పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

16, అక్టోబర్ 2012, మంగళవారం

అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి శరన్నవరాత్రులు


జగన్మాత,జగద్విజేత,శక్తి స్వరూపిణి అయిన ఆ విశ్వ జనని శరన్నవరాత్రులు నేటి నుండి ప్రారంభమయ్యాయి.ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు ‘శరన్నవ రాత్రులు’ అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులూ దీక్షతో అమ్మవారిని పూజించటం సంప్రదాయం. అలా సాధ్యం కాని వారు తదియ నుండి గాని, పంచమి నుండి గాని, సప్తమి నుండి కాని ప్రారంభించి దేవిని పూజిస్తారు. ఈ నవరాత్రులలో పరాశక్తిని విధి విధానంగా పూజించి, దశమి రోజున ఏదైనా పనిని ప్రారంభిస్తే తప్పక విజయం లభిస్తుందనేది విశ్వాసం.ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమిగా చెప్పబడుతుంది. దీనికే అపరాజిత దశమి, దసరా అని కూడా పేర్లు. ఈ రోజున ఏ పనిని ప్రారంభించినా అందులో తప్పక విజయం లభిస్తుంది. ఈ రోజు సాయంత్రం జమ్మిచెట్టును దర్శించి పూజించాలి. జమ్మిచెట్టును పూజిస్తే అన్నింటా విజయం లభిస్తుందని అంటారు.

శ్రీ బాలా త్రిపుర సుందరి - 16-10-2012
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 

నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది.త్రిపుర త్రయంలో ఈ దేవి మొదటిది.బాలా దేవి    మహిమాన్వితమైనది.శ్రీ బాలా త్రిపుర సుందరి మంత్రం సమస్త దేవీ మంత్రాలలోకెల్లా గొప్పది.అందుకే శ్రీ విద్యోపాసకులకు మొట్ట మొదట ఈ బాలా మత్రాన్నే ఉపదేశిస్తారు.పవిత్ర శ్రీ చక్రంలో మొదటి అమ్నాయం లో వుండే మొదటి దేవత బాలాదేవి. అందుకే ముందుగా ఆ దేవిని పూజిస్తే మహా త్రిపురసుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతాము.



మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోద్యమే |
పేలానిర్మిత ధూమ్ర లోచన వధే,  హేచండ ముండార్దిని |
నిశ్శేషీకృత రక్తబీజ దనుజే | నిత్యే | నిశుంభాపహే |
శుంభ ధ్వంసినీ  సంహారాశు దురితం దుర్గే  | నమస్తే అంబికే !

చండ ముండాది శుంభ నిశుంభులను 
రాక్షసులను సంహరించిన దానవు!
ధూమ్రలోచనుని వధించిన దానవు!
మహిషాసుర మర్ధన సమయంలో ఎర్రనైన కన్నులు కలదానవు!
నిత్యమైన దానవు! పాపాలను పోగెట్టేదానవు 
అయిన ఓ తల్లీ ! నీకు నమస్కారం!

ఆ జగన్మాత సమస్త లోకాన్ని తన చల్లని చూపులతో.
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించాలని ప్రార్ధిస్తూ...
 అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు!

    శ్రీ బాలా త్రిపుర సుందరి స్తోత్రం





Related Posts Plugin for WordPress, Blogger...