పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, డిసెంబర్ 2012, సోమవారం

మరికొద్దిసేపట్లో మన నుండి సెలవు తీసుకుంటున్న 2012 కు వీడ్కోలు పలుకుతూ..




 సంవత్సరం క్రితం ఏంతో  సంతోషంగా 
నా ఆహ్వానం అందుకుని మెరుపులా వచ్చి ...

ఎదురుచూపులలో నిదానంగా కదులుతూ 
కంగారులో నా మనసు కంటే  వేగంగా పరిగెత్తుతూ 
సంతోషంలో అప్పుడే అయిపోయిందా అనిపిస్తూ
బాధలో అసలు కదలకుండా మొరాయిస్తూ 
విసిగిపోయినప్పుడు నన్ను మరింతగా విసిగిస్తూ 

 కొత్త బంధాలను,స్నేహాలను చుట్టూ అల్లుతూ 
విజయాలను ఆనందించటంతో పాటూ 
ఓటమిని ఎదుర్కునే ధైర్యాన్ని అందిస్తూ 
అన్ని ఋతువుల ఆనందాలను జీవితంలో పంచుతూ..

నవ్విస్త్తూ ... ఏడిపిస్తూ ... కొత్త  ఆశలను కల్పిస్తూ
మంచి,చెడు,బాధ,సంతోషం,లాభం,నష్టం 
అన్నిటిలో వెన్నంటి ఉండి ,నాతో 365 రోజులు ప్రయాణం చేసి,
ఇంకొన్ని గంటల్లో వీడ్కోలు పలుకుతుంది 2012...

ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా తీపి,చేదుల కలయికగా ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెళ్లిపోయినట్లు అనిపించింది.. కుటుంబపరంగా 
ప్రతి  మనిషికీ ఏవో  సమస్యలు ఎలాగో వస్తుంటాయి పోతుంటాయి.అలాగే సమాజంలో కూడా ఈ సంవత్సరం ఎన్నో సమస్యలు, ప్రతి మనిషీ భయపడే ఎన్నో సంఘటనలు జరిగాయి.

ఆగదేనాడు కాలము ఆగినా గడియారము అంటూ  ఎవరి కోసమూ ఒక్క క్షణము కూడా ఆగని కాలం కదిలి పోతూనే వుంది.. నిన్న జరిగిన దాని నుండి నేర్చుకుని  ,ఈ రోజు జరిగేదాన్ని గురించి ఆలోచిస్తూ ,రేపటి మన కలను నిజం చేసుకోవటమే జీవితం. ఈ జీవితప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పడిలేచే కడలి తరంగం నాకు ఆదర్శం.. ఓడిపోతాను.. ఓడినా గెలుస్తాను అనే నమ్మకమే మనిషిని సంతోషంగా ఉంచుతుంది అని నమ్ముతాను.

మరికొద్దిసేపట్లో మన నుండి సెలవు తీసుకుంటున్న  2012 కు  వీడ్కోలు పలుకుతూ.. రాబోయే కాలం అంతా మంచి జరగాలని కోరుకుంటూ...




25, డిసెంబర్ 2012, మంగళవారం

ఏమైపోతుంది సభ్యసమాజం ... ఏమైపోతుంది మానవ హృదయం




2012 యుగాంతం ప్రపంచం అంతా అంతమైపోతుంది.. ఇంక ఈ  భూమి మీద మనుగడ లేదు అని అందరూ భయపడ్డారు.కొందరు బాధ పడ్డారు.కొంతమంది చూద్దాంలే అంత  తేలికగా యుగాంతం అవుతుందా అనుకున్నారు.కొందరు ఉంటే  ఎంత పొతే ఎంతలే అని వేదాంతం చెప్పారు.కానీ ప్రస్తుత సమాజాన్ని,పరిస్థితులను చూస్తుంటే నాకనిపిస్తుంది 2012 యుగాంతం మనుషులకా? మనుషుల్లోని మానవత్వానికా ??  అని..

ఆడవాళ్ళ మీద అత్యాచారాలు,హత్యలు,ప్రేమోన్మాదుల దాడులు
భార్యను బయటికి గెంటేస్తున్న భర్తలు, భర్త ఇంటిముందు  భార్యల మౌన దీక్షలు.

