పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

27, మార్చి 2012, మంగళవారం

వివాహ చట్టాల సవరణ బిల్లు,2010 - వివాదాలు ...!


THE MARRIAGE LAWS (AMENDMENT) BILL, 2010
A BILL further to amend the Hindu Marriage Act,
1955 and the Special Marriage Act, 1954.

గత కొంత కాలంగా టీవీల్లో, పేపర్లలో,అలాగే మన బ్లాగుల్లో కూడా తీవ్రమైన చర్చ
జరుగుతూన్న అంశం ఈ వివాహ చట్టానికి జరిగిన సవరణలు.
ఈ సవరణల ద్వారా ఇకనుండి విడాకులు పొందటం సులభం అవుతుంది.

సవరణలోని ముఖ్యాంశాలు:

1.భర్త తో వైవాహిక సంబంధాలు సరిదిద్దలేనంతగా పాడయ్యాయి
"on the ground that the marriage has broken down irretrievably.
"
అనే కారణంతో భార్య విడాకుల కోసం కోర్టును కోరవచ్చు..
కానీ ఇదే కారణంతో భర్త విడాకులు కోరలేడు.
అంతే కాకుండా వేచి ఉండే కాలం పేరుతో విడాకుల కోసం ఏళ్లతరబడి
కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
కానీ ఈ వేచి ఉండే కాలం ఎంత అనేది కోర్టు నిర్ణయిస్తుంది.

2.విడిపోయాక భర్త నుండి కేవలం భరణం తో సరిపెట్టుకుంటున్న స్త్రీలు ఇక నుండి
"వివాహానంతరం" భర్త సంపాదించిన ఆస్తిలో వాటా కోరవచ్చు..
కానీ ఆ వాటా ఎంత అనేది కోర్టు నిర్ణయిస్తుంది.

3.దంపతులు విడిపోతే వాళ్ళ దత్త సంతానానికి కూడా కన్న బిడ్డలతో
సమానంగా
అన్ని హక్కులూ లభిస్తాయి.

ఇవీ వివాహ చట్టానికి సంబంధించి కేంద్రప్రభుత్వం ఆమోదించిన సవరణలు.

ఇంక చట్టం అమలులోకి వచ్చి అది ఎలా మన వివాహవ్యవస్థ మీద ప్రభావం చూపుతుందో
తెలియక ముందే దీని మీద చాలా చర్చలు వాదోపవాదాలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా ఈ చట్టాన్ని పురుషులు ఎక్కువగా వ్యతిరేకిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
ఎక్కడ భార్యలకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందో అని చాలా బాధపడుతున్నారు.

కొంతమంది మగవారు పెళ్ళిళ్ళు చేసుకోవటం కూడా మానుకుంటారట కూడా..
ఎందుకంటే ఇక ఇప్పటి నుండి ఆడవాళ్ళుభర్త ఆస్తి చూసి పెళ్లి చేసుకుంటారు,
విడాకుల తర్వాత రాబోయే ఆస్తి కోసం అని.

కొంతమంది భర్తలు,భర్త తరపు వారు ఆడపిల్లల్ని అనే మాట మా ఆస్తికి ఆశపడి
నువ్వు మా వాడిని పెళ్లి చేసుకున్నావు అని..
మరి అలాంటప్పుడు అబ్బాయిలు కూడా సంబంధాలు చూసేటప్పుడు మామగారు
ఇచ్చేకట్నంతో పాటూ,అమ్మాయి ఎంత చదువుకుంది,ఉద్యోగం చేస్తే ఎంత సంపాదిస్తుంది??
ఇలాంటివన్నీ చూసే కదా పెళ్లి చేసుకుంటారు.
అంటే అప్పుడు మగవారు భార్య నుండి వచ్చే డబ్బుకి ఆశపడినట్లు కాదా??

