఉంటుంది.

పానగల్లు గ్రామంలో ఉన్న మరో శివాలయం పచ్చల సోమేశ్వరాలయం.దీన్ని కూడా కుందూరు చోళులు నిర్మించారు. ఆలయంలో 70 స్తంభాల మండపం,స్తంభాల మీద రామాయణ,మహాభారత ఘట్టాలు,పురాణ పాత్రలు చూస్తున్నట్లుగానే అనిపించే పెద్ద నంది ఈ ఆలయ ప్రత్యేకతలు.

ఆలయ విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు.

శ్రీ ఛాయా సోమేశ్వరాలయం





Related Posts Plugin for WordPress, Blogger...