భార్య మీద అనుమానంతో పిల్లలకు DNA టెస్టులు చేయించమనే తండ్రులు
భర్త మీద కోపంతో క్షణికావేశంలో కడుపున పెట్టుకుని కాపాడాల్సిన పిల్లలను  కడతేర్చే మాతృమూర్తులు

కీచకావతారం ఎత్తుతున్న గురుదేవులు
బడిలో బాలికకూ,విశ్వవిద్యాలయంలో మహిళలకు తప్పని లైంగిక వేధింపులు

బతికుండగానే కన్నతల్లిదండ్రులను స్మశానానికి చేరుస్తున్న సుపుత్రులు,పుత్రికలు
తమ కడుపున పుట్టిన పిల్లలే తమని వేధిస్తున్నారంటూ కాపాడమని HRC ని ఆశ్రయిస్తున్న పండుటాకులు.

ప్రజారక్షణే మీ కర్తవ్యం  కదా మమ్మల్నిరక్షించమని  వచ్చిన మహిళను కోరిక తీర్చమనే రక్షక భటులు
తన కింద పనిచేసే మహిళా ఉద్యోగితో అక్రమసంబంధం పెట్టుకుని ఆమెను వంచించే న్యాయమూర్తులు.

ఇలాంటివన్నీ గత కొన్ని సంవత్సరాలుగా " FIR " " CRIME REPORT " అంటూ టీవీల్లో యాంకర్లు
మహా సీరియస్ గా వీటి గురించి చెప్తూ ఉంటారు...వాటిని చూస్తూ,వింటూ ఇదేముందిలే ఇలాంటివి రోజూ జరుగుతూనే వున్నాయి అనుకోవటం,వాటిలో నిజానిజాలు ఎంత? ఎవరిది తప్పు ? అని మనమే నిర్ణయించేసుకోవటం కాసేపటి తర్వాత ఆ విషయాలు మర్చిపోవటం.. వదిలేయటం.. ఇలా మనమందరం ఈ దారుణాలను,అమానుష సంఘటనలను సమాజంలో భాగంగా చాలా తేలికగా తీసుకునే స్థాయికి వచ్చాము...

ఇలాంటి సమయంలో రాజధానిలో జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన  ఇంతకుముందు కేసుల్లాగానే  విచారణ,పరిష్కారం అంటూ సంవత్సరాలు పడుతుందిలే  అనుకున్నాము.. కానీ ఈ అత్యాచారం విషయంలో ప్రజల్లో,మహిళా సంఘాల్లో,ముఖ్యంగా యువతరంలో కలిగిన స్పందన అనూహ్యం, ప్రశంసనీయం. వారిలో చెలరేగిన ఆవేశం,దోషులకు ఉరిశిక్షపడాలనే ఆవేదన ప్రభుత్వాన్ని,పాలకులను  ఆలోచనలో పడేలా చేసింది.వీరి దీక్షకు మధ్యవయస్కులు, సాదారణ పౌరులు కూడా మద్దతు పలకటం సమాజంలో మిగిలి ఉన్న మానవత్వానికి నిదర్శనం అని చెప్పొచ్చు.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతను చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా హింసాత్మక చర్యలకు కూడా ప్రభుత్వం వెనుకంజ వేయకపోవటం శోచనీయం...

అమ్మాయిల మీద దాడులు జరిగినప్పుడు అసలు అమ్మాయిల వస్త్రధారణ సరిగా లేదు అందుకే
మగవాళ్ళు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు అంటాడు ఒక అధికారి.

అసలు ఆడవాళ్ళకి అర్ధరాత్రి తిరిగే సాతంత్ర్యం,హక్కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నిస్తాడు  మరో నాయకుడు ..

 అర్ధరాత్రి బాయ్ ఫ్రెండ్ తో తిరిగే ఆడపిల్లలు ఇలాంటివి జరుగుతాయని తెలియదా అంటారు పెద్దవాళ్ళు.

అసలు ఆడవాళ్ళదే  తప్పు ఎక్కడ ఎలా ఉండాలి?ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలి? అని తెలుసుకోవాలి అంటారు సాంప్రదాయవాదులు.( ఇది కొంతవరకు నిజమే)

చట్టం,న్యాయం తన పని తాను  చేసుకుపోతుంది అంటారు మేధావులు..