ఆడపిల్ల కట్నం తేవాలి,మనకి అనుగుణంగా,అనుకూలంగా ఉండాలి అని మగవారు
కోరుకున్నట్లే ... అల్లుడు మంచి ఆస్తిపరులై ఉండాలి,భర్త మంచి హోదాలో ఉండాలి
అని అమ్మాయిలూ కోరుకుంటారు.అందుకే అడిగినంత కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తారు.

ఈ రోజుల్లో డబ్బుకి,ఆస్తులకి ఆశ పడని మనుషులే లేరు.. ఒక భార్యే కాదు..
తల్లిదండ్రులు,అక్క చెల్లెళ్ళు,అన్నాదమ్ములు,కొడుకులు,కూతుర్లు కూడా
ఆస్తుల్లో వాటా కోసం కోర్టుని ఆశ్రయిస్తూనే ఉన్నారు.
మన రక్తం పంచుకుని పుట్టి,మనతో కలిసి పెరిగిన తోబుట్టువులు,తల్లి దండ్రులే ఆస్తుల కోసం
కోర్టుకి వెళ్లి, బెదిరించి, వాళ్ళ హక్కులు వాళ్ళు పొందుతున్నప్పుడు భర్త నిరాదరణకు గురైన భార్య
విడాకులు తీసుకునే సమయం లోఆ హక్కును కోరుకుంటే తప్పేంటి ??
కాబట్టి విడాకులు తీసుకునే సమయం లో భార్య భర్త ఆస్తిలో వాటా అడగవచ్చు
అంతమాత్రాన అది డబ్బుకి ఆశ పడినట్లు కాదు.

ఇంతకీ భార్య విడాకులు కోరగానే విడాకులు ఇవ్వటం,ఆస్తిలో వాటా కోరగానే ఇవ్వటం
ఇవన్నీ ప్రస్తుతానికి కాగితం మీద రాతలు మాత్రమే!
నిజంగా ఇలాంటి రిలీఫ్ కోరి ఎవరైనా స్త్రీ కోర్టుకు వెళ్ళినప్పుడు ఉంటుంది అసలు కధ
"విడాకుల కోసం వేచి ఉండే సమయం", అలాగే భర్త ఆస్తిలో వాటా ఎంత ఇవ్వాలి అనేది జడ్జ్
యొక్క "Court's discretionary powers" "విచక్షణా అధికారానికే" ప్రస్తుతం వదిలేశారు.
కాబట్టి మన లాయర్లు కొందరికి ఈ అవకాశం చాలు జడ్జ్ ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి
అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదు.,

అలాగే భర్తలు కూడా భార్య అడగ్గానే వాటా ఇచ్చేంత అమాయకులేమీ కాదు ..
సంపాదించిన ఆస్తిని ఎవరో ఒకరి పేరున బినామీగా అయినా పెడతారు కానీ భార్యాపిల్లలకు
ఇవ్వటానికి ఇష్టపడరు కొందరు..

ఇంకా తెలివి మీరిన లాయర్లు ఉంటే నాకు పిచ్చి,నేనేమీ పని చేయను అని చెప్పెయ్యండి..
మీ వాళ్ళు అప్పుడు మీకోసం ఒక మెంటల్ సర్టిఫికేట్ తెస్తారు..
ఇంక మీరు,మీ వాళ్ళు సేఫ్ అప్పుడు..మిమ్మల్నేమీ చేయలేక మీ భార్య నోరు మూసుకుని
వెళ్ళిపోతుంది అని ఇలాంటి చావు తెలివితేటలు ఉపయోగించి సలహాలు కూడా ఇస్తున్నారు.

కాబట్టి మగవాళ్ళూ ... మీరేమీ భయపడకండి శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాల్లాగా
మీరేమీ నష్టపోకుండా బయటపడే సూచనలు చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మందే ఉంటారు.