సరే వీళ్ళ మాటలే నిజమని ఒప్పుకుంటే  సినిమాలు,సినిమాల్లో చెడుని చూసి పెడత్రోవ పట్టే యువత
అంత తేలికగా సినిమాలను చూసి ప్రభావితం అయ్యేటట్లయితే సినిమాల్లో మంచిని చూసి నేర్చుకోవచ్చు
కదా  మంచి వస్త్రధారణ,ప్రవర్తన ఉన్న మహిళల మీద దాడులు జరగట్లేదా?బయట తిరిగే స్వాతంత్ర్యం
లేకపోతె పోనీ ఆఫీసుల్లో స్వేచ్చగా పనిచేసుకునే పరిస్థితులు ఉన్నాయా??కార్యాలయాల్లో,కాలేజీల్లో ప్రయాణాల్లో,కనీసం ఇంట్లో  ఇలా ఇంకెన్నో చోట్ల చెప్పుకోలేని ఇబ్బందులకు గురయ్యి మౌనంగా బాధపడే
మహిళలు ఎందరో  లేరా?

వీటన్నిటికీ కారణం నేరస్తుల్లో చట్టం,న్యాయం మమ్మల్ని ఏమి చేస్తాయిలే అన్న తెగింపు, ఎన్ని తప్పులు
చేసినా చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని తప్పించుకో గలము అనే లెక్కలేనితనం..దీనికి పరిష్కారం లైంగిక నేరాల చట్టాలను సవరించి, మరింత పటిష్టం చేయటం,ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేసి వేగవంతంగా విచారణ పూర్తి  చేయటం,ప్రలోభాలకు లొంగకుండా తీర్పును వెలువరించి,శిక్షను అమలుచేయటం ప్రస్తుత కర్తవ్యం. .అని అందరి అభిప్రాయం .

 అలాగే ప్రభుత్వం, పాలకులు మహిళలలోని లోపాలను ఎత్తిచూపి మీ వల్లనే ఇలా జరుగుతున్నాయంటూ
తప్పును ఆపాదించి,నిందించకుండా మీ ప్రయత్నం లో భాగంగా సరైన శాసనాలను,చట్టాలను చెయ్యాలి.
మహిళలకు రక్షణ కల్పించాలి..ఆపదలో ఉన్నామని ఆశ్రయించిన వాళ్లకు సత్వర సహాయం అందించే రక్షణ యంత్రాంగాన్ని సక్రమంగా అమలు చేయాలి. మనుషుల్లో సాటి మనిషిని మనిషిగా గౌరవించే  సహృదయం,మానవత్వం, నైతికవిలువలు, మంచి.చెడుల విచక్షణా జ్ఞానం పెంపొందాలి.

ఈ సమస్య తీరిపోతే ఇంకే సమస్య రాదన్న నమ్మకం లేకపోయినా, ఉరిశిక్ష,లేక ఇంకే కఠిన శిక్ష పడితేనో
ఇంకో నేరస్తుడెవడూ ఇలాంటి నేరం చేయడన్న నమ్మకం లేకపోయినా మంచి మనస్సుల్లో  మొదలైన
ఈ ఉద్యమం రాజకీయరంగు పులుముకోకుండా  అనుకున్న లక్ష్యం సాధించాలని కోరుకుంటూ,
సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి సంఘటనలు  మళ్ళీ జరగకూడదని,  తాను ఎలాంటి తప్పు
చేయకపోయినా  దారుణమైన శిక్ష అనుభవిస్తున్న బాధితురాలికి సరైన న్యాయం జరగాలని
సాటి మనుషులుగా ఆకాంక్షించటం మానవత్వం  ఉన్న ప్రతి  మనిషి  కర్తవ్యం...




23, డిసెంబర్ 2012, ఆదివారం

పదకవితా పితామహుడు - అన్నమయ్య






అన్నమయ్య - తాళ్ళపాక అన్నమాచార్యులు (1408-1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు .వాగ్గేయకారుడంటే పాటలు స్వయంగా వ్రాసి పాడేవాడని అర్ధం.అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణపధంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలములోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసుకొని ఉంటాయి.. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమైపోయాయి.

అన్నమయ్య మనుమడు "తాళ్ళపాక చిన్నన్న"  "అన్నమాచార్య చరితము" అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు..అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు
ఈ రచనే ఆధారం.

"తెలుగు పదానికి జన్మదినం - అన్నమయ్య జననం"
సంతానం లేని అన్నమయ్య తల్లిదండ్రులు వెంకటేశ్వరస్వామికి మొక్కుకుని,తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని అన్నమయ్య జన్మగాధ..

తన 8వ ఏట ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుతుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోతున్న ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది.
"వేడుకుందామా  వేంకటగిరి వేంకటేశ్వరుని
అని  కీర్తిస్తూ  యాత్రికులతో కలిసి తిరుపతి చేరుతాడు అన్నమయ్య..తిరుమల కొండను  సందర్శించి పరవశం తో
"అదివో అల్లదివో శ్రీ హరివాసము" 
అంటూ  తిరుమల గిరులను  స్తుతించి,గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ,

"అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల"
అని వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే  జీవితం గడపసాగాడు అన్నమయ్య.. అన్నమయ్య చెప్పిన కీర్తనలను ఆయన శిష్యులు గానం చేస్తూ తాళపత్రాలలో భద్రపరచేవారట ..

అంటూ  లక్ష్మీదేవిని, 
"పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు" అని అలమేలుమంగను 
"పలుకు తేనెల తల్లి  పవళించెను" అంటూ పద్మావతీదేవిని
కీర్తించే అన్నమయ్య కీర్తనలను వినటం అమ్మవారికి కూడా చాలా ఇష్టమట. 

అంటూ స్వామివారి బ్రహ్మోత్సవాలలో స్వామిని కీర్తించాడు అన్నమయ్య.ఇప్పటికీ బ్రహ్మోత్సవం అంటే అందరికీ గుర్తొచ్చే పాట ఇది.
అంటూ మనుషులందరూ పరబ్రహ్మ స్వరూపమే అని, కులమతాల వివక్షను తొలగించే ప్రయత్నం చేశాడు.

 విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు. అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో ప్రసిద్ధమయ్యింది. 

"ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను" 
అంటూ అన్నమయ్య స్వామివారి శృంగారాన్ని  గురించి పాడిన పాటను విన్న  నరసింగరాయలు తరువాతి కాలంలో  అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట..రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు.

"దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివే"
"అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితినీ"
అని స్వామివారిలో ఐక్యం అయ్యాడు అన్నమయ్య..

అన్నమయ్య శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీర్తనా చార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు
  
అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అన్నమయ్య  కీర్తనలు ఆ దేవ దేవునికే కాదు ఆబాల గోపాలానికి అన్నమయ్య పాటలు ప్రియమైనవే ...అందుకే కదా ప్రతి తెలుగుతల్లి తన బిడ్డకు చందమామను చూపిస్తూ,గోరుముద్దలు తినిపిస్తూ...
"చందమామ రావో జాబిల్లి రావో"
అంటూ  పాడుతూంది..
అంటూ జోలపాడి నిద్రపుచ్చుతుంది.

ఇప్పటికీ తిరుమల గిరివాసుడు అన్నమయ్య మేలుకొలుపు వింటూ నిదురలేచి,జోలపాట వింటూ నిద్రపోతాడట.అన్నమయ్య పాట స్వామి  దైనందిన చర్యలో ఒక భాగమై నిలిచింది.నిధి కాదు హరిపద సన్నిధి చాలా సుఖమని నమ్మి నడచిన పరమభాగవతుడు అన్నమయ్య...అన్నమయ్య పదములు వినగలిగిన మనమూ ధన్యులమే 

 

ఇందరికి అభయమ్ము లిచ్చు చేయి..



  ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగంటే అన్నమయ్య పాట అనిపించుకున్నతెలుగు పదకవితా పితామహుడు 
శ్రీ తాళ్ళపాక  అన్నమాచార్యులకు వందనములతో.


 

14, డిసెంబర్ 2012, శుక్రవారం

కార్తీకమాసం - మా సత్యనారాయణస్వామి వ్రతం





హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసంలో మేము చేసుకున్న 
సత్యనారాయణ స్వామివ్రతం 

శ్రీసత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా
 నోచిన వారికి నోచిన వరము
చూసిన వారికి చూసిన ఫలము



 

 





శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా





Related Posts Plugin for WordPress, Blogger...