ఇంక కొందరి బాధ విడాకులు తీసుకోవటం వలన మన భారత దేశ సంస్కృతికి మాయని మచ్చ
పడుతుంది అని.
మన భారత సంస్కృతిలో ఇంతకుముందు లేని విపరీతాలు ఎన్నో ఇప్పుడు జరుగుతున్నాయి.
ఉదాహరణకి ఓల్డ్ ఏజ్ హోమ్స్! ఒకప్పుడు తల్లిదండ్రులను దైవంలాగా పూజించే వాళ్ళు ..
వాళ్ళు చనిపోయే దాకా కొడుకుల దగ్గరే ఉండటం ఒకప్పటి మన సాంప్రదాయం..
మరి ఇప్పడు వీధి వీధికి ఒక ఓల్డ్ ఏజ్ హూమ్ ఎందుకు వస్తున్నాయి.ఇది కూడా భార్య కారణంగానే
అనే వాళ్ళు లేకపోలేదు..కానీ ఎంత మంది కొడుకులు పెళ్ళికి ముందే తల్లిదండ్రులను ఒంటరిగా
వదిలేసి
ఇతర దేశాలకి వెళ్ళటం లేదు??

కాబట్టి విడాకులు ఒక్కటే మన సంస్కృతికి మాయని మచ్చ కాదు..దీన్ని మించిన ఘోరాలు
ఎన్నో ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఎన్నో చట్టాలు మన దేశంలో దుర్వినియోగం అవుతుండగా దీన్ని గురించే ఇంత చర్చ ఎందుకంటే
ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమస్య కాబట్టి.సొంత ఆస్తిని కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి.

అలాగని విడాకులు ప్రోత్సహించమని నా ఉద్దేశ్యం కాదు ..
ఏ ఆడవాళ్ళైనా విడాకులు తీసుకోవాలని,పెళ్ళికి ముందే విడాకులు తర్వాత రాబోయే
భర్త ఆస్తి కోసం ఆశపడి,ప్లాన్స్ వేసుకుని పెళ్లి చేసుకునే స్థాయికి దిగజారతారని నేను అనుకోను.

అలాగే చిన్న చిన్న కారణాలకే విడాకులకి వెళ్ళే ఆడవాళ్ళు,మగవాళ్ళు ఇద్దరూ ఉండరు
అని నా అభిప్రాయం.. విడాకులు కోరగానే ఇచ్చేస్తున్నారు కదా అని ఆడవాళ్ళందరూ
వాటి కోసం పరిగెత్తి వెళ్లి తెచ్చుకోవటానికి అవేమీ డిస్కౌంట్ లో ఇచ్చే చీరలు కాదు కదా!
చట్టాలని దుర్వినియోగం చేసే వాళ్ళు లేరని కాదు..అలాగని అందరూ చట్టాన్ని
దుర్వినియోగం చేస్తున్నారని అపోహ పడటం తప్పు.

ప్రతి ఒక్క మనిషికీ తెలుసు సమాజం నిర్ణయించిన కొన్ని హద్దుల్ని దాటితే ఎలాంటి పరిస్థితులను
ఎదుర్కోవాల్సి వస్తుందో అని! కాబట్టి .. ఏ మనిషీ కూడా చూస్తూ చూస్తూ బాగున్న పరిస్థితులను
చెడ గొట్టుకోలేరు. అలాగే విరిగిన మనసులు ఎప్పటికీ కలవవు... సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు
కాదు ఒక్కసారి విభేదాలు వచ్చి విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత, ఎంత ప్రయత్నించినా,
ఎన్నాళ్ళు వేచి ఉన్నా ఫలితం ఉండకపోవచ్చు.

ఏది ఏమైనా ఎవరి అభిప్రాయాలు వారివి...అలాగే ఎవరి నిర్ణయాలు వారివి..
నా మనసుకు అనిపించింది నేను చెప్పాను.ఎవరినో ఒక్కరినే నేను సపోర్ట్ చేయటం లేదు.
తప్పు అందరిలోనూ ఉంటుంది. కాకపొతే దాన్ని సరిదిద్దుకునే విధానమే మనిషి మనిషికీ మారుతుంది.


Related Posts Plugin for WordPress, Blogger...